యెహెజ్కేలు
1
దేవుని మహిమ ప్రకాశం, నలుగు జీవుల దర్శనం
1
నా వయస్సు ముప్ఫయ్యవ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకుంది. నేను దైవ దర్శనాలు చూశాను. ఆ రోజుల్లో నేను కెబారు నది దగ్గర బందీల మధ్య నివసిస్తున్నాను.
2
అది యెహోయాకీను రాజును బందీగా పట్టుకెళ్ళిన తరువాత ఐదో సంవత్సరం. ఆ నెల ఐదో రోజున
3
కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
4
అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది.
5
దాని మధ్యలో నాలుగు జీవుల్లాంటి ఒక స్వరూపం కనిపించింది. అవి మానవ రూపంలో ఉన్నాయి.
6
ఒక్కో దానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అలాగే నాలుగు రెక్కలు ఉన్నాయి.
7
వాటి కాళ్లు తిన్నగా ఉన్నాయి. వాటి అరికాళ్ళు దూడ డెక్కల్లా ఉన్నాయి. అవి మెరుగు పెట్టిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి.
8
అయినా మనుషులకున్నట్టే వాటికి చేతులు ఉన్నాయి. అవి వాటి నాలుగు రెక్కల కింద ఉన్నాయి. నాలుగు జీవుల ముఖాలూ, రెక్కలూ ఇలా ఉన్నాయి.
9
వాటి రెక్కలు పక్కనే ఉన్న మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు ఏ వైపుకీ తిరగడం లేదు. అవన్నీ ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
10
వాటి ముఖాలు ఎదుట నుంచి చూస్తే మనిషి ముఖాల్లా ఉన్నాయి. కుడివైపు నుండి చూస్తే సింహం ముఖంలా ఎడమవైపు నుండి చూస్తే ఎద్దు ముఖంలా ఉన్నాయి. ఇంకా ఈ నాలుగు జీవులకీ డేగ లాంటి ముఖాలు ఉన్నాయి.
11
వాటి ముఖాలు అలాంటివే. వాటి రెక్కలు పైకి విచ్చుకుని ఉన్నాయి. దాంతో ఒక జత రెక్కలు మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. ఇంకో జత రెక్కలు వాటి దేహాలను కప్పుతూ ఉన్నాయి.
12
అవి అన్నీ ముందుకు సాగి వెళ్తున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా ఆత్మ నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నాయి.
13
ఈ జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని ఆ జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి.
14
ఆ జీవులు వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. దాంతో అవి మెరుపుల్లా కనిపిస్తున్నాయి.
నాలుగు చక్రాల దర్శనం
15
తరువాత నేను ఆ జీవులను చూస్తుంటే వాటి పక్కనే నేలపైన చక్రాల వంటివి కనిపించాయి.
16
ఆ చక్రాల నిర్మాణం ఇలా ఉంది, ప్రతి చక్రం గోమేధికంలా ఉంది. నాలుగు చక్రాలూ ఒకేలా ఉన్నాయి. ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉన్నట్టుగా ఉన్నాయి.
17
అవి కదిలినప్పుడు అన్నీ నాలుగు వైపులకీ కదులుతున్నాయి. ఏదీ వెనక్కి తిరగడం లేదు.
18
వాటి అంచులు ఎత్తుగా ఉండి భయం పుట్టిస్తున్నాయి. వాటి అంచుల చుట్టూ కళ్ళు ఉన్నాయి.
19
ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితో పాటు ఆ చక్రాలు కూడా కదిలాయి. జీవులు భూమి పై నుండి పైకి లేచినప్పుడు ఆ చక్రాలు కూడా లేచాయి.
20
ఆత్మ ఎక్కడికి కదిలి వెళ్తున్నాడో జీవులు కూడా అక్కడికి వెళ్తున్నాయి. చక్రాలు జీవులతో పాటు లేస్తున్నాయి. ఎందుకంటే ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది.
21
ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది కాబట్టి జీవులు కదిలినప్పుడు చక్రాలు కూడా కదిలాయి. జీవులు నిశ్చలంగా నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. జీవులు భూమిపై నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి.
22
ఆ జీవుల తలల పైగా విశాలమైనది ఒకటి కనిపించింది. అది మెరుస్తున్న మంచు గడ్డలా ఆ జీవుల తలల పైగా వ్యాపించినట్టు కనిపించింది. అది అద్భుతం గానూ, ఆశ్చర్యాన్ని కలిగించేది గానూ ఉంది.
23
ఆ విశాలమైన దాని కింద జీవులు తమ రెక్కలు చాపుకుని ఉన్నాయి. ఒకదాని రెక్కలు మరోదాని రెక్కలను తాకుతూ ఉన్నాయి. ప్రతి జీవీ తన రెండు రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటూ ఉంది. అలా ప్రతి జీవికీ దేహాన్ని కప్పుకోడానికి రెండు రెక్కలున్నాయి.
24
ఆ తరువాత నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది పరుగులెత్తే నీటి శబ్దంలా ఉంది. సర్వశక్తిగల దేవుని స్వరంలా ఉంది. అవి కదిలినప్పుడల్లా గాలివాన శబ్దం వినిపించింది. ఒక సైన్యం చేస్తున్న శబ్దంలా తోచింది. అవి కదలకుండా ఆగినప్పుడు తమ రెక్కలను కిందకి వాల్చి ఉంచాయి.
25
అవి ఆగిపోయి తమ రెక్కలు చాపినప్పుడు వాటి తలల పైన ఉన్న విశాలమైన దానికి పైగా ఒక స్వరం వినిపించింది.
26
వాటి తలల పైగా ఉన్న ఆ విశాలమైనదాని పైన ఒక సింహాసనం లాంటిది కనిపించింది. అది నీలకాంత మణిలా ఉంది. ఆ సింహాసనం పైన మానవ స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపించింది.
27
అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది.
28
అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.
2
యెహెజ్కేలు నియామకం
1
ఆ స్వరం నాతో ఇలా చెప్పింది. <<నరపుత్రుడా, నీవు లేచి నీ కాళ్ళపై నిలబడు. నేను నీతో మాట్లాడుతాను.>>
2
ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా దేవుని ఆత్మ నన్ను పట్టుకుని నా కాళ్ళపై నిలువబెట్టాడు. అప్పుడు ఆయన స్వరం నేను విన్నాను.
3
ఆయన నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు.
4
వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు <ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు> అని వాళ్ళకి చెప్పాలి.
5
వాళ్ళు తిరగబడే జనం. అలా ప్రకటిస్తే వాళ్ళు విన్నా, వినకున్నా కనీసం వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు.
6
నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మాటలకి గానీ, వాళ్లకి గానీ భయపడకు. నీ చుట్టూ ముళ్ళ చెట్లూ, బ్రహ్మజెముడు పొదలూ ఉన్నా, నువ్వు తేళ్ళ మధ్య నివాసం చేస్తున్నా భయపడకు. వాళ్ళు తిరుగుబాటు చేసే జాతి. అయినా వాళ్ళ మాటలకు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి వ్యాకుల పడకు.
7
వాళ్ళు ఎంతో తిరగబడే జనం. అయితే వాళ్ళు విన్నా, వినకున్నా నా మాటలు వాళ్లకి చెప్పు.
8
నరపుత్రుడా, నువ్వు అయితే నేను చెప్తున్నది విను. ఆ తిరగబడే జాతిలా నువ్వూ తిరుగుబాటు చేయకు. నేను నీకు ఇవ్వబోతున్న దాన్ని నోరు తెరచి తిను.>>
9
అప్పుడు నేను ఒక హస్తం నా దగ్గరికి రావడం చూశాను. ఆ చేతిలో చుట్టి ఉన్న ఒక పత్రం ఉంది.
10
ఆయన ఆ చుట్ట నా ఎదుట విప్పి పరిచాడు. దానికి రెండు వైపులా రాసి ఉంది. దాని పైన గొప్ప విలాపం, రోదన, వ్యాకులంతో నిండిన మాటలు రాసి ఉన్నాయి.
3
1
ఆయన నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, నీకు కనిపించిన దాన్ని తిను! ఈ పత్రాన్ని తిను. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడు>>
2
దాంతో నేను నోరు తెరిచాను. ఆయన నాకు ఆ పత్రాన్ని తినిపించాడు.
3
తరువాత ఆయన నాతో <<నరపుత్రుడా, నేను ఇస్తున్న ఈ పత్రాన్ని ఆహారంగా తీసుకో. దాంతో నీ కడుపు నింపుకో>> అన్నాడు. కాబట్టి నేను ఆ పత్రాన్ని తిన్నాను. అది నా నోటిలో తేనెలా తియ్యగా ఉంది.
4
అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి నా మాటలు వారికి చెప్పు.
5
అపరిచితమైన మాటలు పలికే వాళ్ళ దగ్గరకో, కఠినమైన భాష మాట్లాడే వాళ్ళ దగ్గరకో నిన్ను పంపించడం లేదు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకే నిన్ను పంపిస్తున్నాను.
6
నువ్వు వెళ్తున్నది నీకు అర్థం కాకుండా విచిత్రంగా పలికే బలమైన దేశం కాదు. లేదా కఠినమైన భాష మాట్లాడే దేశమూ కాదు! అలాంటి వాళ్ళ దగ్గరకి నిన్ను పంపితే వాళ్ళు నీ మాటలు వింటారు!
7
కానీ ఇశ్రాయేలు ప్రజలు నీ మాటలు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నా మాటలు వినడానికి ఇష్టపడటం లేదు.
8
ఇలా చూడు! నీ ముఖాన్ని వాళ్ళ ముఖాల్లాగే మూర్ఖంగానూ నీ నుదురును వాళ్ళ నుదుళ్ళ లాగే కఠినంగానూ చేశాను.
9
నీ నుదురును వజ్రంలా చేశాను. దాన్ని చెకుముకి రాయి కంటే కఠినంగా చేశాను. వాళ్ళు తిరగబడే జాతి అని వాళ్ళకి నువ్వు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి నిరుత్సాహపడవద్దు.>>
10
తరువాత ఆయన నాకు ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, నేను నీకు చెప్పే మాటలను చెవులారా విను. వాటిని నీ మనసులో ఉంచుకో.
11
తరువాత చెరలో బందీలుగా ఉన్న నీ ప్రజల దగ్గరకి వెళ్లి వాళ్ళతో మాట్లాడు. వాళ్లకి <ప్రభువైన యెహోవా చెప్తున్నాడు> అంటూ ప్రకటించు.>>
12
అప్పుడు దేవుని ఆత్మ నన్ను పైకి తీసుకువెళ్ళాడు. నా వెనక <<యెహోవా మహిమకు ఆయన నివాస స్థలంలో స్తుతి కలుగు గాక>> అనే స్వరం వినిపించింది. ఆ స్వరం ఒక మహా భూకంపం వచ్చినట్టుగా వినిపించింది.
13
అంటే ఆ జీవుల రెక్కలు ఒక దానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దమూ, ఆ చక్రాలు కదిలినప్పుడు కలిగిన చప్పుడూ, ఒక మహా భూకంపం వచ్చినప్పుడు కలిగే శబ్దమూ నాకు వినిపించాయి.
14
దేవుని ఆత్మ నన్ను పైకి లేపి తీసుకు వెళ్ళాడు. యెహోవా హస్తం నన్ను తీవ్రంగా బలవంతం చేయడంతో నేను తీవ్రమైన ఉద్వేగానికి లోనై బయలుదేరాను!
15
అలా నేను కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలానికి వెళ్ళాను. అక్కడ బందీలుగా వచ్చిన కొందరు నివాసముంటున్నారు. అక్కడే నేను ఏడు రోజులు దిగ్భ్రమతో నిండి ఉండిపోయాను.
16
ఆ ఏడు రోజులు గడచిన తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
17
<<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచెయ్యి!
18
ఒక దుర్మార్గుడికి <నువ్వు కచ్చితంగా చస్తావు> అని నేను చెప్పినప్పుడు నువ్వు వాడికి ముందు జాగ్రత్త చెప్పక పోయినా, వాడు బతికి ఉండటానికి తన దుర్మార్గపు పనులను విడిచిపెట్టాలని వాణ్ణి హెచ్చరించక పోయినా వాడు తన పాపాలను బట్టి తప్పకుండా చస్తాడు. కానీ వాడి రక్తానికి నిన్ను జవాబుదారీని చేస్తాను.
19
అయితే ఒకవేళ నువ్వు ఆ దుర్మార్గుణ్ణి హెచ్చరించినప్పుడు వాడు తన దుర్మార్గతను వదిలిపెట్టకుండా పాపాలు చేస్తూనే ఉంటే వాడు తన పాపాల మూలంగానే చస్తాడు. కానీ నువ్వు తప్పించుకుంటావు.
20
నీతి గలవాడు తన నీతిని విడిచిపెట్టి అన్యాయంగా ప్రవర్తిస్తే నేను వాడి ఎదుట ఒక ఆటంకాన్ని ఉంచుతాను. అతణ్ణి నువ్వు హెచ్చరించలేదు కాబట్టి అతడు చనిపోతాడు. అతడు తన పాపంలోనే చనిపోతాడు. అతడు నీతిగా జరిగించిన పనులను నేను ససేమిరా జ్ఞాపకానికి తెచ్చుకోను. కానీ వాడి రక్తానికి నిన్ను జవాబుదారీని చేస్తాను.
21
ఒకవేళ నీతిగల వాణ్ణి పాపం చేయ వద్దని నువ్వు హెచ్చరిక చేస్తే, ఆ హెచ్చరికను బట్టి అతడు పాపం చేయకుండా ఉంటే అతడు తప్పకుండా బతుకుతాడు. నువ్వూ తప్పించుకుంటావు.>>
22
అక్కడ యెహోవా హస్తం నాపై ఉంది. ఆయన నాతో ఇలా అన్నాడు. <<నువ్వు లే, మైదాన ప్రాంతానికి వెళ్ళు. అక్కడ నేను నీతో మాట్లాడుతాను.>>
23
నేను లేచి మైదాన ప్రాంతానికి వెళ్ళాను. కెబారు నదీ ప్రాంతంలో నేను చూసిన యెహోవా తేజస్సు అక్కడ ఉంది. కాబట్టి నేను సాష్టాంగపడ్డాను.
24-25
అప్పుడు దేవుని ఆత్మ నా దగ్గరకి వచ్చి నన్ను లేపి నిల్చోబెట్టాడు. అప్పుడు ఆయన నాతో ఇలా మాట్లాడాడు. <<నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మధ్యకి వెళ్ళకుండా వాళ్ళు వచ్చి నీపై తాళ్ళు వేసి నిన్ను బంధిస్తారు. అందుకే నువ్వు వెళ్ళి నీ ఇంట్లో తలుపులు వేసుకుని ఉండు.
26
వాళ్ళు తిరగబడే ప్రజలు కాబట్టి నువ్వు వాళ్ళని గద్దించకుండా నేను నీ నాలుకను నీ నోట్లో అంగిలికి అంటుకుపోయేలా చేస్తాను. నువ్వు మౌనంగా ఉంటావు.
27
కానీ నేను నీతో మాట్లాడుతాను. వాళ్లకి <ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు> అని నువ్వు చెప్పడానికి నీ నోరు తెరుస్తాను. వాళ్ళు తిరుగుబాటు చేసే జనం కాబట్టి వినేవాడు వింటాడు. విననివాడు వినకుండానే ఉంటాడు.>>
4
ముట్టడికి చెరకూ సంకేతం
1
అయితే నరపుత్రుడా, ఒక పెంకు తీసుకో. దాన్ని నీముఖానికి ఎదురుగా ఉంచుకో. దాని పైన యెరూషలేము పట్టణం నమూనాను చిత్రించు.
2
అది శత్రువుల ముట్టడిలో ఉన్నట్టుగా, దాని ఎదుట ప్రాకారాలు నిర్మించినట్టుగా చిత్రించు. దానిపై దాడి చేయడానికి వీలుగా ఉన్నత ప్రాంతాలనూ, దాని చుట్టూ సైనిక శిబిరాలనూ చిత్రించు. ప్రాకారాలను ధ్వంసం చేసే యంత్రాలను చిత్రించు.
3
తరువాత నువ్వు ఒక ఇనుప రేకును తీసుకుని దాన్ని నీకూ పట్టణానికీ మధ్య ఇనుప గోడగా నిలబెట్టు. పట్టణం ముట్టడికి గురౌతుంది కాబట్టి పట్టణానికి అభిముఖంగా నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడిస్తున్నట్టు ఉంటావు. ఇశ్రాయేలు జాతికి ఇది సూచనగా ఉంటుంది.
4
ఆ తరువాత నీ ఎడమ వైపుకి తిరిగి పడుకో. ఇశ్రాయేలు జాతి పాపాన్నంతా నీ పైకి వేసుకో. ఇశ్రాయేలు జాతికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని రోజులు అలా పండుకుంటావో అన్ని రోజులు వారి పాపాన్ని మోస్తావు.
5
ఆ రోజులను నేనే నిర్ణయిస్తున్నాను. ఇశ్రాయేలు జాతి పాపం చేసిన కాలంలో ఒక్కో సంవత్సరం ఒక్కో రోజుగా నువ్వు భరించాలి. అంటే 390 రోజులు! ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు జాతి పాపాన్ని భరిస్తావు.
6
ఆ రోజులన్నీ గడిచిన తరువాత రెండో సారి నీ కుడి వైపుకి పడుకో. ఈ సారి నలభై రోజులు నువ్వు యూదా జాతి పాపాన్ని మోస్తావు. ఒక్కో సంవత్సరానికి ఒక్కో రోజు నీకు నేను నిర్ణయించాను.
7
తరువాత ముట్టడిలో ఉన్న యెరూషలేముకి వ్యతిరేకంగా నిలబడి చొక్కా తీసివేసిన నీ చేతిని ఎత్తి దానికి వ్యతిరేకంగా ప్రవచించాలి.
8
నువ్వు పట్టణాన్ని ముట్టడించినట్టు ఉండే ఆ రోజులు పూర్తయే వరకూ నువ్వు కదలకుండా నిన్ను బంధించి ఉంచుతాను.
9
నీ కోసం గోధుమలూ, బార్లీ, చిక్కుడు గింజలూ, కాయ ధాన్యాలూ, జొన్నలూ, సజ్జలూ తెచ్చుకో. వాటన్నిటినీ ఒక పాత్రలో వేసి నువ్వు ఒక వైపున పడుకునే రోజుల లెక్క ప్రకారం రొట్టెలు చేసుకోవాలి. 390 రోజులు నువ్వు ఇలాగే చేసుకుని తినాలి!
10
నువ్వు తీసుకునే ఆహారం ఇదే. రోజుకి రెండు వందల గ్రాముల ప్రకారం తీసుకోవాలి. అది ప్రతి రోజూ సమయానికి తింటూ ఉండాలి.
11
అలాగే నీళ్ళు కొలత ప్రకారం ప్రతి రోజూ రెండు గ్లాసులు తాగాలి. సమయానికి నీళ్లు తాగుతూ ఉండాలి.
12
బార్లీతో చేసే అప్పడాల్లా వాటిని చేసుకుని తినాలి. అందరూ చూస్తుండగా వాటిని మనిషి మలాన్నే వంట చేయడానికి ఉపయోగిస్తూ కాల్చి తినాలి!
13
యెహోవా ఇలా చెప్తున్నాడు. <<నేను వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు వెళ్ళే జాతులమధ్య ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమైన ఆహారం తినవలసి వస్తుంది.>>
14
కానీ నేను <<అయ్యో, ప్రభూ! యెహోవా! నేను ఏనాడూ అపవిత్రం కాలేదు. చిన్నప్పట్నించి చనిపోయిన దాన్ని గానీ, మృగాలు చంపిన దాన్ని గానీ నేను తినలేదు. అపవిత్రమైన మాంసం ఏనాడూ నా నోట్లో ప్రవేశించలేదు>> అన్నాను.
15
దానికి ఆయన <<చూడు మనిషి మలానికి బదులు నేను నీకు ఆవు పేడను నిర్ణయించాను. నువ్వు పిడకలతో నీ రొట్టెలు చేసుకోవచ్చు>> అన్నాడు.
16
ఇంకా ఆయన నాకు ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, చూడు, నేను యెరూషలేములో రొట్టె అనే ఆధారం లేకుండా చేస్తున్నాను. వాళ్ళు ఆందోళనతో ఒక పరిమితి ప్రకారం రొట్టెలు తింటారు. నీళ్ళు కూడా కొలత ప్రకారం భయంతో తాగుతారు.
17
వాళ్లకి ఆహారం, నీళ్ళు కరువై పోతాయి. ప్రతి ఒక్కడూ తన సహోదరుడి వైపు దిగులుతో చూస్తాడు. తాము చేసిన పాపాల వలన నశించిపోతారు.>>
5
1
<<తరువాత నరపుత్రుడా, నువ్వు నీ కోసం మంగలి కత్తి లాంటి ఒక పదునైన కత్తి తీసుకో. దాంతో నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఆ వెంట్రుకలను తూచడానికీ, భాగాలు చేయడానికీ ఒక త్రాసు తీసుకో.
2
పట్టణాన్ని ముట్టడించిన రోజులు ముగిసిన తరువాత ఆ వెంట్రుకల్లో మూడో భాగాన్ని పట్టణం మధ్యలో తగలబెట్టు. మిగిలిన మూడో భాగాన్ని పట్టణం చుట్టూ తిరుగుతూ కత్తితో కొట్టు. మిగిలిన మూడో భాగాన్ని గాలికి ఎగిరి పోనీ. నేను కత్తి దూసి ప్రజలను తరుముతాను.
3
అయితే కొద్దిగా వెంట్రుకలను తీసుకుని నీ చెంగుకి కట్టుకో.
4
మళ్ళీ వాటిలో కొన్నిటిని తీసి అగ్నిలో వేసి కాల్చి వెయ్యి. అక్కడ నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు జాతినంతటినీ తగులబెట్టేస్తుంది.>>
5
ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు. <<ఇది అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము పట్టణం. నేను అనేక రాజ్యాలు దాని చుట్టూ ఉండేలా చేశాను.
6
అయితే ఆమె ఇతర జాతుల కంటే దుర్మార్గంగా నా శాసనాలను తిరస్కరించింది. ఇతర రాజ్యాల కంటే దుర్మార్గంగా నా నియమాలను తిరస్కరించింది. వాళ్ళు నా న్యాయ నిర్ణయాలను తిరస్కరించి నా నియమాల ప్రకారం నడుచుకోలేదు.>>
7
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరు నాకు ఎక్కువ బాధ కలిగిస్తున్నారు. నా శాసనాల ప్రకారం మీరు నడుచుకోలేదు. నా నియమాలను బట్టి నడుచుకోలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న రాజ్యాల నియమాలను బట్టి కూడా మీరు నడుచుకోలేదు.
8
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేనే మీకు విరోధంగా చర్యలు తీసుకుంటాను. ఇతర జాతులు చూస్తూ ఉండగా మీ మధ్య నా తీర్పు అమలు పరుస్తాను.
9
నీ అసహ్యమైన పనుల కారణంగా నేను ఇంతకు ముందెప్పుడూ చేయని, భవిష్యత్తులో పునరావృతం కాని కార్యాన్ని నీకు చేస్తాను.
10
దాని మూలంగా మీలో తండ్రులు తమ పిల్లలను తింటారు. కొడుకులు తమ తండ్రులను తింటారు. నా తీర్పును నేను అమలు పరుస్తాను. మీలో మిగిలిన వాళ్ళందరినీ నలు దిక్కులకూ చెదరగొడతాను.
11
కాబట్టి నా ప్రాణం పైన ఒట్టు>> ఇది ప్రభువైన యెహోవా ప్రకటన.
<<నీ అసహ్యమైన విషయాలతో నా మందిరాన్ని అపవిత్రం చేశావు కాబట్టి నేను నీ సంఖ్యను కచ్చితంగా తగ్గిస్తాను. నీ మీద కనికరం చూపను. నిన్ను కాపాడను.
12
మీ మధ్యలో కరువు వస్తుంది. అప్పుడు వచ్చే తెగులు మూలంగా మీలో మూడో భాగం మరణిస్తారు. యుద్ధం వచ్చి నీ చుట్టూ మరో మూడో భాగం కత్తికి బలౌతారు. మరో మూడో భాగాన్ని అన్ని దిక్కులకీ చెదరగొడతాను. కత్తి దూసి వారిని తరముతాను.
13
అప్పుడుగానీ నా మహా కోపం చల్లారదు. నా మహోగ్రతకి స్వస్తి పలుకుతాను. నేను సంతృప్తి చెందుతాను. వాళ్లకు వ్యతిరేకంగా నా మహోగ్రత చూపి ముగించిన తరువాత యెహోవానైన నేను నా మహోగ్రతలో మాట్లాడానని వాళ్ళు తెలుసుకుంటారు.
14
నిన్ను చూసే వాళ్ళందరికీ నువ్వు నిర్జనంగానూ, నిందకు తగిన దానిగానూ కనిపించేలా చేస్తాను.
15
కాబట్టి యెరూషలేము ఇతర జాతులు ఖండించడానికీ, ఎగతాళి చేయడానికీ వీలుగా మారుతుంది. చుట్టూ ఉన్న దేశాలకు ఒక హెచ్చరికగానూ, భయం పుట్టించేదిగానూ ఉంటుంది. ఎందుకంటే నేను మహా కోపంతో, మహోగ్రతతో, తీవ్రమైన గద్దింపుతో నా శిక్షను అమలు చేస్తాను. యెహోవానైన నేనే ప్రకటన చేస్తున్నాను.
16
నీ పైకి నేను కఠినమైన కరువు బాణాలు వేస్తాను. అవి నువ్వు నాశనం కావడానికి కారణం అవుతాయి. ఎందుకంటే నీ పైకి వచ్చిన కరువును అధికం చేస్తాను. నీ ఆహారానికి ఆధారంగా ఉన్న వాటిని విరిచి వేస్తాను.
17
నీకు విరోధంగా కరువునూ, వినాశనాన్నీ పంపిస్తాను. దాంతో నువ్వు సంతానం లేకుండా ఉంటావు. తెగులూ, రక్తపాతం నీకు కలుగుతాయి. నీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతాను. ఈ ప్రకటన చేస్తున్నది నేనే, యెహోవాను.>>
6
ఇశ్రాయేలు పర్వతాల గూర్చి ప్రవచనం
1
నా దగ్గరికి తిరిగి యెహోవా వాక్కు వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
2
<<నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలకు అభిముఖంగా నిలబడి ఇలా ప్రకటించు.
3
ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా పర్వతాలతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఇలా చెప్తున్నాడు. చూడండి! మీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతున్నాను. మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తాను.
4
తరువాత మీ బలిపీఠాలు పాడై పోతాయి. మీ దేవతా స్తంభాలు ధ్వంసం అవుతాయి. హతమైన మీ వాళ్ళను మీ విగ్రహాల ఎదుట పారవేస్తాను.
5
ఇశ్రాయేలు ప్రజల శవాలను వారి విగ్రహాల ఎదుట పేరుస్తాను. వాళ్ళ ఎముకలను మీ బలిపీఠాల చుట్టూ వెదజల్లుతాను.
6
మీరు ఏ పట్టణంలో నివసించినా ఆ పట్టణాలు నాశనం అవుతాయి. మీ బలిపీఠాలు నాశనం, నిర్జనం అవుతాయి. తరువాత అవి పగిలి పోతాయి. మాయమై పోతాయి. మీ దేవతా స్తంభాలు విరిగిపోతాయి. మీరు చేసినవన్నీ తుడిచిపెట్టుకు పోతాయి.
7
ప్రజలు చనిపోయి మీ మధ్యలో కూలిపోతారు. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
8
అయితే మీలో కొంత శేషాన్ని నేను భద్రం చేస్తాను. మీరు వివిధ దేశాల్లోకి చెదరిపోయినప్పుడు మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు.
9
అప్పుడు అలా తప్పించుకుని ఇతర జాతుల మధ్య బందీలుగా ఉన్నవారు నా గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి నన్ను దూరం చేసిన తమ లైంగిక విశృంఖలత, విగ్రహాలపట్ల వాళ్ళకున్న అనురక్తీ నన్నెలా వేదనకి గురి చేసిందో ఆలోచిస్తారు. చండాలమైన పనులన్నిటితో తాము సాగించిన దుర్మార్గత పట్ల వాళ్ళ ముఖాలపై అసహ్యం కనిపిస్తుంది.
10
అప్పుడు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు. వాళ్ళ పైకి కీడు రప్పిస్తానని నేను చెప్పిన మాట వెనుక ఒక కారణం ఉంది.>>
11
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<నీ చేతులు చరిచి నీ పాదాలు నేలకు తన్ను! ఇశ్రాయేలు జాతి సాగించిన అసహ్యమైన పనుల కోసం <అయ్యో> అని రోదించు. ఎందుకంటే వాళ్ళని ఖడ్గం, కరువు, తెగులు హతం చేస్తాయి.
12
దూరంగా ఉన్నవాళ్ళు తెగులు వల్ల చస్తారు. సమీపంలో ఉన్నవాళ్ళను ఖడ్గం హతం చేస్తుంది. మిగిలిన వాళ్ళు కరువు వల్ల చనిపోతారు. ఈ విధంగా నా క్రోధాన్ని అమలు చేస్తాను.
13
వాళ్ళలో హతం అయిన వాళ్ళు ఎత్తయిన కొండలన్నిటి పైనా బలిపీఠాల చుట్టూ ఉన్న విగ్రహాల మధ్యలోనూ, పర్వత శిఖరాల పైనా, తమ విగ్రహాలకి పరిమళ ధూపం వేసిన పచ్చని చెట్లన్నిటి మధ్యా, సింధూర వృక్షాల మధ్యా పడి ఉంటారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
14
నా శక్తిని కనుపరుస్తాను. వాళ్ళ దేశాన్నీ, వాళ్ళు నివసించే ప్రాంతాలన్నిటినీ దిబ్లాతు ఎడారిలా నిర్జనం గానూ, వ్యర్ధంగానూ చేస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని వాళ్లు తెలుసుకుంటారు.>>
7
అసన్నమైన అంతం
1
యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు.
2
<<నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు.
అంతం! ఇశ్రాయేలు దేశం నాలుగు సరిహద్దులకు అంతం వచ్చేసింది.
3
ఇప్పుడు అంతం మీ పైకి వచ్చింది.
ఎందుకంటే నా తీవ్ర కోపాన్ని మీ పైకి పంపుతున్నాను.
మీ ప్రవర్తనను బట్టి మీకు తీర్పు తీరుస్తాను.
తరువాత అసహ్యకరమైన మీ పనుల ఫలితాన్ని మీపైకి పంపుతాను.
4
నా దృష్టిలో మీ పట్ల ఎలాంటి కనికరమూ చూపను.
నేనే యెహోవాను అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
5
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.
వినాశనం! వినాశనం వెనుకే మరో వినాశనం.
చూడండి! అది వచ్చేస్తూ ఉంది.
6
అంతం వచ్చేస్తూ ఉంది.
అంతం నీకు విరోధంగా కళ్ళు తెరిచింది. చూడండి. అది వచ్చేస్తూ ఉంది.
7
దేశవాసులారా, మీ నాశనం మిమ్మల్ని సమీపిస్తుంది.
సమయం వచ్చేసింది. నాశన దినం దగ్గరలోనే ఉంది.
పర్వతాలు ఇకమీదట ఆనందంగా ఉండవు.
8
త్వరలోనే నా క్రోధాన్ని మీమీద కుమ్మరించబోతున్నాను.
నా తీవ్రమైన కోపాన్ని మీమీద చూపించ బోతున్నాను.
మీ ప్రవర్తనను బట్టి మీకు శిక్ష విధిస్తాను.
మీ నీచమైన పనుల ఫలాన్ని మీ పైకి తీసుకు వస్తాను.
9
నాకు మీ పట్ల కనికరం లేదు.
నేను మిమ్మల్ని వదలను.
మీరు చేసినట్టే నేనూ మీకు చేస్తాను.
మిమ్మల్ని శిక్షించే యెహోవాను నేనే అని మీకు తెలిసే విధంగా నీచమైన వాటిని మీ మధ్యే ఉండనిస్తాను!
10
చూడండి! ఆ రోజు వచ్చేస్తుంది. నాశనం బయలు దేరింది.
ఆ దండం పుట్టింది. దానికి గర్వం వికసించింది.
11
బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది.
వాళ్ళలో గానీ, వాళ్ళ మూకలో గానీ ఎవరూ మిగలరు.
వాళ్ళ సంపదలో గానీ, వాళ్ళ ప్రాముఖ్యతలో గానీ ఏదీ మిగలదు.
12
ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది.
నా కోపం ప్రజలందరి పైనా ఉంది కనుక కొనేవాడు సంతోషించకూడదు.
13
అమ్మినవాడు వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం తాను అమ్మిన భూమికి తిరిగి రాడు.
ఎందుకంటే ఈ దర్శనం ప్రజలందరికీ విరోధంగా ఉంది.
పాపంలో నివసించే ఏ మనిషీ ధైర్యంగా తన ప్రాణాన్ని దక్కించుకోలేడు. అందుకే వాళ్ళెవ్వరూ తిరిగిరారు.
14
వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు.
కానీ యుద్ధానికి బయల్దేరే వాడు ఎవడూ లేడు.
15
ఖడ్గం బయట ఉంది. లోపలేమో కరవూ, తెగులూ ఉన్నాయి.
బయట ఉన్నవాళ్ళు ఖడ్గం వాతపడతారు.
పట్టణంలో ఉన్నవాళ్ళని కరవూ, తెగులూ మింగివేస్తాయి.
16
అయితే వాళ్ళలో కొంతమంది తప్పించుకుని పర్వతాల పైకి పారిపోతారు.
వాళ్ళు అందరూ లోయలో ఉండే గువ్వల్లాగా మూలుగుతారు.
17
వాళ్ళందరి చేతులూ తడబడతాయి. మోకాళ్ళు నీళ్ళలా బలహీనం అవుతాయి.
18
వారు గోనెపట్ట ధరిస్తారు. తీవ్రమైన భయం వాళ్ళని కమ్ముకుంటుంది.
ప్రతి ఒక్కరి ముఖం పైనా అవమానం ఉంటుంది.
బోడితనం వాళ్ళ తలల మీద కనిపిస్తుంది.
19
వాళ్ళు తమ దగ్గర ఉన్న వెండిని వీధుల్లో పారేస్తారు.
బంగారం వాళ్లకి వ్యర్ధపదార్ధంలా ఉంటుంది.
యెహోవా కోప దినాన వెండిబంగారాలు వాళ్ళను కాపాడలేవు.
వాళ్ళ దోషం పెను ఆటంకంగా ఉంటుంది గనక వాళ్ళ జీవితాలకు రక్షణ ఉండదు. వాళ్ళ కడుపులకు పోషణ ఉండదు.
20
వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు.
అవి వాళ్ళ నీచమైన పనులను వర్ణించే విగ్రహ ఆకారాలుగా ఏర్పడ్డాయి.
వాటితో వాళ్ళు అసహ్యకరమైన తమ పనులను సాగించారు. కాబట్టి ఆ ఆభరణాలు వాళ్లకి అసహ్యం పుట్టేలా నేను చేస్తాను.
21
వాటిని ఇతర దేశస్తుల చేతికి అప్పగిస్తాను.
దుర్మార్గుల చేతికి దోపిడీ సొమ్ముగా ఇస్తాను. వాళ్ళు వాటిని అపవిత్రం చేస్తారు.
22
వాళ్ళు నా ఖజానాను అపవిత్రం చేస్తుంటే చూడకుండా నా ముఖం తిప్పుకుంటాను.
బందిపోట్లు దానిలో ప్రవేశించి దాన్ని అపవిత్రం చేస్తారు.
23
తీర్పుని బట్టి దేశం రక్తంతోనూ, పట్టణం హింసతోనూ నిండిపోయింది. అందుకే సంకెళ్ళు సిద్ధం చేయండి.
24
జాతుల్లోకెల్లా అత్యంత దుర్మార్గమైన జాతిని నేను పంపుతాను. వాళ్ళు వచ్చి ఇళ్ళను స్వాధీనం చేసుకుంటారు.
వాళ్ళ పవిత్ర స్థలాలను అపవిత్రం చేసి బలశూరుల అహంకారానికి స్వస్తి చెపుతాను!
25
భయం కలుగుతుంది! వాళ్ళు శాంతిని వాంచిస్తారు కానీ అది వారికి దొరకదు.
26
నాశనం తరువాత నాశనం కలుగుతుంది.
పుకార్ల తరువాత పుకార్లు పుట్టుకొస్తాయి.
వాళ్ళు ప్రవక్తల దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు. యాజకులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేకుండా పోతుంది.
సలహా ఇచ్చే పెద్దలకు తెలివి ఉండదు.
27
రాజు విచారంగా ఉంటాడు. యువరాజు నిస్పృహలో సామాన్య వస్త్రాలు ధరిస్తాడు.
దేశ ప్రజల చేతులు భయంతో వణకుతాయి.
వాళ్ళ విధానంలోనే నేను వాళ్లకి ఇలా చేస్తాను.
నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకునే వరకూ వాళ్ళ ప్రమాణాలను బట్టే వాళ్ళకి తీర్పు తీరుస్తాను.>>
8
దేవాలయంలో విగ్రహారాధన
1
బబులోను చెరలో ఉన్న కాలంలో, ఆరో సంవత్సరం ఆరో నెల ఐదో రోజున నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను. యూదా ప్రజల్లో పెద్దలు నా ఎదుట కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రభువైన యెహోవా హస్తం నా పైకి వచ్చింది.
2
నేను చూసినప్పుడు అదిగో చూడండి! నాకు ఒక మానవాకారం కనిపించింది. అది నడుము నుండి కిందకు అగ్నిలాగా ఉంది. నడుము నుండి పైకి తేజస్సుతో ప్రకాశిస్తున్న కంచులా నాకు కనిపించింది.
3
ఆయన నావైపు చెయ్యి వంటిదాన్ని చాపాడు. నా తలపై జుట్టును ఆయన పట్టుకున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ నన్ను లేపి భూమికీ ఆకాశానికీ మధ్యకు ఎత్తాడు. అప్పుడు నాకు కలిగిన దేవుని దర్శనంలో ఆయన యెరూషలేముకు ఉత్తరాన ఉన్న ఆవరణ ద్వారం దగ్గర తీవ్రమైన రోషాన్ని కలిగించే విగ్రహం ఉన్న చోటికి నన్ను తెచ్చాడు.
4
ఇంతకుముందు నేను మైదానప్రాంతంలో చూసిన ఇశ్రాయేలు దేవుని తేజస్సు అక్కడ నాకు కనిపించింది.
5
అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, ఉత్తరం వైపుకి శ్రద్ధగా చూడు.>> ద్వారానికి ఉత్తరం వైపు దారి బలిపీఠానికి దారి తీస్తుంది. అక్కడే రోషం కలిగించే విగ్రహం ఉంది. నేను ఆ వైపుకి తదేకంగా చూశాను. నాకు ఆ విగ్రహం కనిపించింది.
6
అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, వాళ్ళేం చేస్తున్నారో చూస్తున్నావా? నా సొంత మందిరం నుండి నేను వెళ్ళిపోవడానికి కారణమైన నీచమైన పనులు ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు! నువ్వు పక్కకి తిరిగి చూస్తే వీటి కంటే అసహ్యమైన పనులు వీరు చేయడం చూస్తావు.>>
7
ఆ తరువాత ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గర దించాడు. అక్కడ గోడకి ఒక రంధ్రం కనిపించింది.
8
ఆయన నాకిలా చెప్పాడు. <<నరపుత్రుడా, ఆ గోడ తవ్వు.>> అప్పుడు నేను ఆ గోడ తవ్వాను. తవ్విన చోట ఒక ద్వారం కనిపించింది.
9
ఆయన తిరిగి నాతో <<నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారో చూడు>>అన్నాడు.
10
కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూశాను. అక్కడ పాకే ప్రతి జంతువూ, అసహ్యమైన మృగాలూ ఉన్నాయి. ఆ గోడపైన ఇశ్రాయేలు జాతి దేవుళ్ళ విగ్రహాలన్నీ చెక్కి ఉన్నాయి.
11
ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలైన డెబ్భై మంది అక్కడ ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కొడుకు యజన్యా ఉన్నాడు. వాళ్ళంతా ఆ బొమ్మలకి ఎదురుగా నిలబడి ఉన్నారు. ప్రతివాడి చేతిలో ధూపం వేసే పాత్ర ఒకటి ఉంది. వాళ్ళంతా ధూపం వేయడం వల్ల అది ఒక మేఘంలా పైకి వెళ్తూ ఉంది. దాని పరిమళం అంతటా నిండి ఉంది.
12
అప్పుడాయన నాకిలా చెప్పాడు. <<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు చీకట్లో ఏం చేస్తున్నారో చూశావా? ప్రతి ఒక్కడూ తన తన రహస్య గదుల్లో తన విగ్రహాలకు ఇలాగే చేస్తున్నాడు. <యెహోవా మమ్మల్ని చూడ్డం లేదు. యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడు> అని చెప్పుకుంటున్నారు.>>
13
తరువాత ఆయన <<నువ్వు ఈ వైపుకి తిరిగి చూడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీళ్ళు చేయడం చూస్తావు>> అన్నాడు.
14
ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరానికి ఉత్తరం వైపున ఉన్న ద్వారం దగ్గర నన్ను దించాడు. అక్కడ చూడండి! స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవుడి కోసం ఏడుస్తున్నారు.
15
అప్పుడాయన <<నరపుత్రుడా, ఇది చూశావా? ఇప్పుడు ఇంతకంటే అసహ్యమైనది చూస్తావు>> అని నాకు చెప్పాడు.
16
ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు.
17
అప్పుడాయన నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, నువ్వు ఇదంతా చూస్తున్నావా? యూదా జాతి ప్రజలు ఇక్కడ చేస్తున్న అసహ్యమైన పనులు స్వల్పమైనవా? వాళ్ళు దేశాన్ని బలాత్కారంతో నింపివేశారు. ముక్కులకు తీగలు తగిలించుకుంటూ నా కోపాన్ని మరింత రెచ్చగొడుతున్నారు.
18
కాబట్టి నేను వాళ్ళ మధ్య నా పని జరిగిస్తాను. నా దృష్టిలో వాళ్ళ పట్ల నాకెలాంటి కనికరమూ ఉండదు. నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా చెవిలో ఎంత పెద్ద స్వరంతో ఏడ్చినా నేను వినను.>>
9
విగ్రహరాధికుల వధ
1
నేను వింటుండగా దేవుడు పెద్ద స్వరంతో ఇలా ప్రకటించాడు. <<పట్టణాన్ని కాపలా కాసే వాళ్ళంతా ఇక్కడికి రండి. ప్రతి ఒక్కడూ నిర్మూలం చేసే తన ఆయుధాన్ని చేతిలో పట్టుకుని రావాలి>>
2
ఇదిగో చూడండి! ఉత్తరం వైపున ఉన్న ముఖద్వారం నుండి ఉన్న దారిలో ఆరుగురు వ్యక్తులు వచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ సంహారం చేసే ఆయుధం ఉంది. వారి మధ్యలో నారతో నేసిన బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని నడుముకి లేఖకుడి వ్రాత సామాను ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళి ఇత్తడి బలిపీఠం దగ్గర నిలబడ్డారు.
3
ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు నుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గరికి వచ్చి నిలిచింది. ఆయన నార బట్టలు వేసుకున్న లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తిని పిలిచాడు.
4
యెహోవా అతనితో ఇలా చెప్పాడు. <<యెరూషలేము పట్టణంలో ప్రవేశించి అక్కడ తిరుగు. పట్టణంలో జరుగుతున్న అసహ్యమైన పనులను గూర్చి మూలుగుతూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్న వాళ్ళ నుదుటిపై ఒక గుర్తు పెట్టు.>>
5
అప్పుడు నేను వింటూ ఉండగా ఆయన మిగిలిన వాళ్ళకి ఇలా అజ్ఞాపించాడు. <<మీరు అతని వెనకే పట్టణంలో సంచరించండి. హతమార్చండి! ఎలాంటి కనికరమూ లేకుండా అందరినీ చంపండి.
6
ముసలి వాళ్ళైనా, యువకులైనా, కన్యలైనా, చిన్న పిల్లలైనా, స్త్రీలైనా అందరినీ చంపండి! కానీ నుదుటిపై గుర్తు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. నా మందిరం దగ్గరనుండే ప్రారంభం చేయండి.>> కాబట్టి వాళ్ళు మందిరం ఎదుట ఉన్న పెద్దవాళ్ళతో మొదలు పెట్టారు.
7
ఆయన ఇంకా ఇలా అన్నాడు. <<మందిరాన్ని అపవిత్రం చేయండి. దాని ఆవరణాలను శవాలతో నింపండి. మొదలు పెట్టండి.>> వాళ్ళు వెళ్ళి పట్టణంపై దాడి చేసి చంపడం ప్రారంభించారు.
8
వాళ్ళు చంపడం మొదలు పెట్టిన తరువాత నన్ను తప్ప వాళ్ళు అందరినీ చంపడం చూశాను. నేను ఒంటరిగా ఉండటం చూసి నేను సాష్టాంగ పడ్డాను. గట్టిగా వేడుకున్నాను. <<అయ్యో! ప్రభూ! యెహోవా, యెరూషలేముపై నీ క్రోధాన్ని కుమ్మరించి ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేస్తావా?>> అన్నాను.
9
ఆయన నాకిలా చెప్పాడు. <<ఇశ్రాయేలు ప్రజల, యూదా ప్రజల అతిక్రమాలు చాలా అధికమయ్యాయి. వాళ్ళు యెహోవా మనలను విడిచి పెట్టాడనీ, యెహోవా మనలను చూడటం లేదనీ చెప్పుకుంటున్నారు. కాబట్టి దేశం రక్త పాతంతోనూ పట్టణం భ్రష్టత్వంతోనూ నిండి పోయాయి.
10
కాబట్టి నా దృష్టిలో వారి కోసం ఎలాంటి కనికరమూ లేదు. నేను వాళ్ళని వదలను. వీటన్నిటి ఫలితాన్ని వాళ్ళ తలల పైకి తెస్తాను.>>
11
అప్పుడు నార బట్టలు వేసుకుని లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తి వచ్చాడు. అతడు <<నీ ఆదేశాల ప్రకారం నేను అంతా చేశాను>> అని చెప్పాడు.
10
యెహోవా మహిమ
1
అప్పుడు నేను కెరూబుల తలలకి పైగా ఉన్న గుమ్మటం వైపుకి చూశాను. వాళ్లకి పైగా అది నీలమణిలా మెరుస్తూ కనిపించింది. అది ఒక సింహాసనం ఆకారంలో ఉంది.
2
అప్పుడు యెహోవా నార బట్టలు వేసుకున్న వ్యక్తితో ఇలా చెప్పాడు. <<నువ్వు చక్రాల మధ్యకు, కెరూబుల కిందకు వెళ్ళు. కెరూబుల మధ్యలో ఉన్న నిప్పు కణికలతో రెండు చేతులూ నింపుకో. వాటిని పట్టణంలో వెదజల్లు.>> నేను చూస్తుండగా ఆ వ్యక్తి వెళ్ళాడు.
3
అతడు లోపలికి వెళ్ళినప్పుడు కెరూబులు మందిరం కుడివైపున నిలబడి ఉన్నారు. లోపలి ఆవరణను మేఘం కమ్మివేసింది.
4
యెహోవా మహిమ తేజస్సు కెరూబుల పైనుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గర నిలిచింది. దాంతో మేఘం మందిరాన్ని నింపివేసింది. ఆవరణ అంతా యెహోవా మహిమ తేజస్సుతో వెలిగి పోతూ ఉంది.
5
అప్పుడు బయట ఆవరణలో కెరూబుల రెక్కల చప్పుడు వినబడింది. అది సర్వశక్తిగల దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరంలా ఉంది.
6
అప్పుడు నార బట్టలు వేసుకున్న వ్యక్తిని ఇలా ఆదేశించాడు. <<కెరూబుల మధ్యలో ఉన్న చక్రాల దగ్గర ఉన్న అగ్నిని తీసుకో.>>అప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఒక చక్రం పక్కనే నిలబడ్డాడు.
7
కెరూబుల్లో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి నార బట్టలు వేసుకున్న వ్యక్తి చేతుల్లో ఉంచాడు. ఆ వ్యక్తి అగ్నిని చేతుల్లోకి తీసుకుని బయటకి వెళ్ళాడు.
8
అప్పుడే కెరూబుల రెక్కల కింద మనిషి హస్తం లాంటిది నాకు కనిపించింది.
9
నేను ఇంకా చూస్తూ ఉన్నాను. కెరూబుల దగ్గర నాలుగు చక్రాలున్నాయి. ఒక్కో కెరూబు దగ్గర ఒక్కో చక్రం ఉంది. ఆ చక్రాలు వైఢూర్యంతో చేసినట్టుగా ఉన్నాయి.
10
ఆ నాలుగు చక్రాలు ఒకే విధంగా ఉన్నాయి. అవి ఒక చక్రంలో మరో చక్రం అమర్చినట్టుగా ఉన్నాయి.
11
అవి కదులుతూ ఉన్నప్పుడు అన్ని వైపులకీ వెళ్తున్నట్టుంది. అవి ఏ పక్కకీ తిరగడం లేదు. అవి కెరూబుల ముఖాలు ఏ వైపుకి ఉన్నాయో ఆ వైపుకే వెళ్తున్నాయి. అవి పక్కకి తిరగకుండా ముందుకే వెళ్తున్నాయి.
12
ఆ నాలుగు కెరూబుల వీపులూ, చేతులూ, రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్ళు ఉన్నాయి. నాలుగు చక్రాలు కూడా కళ్ళతో చుట్టూ కప్పి ఉన్నాయి.
13
నేను వింటుండగా <<చక్ర భ్రమణం>> అని వాటిని పిలిచినట్టు విన్నాను.
14
ఒక్కో కెరూబుకీ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబులా ఉంది. రెండోది మనిషిలా ఉంది. మూడో ముఖం సింహంలా ఉంది. నాలుగోది డేగ ముఖంలా ఉంది.
15
అప్పుడు ఈ కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నాకు కనబడిన జీవులు ఇవే.
16
కెరూబులు కదిలినప్పుడల్లా చక్రాలు కూడా వాటితోనే కదిలాయి. కెరూబులు భూమి పైనుండి ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు చక్రాలు తిరగలేదు.
17
కెరూబులు నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. కెరూబులు లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి. ఎందుకంటే ఆ జీవుల ప్రాణం చక్రాల్లో ఉంది.
18
అప్పుడు యెహోవా మహిమ తేజస్సు మందిరం గడప నుండి లేచి కెరూబులకు పైగా వెళ్ళి ఆగింది.
19
కెరూబులు నేను చూస్తుండగా తమ రెక్కలు అల్లార్చి బయటకు వెళ్ళాయి. వాటితో పాటు చక్రాలు కూడా వాటి పక్కనే పైకి లేచాయి. అవి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గర నిలిచాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా వచ్చి నిలిచింది.
20
కెబారు నది దగ్గర ఇశ్రాయేలు ప్రజల దేవుని కింద నాకు కనబడిన జీవులు ఇవే. అవి కెరూబులని నేను తెలుసుకున్నాను!
21
ఒక్కో దానికి నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ ఆ రెక్కల కింద మనిషి చేతుల్లాంటివీ ఉన్నాయి.
22
వాళ్ళ ముఖాలు కెబారు నది దగ్గర నాకు కలిగిన దర్శనంలో నేను చూసిన రూపాల్లాగే ఉన్నాయి. అవి అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.
11
దైవభక్తిలేని నాయకులకు శిక్ష
1
ఆ తరువాత ఆత్మ నన్ను పైకి ఎత్తి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గరికి తీసుకు వచ్చాడు. ద్వారం దగ్గర వాకిట్లో ఇరవై ఐదు మంది నాకు కనిపించారు. వాళ్ళలో అజ్జూరు కొడుకు యజన్యా, బెనాయా కొడుకు పెలట్యా, ఇంకా ప్రజల నాయకులూ ఉన్నారు.
2
దేవుడు నాకిలా చెప్పాడు. <<దురాలోచనలు చేస్తూ పట్టణంలో దుర్మార్గపు ఆలోచనలు చేసేది వీళ్ళే.
3
వాళ్ళిలా అంటున్నారు, <ఇల్లు కట్టడానికి ఇది సమయం కాదు. ఈ పట్టణం పాత్ర అయితే మనం దానిలో ఆహారం>
4
కాబట్టి వాళ్లకి విరోధంగా ప్రవచనం పలుకు. నరపుత్రుడా, ప్రవచించు.>>
5
ఆ తరువాత యెహోవా ఆత్మ నా పైకి వచ్చాడు. ఆయన నాకిలా చెప్పాడు. <<నువ్వు ఇలా చెప్పు, యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు అలాగే ఆలోచిస్తున్నారు. మీ మనస్సుల్లోకి వచ్చే ఆలోచనలు నాకు తెలుసు.
6
ఈ పట్టణంలో మీ చేతుల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెంచుతున్నారు. మీ వల్ల చనిపోయిన వాళ్ళతో పట్టణ వీధులు నిండిపోయాయి.
7
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు చంపి పట్టణంలో పడవేసిన శవాలే ఆహారం. ఈ పట్టణం వంట పాత్ర. కానీ మిమ్మల్ని మాత్రం పట్టణంలో ఉండకుండాా తీసివేస్తాను.
8
మీరు కత్తికి భయపడుతున్నారు. కాబట్టి మీ పైకి కత్తినే పంపుతాను.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
9
<<నేను మిమ్మల్ని పట్టణంలో నుండి తీసివేస్తాను. మీకు శిక్ష విధిస్తాను. మిమ్మల్ని విదేశీయుల చేతులకు అప్పగిస్తాను.
10
మీరు కత్తి చేత కూలిపోతారు. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనే మీకు తీర్పు తీర్చి శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
11
ఈ పట్టణం మీకు వంటపాత్రగా ఉండదు. మీరు దానిలో ఆహారంగా ఉండరు. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనే మీకు తీర్పు తీర్చి శిక్షిస్తాను.
12
అప్పుడు ఎవరి చట్టాలను అనుసరించి మీరు జీవించకుండా, ఎవరి శాసనాలను పాటించకుండా మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల శాసనాలను పాటించారో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.>>
13
నేను ఆ ప్రకారమే ప్రవచిస్తూ ఉండగా బెనాయా కొడుకైన పెలట్యా చచ్చిపోయాడు. దాంతో నేను సాష్టాంగపడి పెద్ద స్వరంతో <<అయ్యో! ప్రభూ, యెహోవా, ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళని సమూలంగా నాశనం చేస్తావా?>> అన్నాను.
14
అప్పుడు యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా అన్నాడు.
15
<<నీ సోదరులను గూర్చీ నీ గోత్రం వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు ప్రజలందరిని గూర్చీ యెరూషలేము పట్టణవాసులు <మీరంతా యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు. ఈ దేశాన్ని దేవుడు మాకు స్వాధీనం చేశాడు>అని చెప్తున్నారు.>>
16
కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పు. <<ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, దూరంగా ఉన్న జాతుల్లోకి నేను వారిని తొలగించినా, ఇతర దేశాల్లోకి వాళ్ళని నేను చెదరగొట్టినా వాళ్ళు చెదరిపోయిన దేశాల్లో నేను వారికి కొంతకాలం పరిశుద్ద ఆలయంగా ఉంటాను>>
17
కాబట్టి ఇలా చెప్పు <<యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. నేను ఇతర జనాల మధ్యలో నుండి మిమ్మల్ని సమకూరుస్తాను. మీరు చెదిరిపోయిన దేశాలనుండి మిమ్మల్ని నేను సమీకరిస్తాను. మీకు తిరిగి ఇశ్రాయేలు దేశాన్ని ఇస్తాను
18
వారు అక్కడికి తిరిగి వస్తారు. వాళ్ళు ప్రతి అసహ్యమైన దాన్నీ నీచమైన దాన్నీ అక్కడనుండి తీసివేస్తారు.
19
వాళ్ళు నా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్లకి ఏక హృదయాన్ని ఇస్తాను. వాళ్ళలో కొత్త ఆత్మను ఉంచుతాను. వాళ్ళ శరీరంలోనుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను.
20
దానివల్ల వాళ్ళు నా చట్టాలను అనుసరిస్తారు. నా శాసనాలను పాటిస్తారు. అప్పుడు వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. నేను వాళ్ళ దేవుడిగా ఉంటాను.
21
అయితే అసహ్యమైన వాటిపట్ల, నీచమైన వాటిపట్ల అనురక్తితో నడిచే వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తాను.>> ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
22
అప్పుడు కెరూబులు తమ రెక్కలు చాపాయి. చక్రాలు వాటి పక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా ఉంది.
23
తరువాత యెహోవా మహిమ తేజస్సు పట్టణంలో నుండి పైకి వెళ్ళి తూర్పున ఉన్న పర్వతంపై నిలిచింది.
24
తరువాత దేవుని ఆత్మ నాకనుగ్రహించిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి కల్దీయ దేశంలోని బందీల దగ్గరికి చేర్చాడు. నేను చూసిన దర్శనం నన్ను విడిచి వెళ్ళింది.
25
అప్పుడు యెహోవా నాకు తెలియజేసిన సంగతులన్నిటినీ అక్కడి బందీలకు వివరించాను.
12
చెరను ఒక సూచనగా ఉదహరించడం
1
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు.
2
<<నరపుత్రుడా, నువ్వు తిరగబడే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లకు కళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళు చూడరు. వాళ్లకి చెవులు ఉన్నాయి. కానీ వినరు.
3
నరపుత్రుడా, నువ్వైతే దేశాంతరం వెళ్ళడానికి సామాను సిద్ధం చేసుకో. పగలు వాళ్ళు చూస్తుండగానే నువ్వు నీ స్థలాన్ని విడిచి ప్రయాణమై వేరే స్థలానికి దేశాంతరం పోవాలి. వాళ్ళు తిరగబడే వాళ్ళే అయినా ఇదంతా గమనించడం మొదలు పెడతారేమో.
4
వాళ్ళు చూస్తుండగానే పగటి వేళ దేశాంతరం వెళ్ళడానికి నీ సామాను బయటకి తీయాలి. అలాగే మరో దేశం ప్రయాణమయ్యే వాడు వెళ్ళినట్టుగా వాళ్ళు చూస్తుండగా సాయంత్రం వేళలో వెళ్ళాలి.
5
వాళ్ళు చూస్తుండగా గోడకి కన్నం వేసి దానిలో నుండి బయల్దేరు.
6
వాళ్ళు చూస్తుండగా నీ వస్తువులను భుజం మీదికెత్తుకో. వాటిని రాత్రివేళ బయటకు తీసుకు రా. నీకు నేల కనపడకుండా ముఖం కప్పుకో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నేను నిన్ను ఒక సూచనగా నిర్ణయించాను.>>
7
ఆయన నాకాజ్ఞాపించినట్టే నేను చేశాను. దేశాంతరం వెళ్ళడానికి పగలు సామాను బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేత్తో గోడకి కన్నం వేసి నా వస్తువులను చీకట్లో బయటకు తెచ్చాను. వాళ్ళు చూస్తుండగా వాటిని నా భుజం పైకెత్తుకున్నాను. నేను దేశాంతరం పోతున్నట్టుగా పగటివేళ నా సామాను బయటికి తెచ్చి పొద్దుగుంకే వేళ నా చేత్తో గోడకు కన్నం వేసి, వారు చూస్తుండగా సామగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకున్నాను.
8
తరువాత ఉదయం యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
9
<<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు, ఆ తిరగబడే జనం <నువ్విలా చేస్తున్నావేమిటి?> అని అడగడం లేదా?
10
వాళ్ళకిలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ ప్రవచనాత్మక సందేశం యెరూషలేములోని పరిపాలకుడికీ దానిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ చెందుతుంది.
11
నేను మీకు ఒక సూచనగా ఉన్నాను. నేను చేసి చూపినదే వాళ్ళకీ జరుగుతుంది. వాళ్ళు చెరలోకి వెళ్తారు. బందీలుగా దేశాంతరం పోతారు.
12
వాళ్ళలో ఉన్న పరిపాలకుడు తన సామాను భుజం మీద ఎత్తుకుని రాత్రివేళ గోడలో నుండి వెళ్తాడు. వాళ్ళు గోడ తవ్వి దాంట్లో నుండి తమ వస్తువులు బయటకు తీసుకువస్తారు. అతడు నేలను చూడకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు.
13
నేను అతణ్ణి పట్టుకోడానికి వల విసురుతాను. అతడు నా వలలో చిక్కుకుంటాడు. అతణ్ణి కల్దీయ ప్రజల దేశమైన బబులోనుకి తీసుకు వస్తాను. కానీ అతడు ఆ స్థలాన్ని చూడకుండానే మరణిస్తాడు.
14
అతనికి సహాయం చేయడానికి వచ్చిన వారినీ, అతని మొత్తం సైన్యాన్నీ నేను అన్ని దిక్కులకీ చెదరగొడతాను. వాళ్ళ వెనుకే ఒక కత్తిని పంపి తరుముతాను.
15
నేను వాళ్ళని అనేక జనాల్లోకి చెదరగొట్టి, అనేక దేశాల్లోకి పంపిన తరువాత వాళ్ళు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు.
16
ఇతర ప్రజలకు తమ అసహ్యమైన పనులను గూర్చి వివరించడానికి నేను కొంతమందిని కత్తీ, కరువూ, తెగులు బారిన పడకుండా కాపాడతాను.>>
17
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
18
<<నరపుత్రుడా, భయపడుతూ నీ ఆహారం తిను. చింతా ఆందోళనలతో నీళ్ళు తాగు.
19
తరువాత, దేశ ప్రజలకు ఇలా ప్రకటించు. యెరూషలేములో నివసించే వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు దేశాన్ని గూర్చీ ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వాళ్ళు వణికిపోతూ తమ ఆహారం తింటారు. భయపడి పోతూ నీళ్ళు తాగుతారు. ఎందుకంటే అక్కడ నివసించే వాళ్ళు చేసే హింస, దౌర్జన్యాల వల్ల దేశంలోని సౌభాగ్యం నాశనం అయింది.
20
పట్టణాలు నిర్జనంగానూ, శిథిలంగానూ మారతాయి. దేశం నిస్సారం అవుతుంది. అప్పుడు మీరు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు.>>
21
తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
22
<<నరపుత్రుడా, <రోజులు గడిచి పోతున్నాయి, ప్రతి దర్శనమూ విఫలమవుతుంది> అని సామెత చెప్తారే. దాని అర్థం ఏమిటి?
23
కాబట్టి నువ్వు వాళ్లకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత చెప్పకుండా నేను ఈ సామెతకి ముగింపు పలుకుతున్నాను. దాన్ని వ్యర్ధం చేస్తున్నాను. ఇలా చెప్పి వాళ్ళకి <ప్రతి దర్శనమూ నెరవేరే రోజులు దగ్గర పడుతున్నాయి.> అని ప్రకటించు.>>
24
<<ఇశ్రాయేలు ప్రజల్లో ఇక మీదట తప్పుడు దర్శనాలూ, అనుకూల జోస్యాలూ ఉండవు.
25
నేను యెహోవాను. నేనే మాట్లాడుతున్నాను. నా మాటలు నేను నెరవేరుస్తాను. ఏమాత్రం ఆలస్యం కాకుండా ఇదంతా జరుగుతుంది. తిరగబడే జనమా, మీ రోజుల్లోనే నేను ఈ మాట చెప్పి దాన్ని నెరవేరుస్తాను. ఇదే ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.>>
26
తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
27
<<నరపుత్రుడా, చూడు. <ఇతడు చూస్తున్న దర్శనం జరగడానికి ఇంకా ఎన్నో రోజులు పడుతుంది. చాలా కలం తరవాత జరిగే వాటిని గూర్చి ఇతడు ఇప్పుడే ప్రవచనం చెప్తున్నాడు> అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు.
28
అయితే నువ్వు వాళ్ళకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. నా మాటలు ఇక ఆలస్యం కావు. నేను పలికినది తప్పక నెరవేరుతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.>>
13
అబద్ధ ప్రవక్తలు ఖండన
1
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
2
<<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవచనం చెప్తున్న ప్రవక్తలకు విరోధంగా ప్రవచించు. తమ సొంత ఆలోచనలను ప్రవచనాలుగా చెప్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. యెహోవా మాట వినండి!
3
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. దర్శనం ఏదీ చూడకుండా సొంత ఆలోచనలను అనుసరించే తెలివి తక్కువ ప్రవక్తలకు బాధ!
4
ఇశ్రాయేలు ప్రజలారా, మీ ప్రవక్తలు బంజరు భూముల్లో తిరిగే నక్కల్లా ఉన్నారు.
5
యెహోవా దినాన జరిగే యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు శత్రువును ఎదిరించడానికి మీరు గోడల్లో ఉన్న పగుళ్ళ జోలికి వెళ్ళరు. ప్రాకారానికి మరమ్మత్తులు చేయరు.
6
<యెహోవా ఇలా చెప్తున్నాడు> అని చెప్పే వాళ్ళు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధపు జోస్యాలు చెప్తారు. యెహోవా వాళ్ళని పంపలేదు. అయినా తమ సందేశం జరుగుతుంది అని ప్రజలు ఆశ పడేలా చేస్తారు.
7
నేను అసలేమీ మాట్లాడకుండానే <యెహోవా చెప్పేది ఇదీ, అదీ> అంటూ చెప్పే మీరు అబద్ధపు దర్శనాలు చూడలేదా? అబద్ధపు జోస్యాలు చెప్పలేదా?
8
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ప్రభువైన యెహోవా మీకు విరోధంగా చేస్తున్న ప్రకటన ఇదే,
9
అబద్ధపు దర్శనాలు చూస్తూ జోస్యం చెప్తున్న ప్రవక్తలకి నేను వ్యతిరేకిని. నా ప్రజల సభలోకి వాళ్ళని రానివ్వను. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళను నమోదు చేయను. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు నేనే యెహోవాను, అని మీరు తెలుసుకుంటారు.
10
శాంతి లేకుండానే <శాంతి> అని ప్రవచిస్తూ నా ప్రజలను వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఒక గోడ కట్టి దానిపై సున్నం పూస్తున్నారు
11
గోడకి సున్నం వేస్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. ఇది కూలిపోతుంది. జడివాన కురుస్తుంది. దీన్ని పడగొట్టడానికి నేను పిడుగులు పంపిస్తాను. పడిన గోడను చిన్నాభిన్నం చేయడానికి గాలి తుఫానుని పంపుతాను.
12
ఆ గోడ పడిపోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని <మీరు వేసిన సున్నం ఎక్కడ?> అని అడుగుతారా లేదా?>>
13
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<నా క్రోధంలో నుండి గాలి తుఫాను, నా గొప్ప కోపంలో నుండి కుంభవృష్టిగా వర్షాలూ రప్పిస్తాను! నా క్రోధం వల్ల పడిన వడగళ్ళు ఆ గోడను సమూలంగా ధ్వంసం చేస్తాయి.
14
మీరు సున్నం వేసిన గోడను పునాదులు కనపడేలా నేలమట్టం చేస్తాను. అది పడిపోతుంది. దాని కింద మీరూ నిర్మూలం అవుతారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
15
ఈ విధంగా నేను మహా కోపంతో ఆ గోడనూ, దానికి సున్నం వేసిన వాళ్ళనీ నిర్మూలం చేస్తాను. అప్పుడు మీతో నేను <గోడ ఇక లేదు. అలాగే దానికి సున్నం వేసిన వాళ్ళు కూడా లేరు> అని చెప్తాను.
16
సున్నం వేసిన వాళ్ళు ఎవరంటే యెరూషలేముకి శాంతి లేకున్నా యెరూషలేముకి శాంతి కలుగుతుందని దర్శనాలు చూసిన ఇశ్రాయేలు ప్రజల ప్రవక్తలే. ఇదే ప్రభువైన యెహోవా పలికిన మాట.>>
17
నరపుత్రుడా, తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవచనం పలికే ఇశ్రాయేలు ప్రజల కూతుళ్ళకు విరోధంగా ప్రవచించు.
18
ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ప్రజలను ఉచ్చులోకి లాగేందుకు తమ చేతుల నిండా తాయెత్తులు కట్టుకుని తమ తలలపై రకరకాల ముసుగులు వేసుకునే స్త్రీలకు బాధ. నా ప్రజల ప్రాణాలను ఉచ్చులోకి లాగుతూ మీ ప్రాణాలను కాపాడుకోగలరా?
19
చారెడు బార్లీ గింజలకీ కొన్ని రొట్టె ముక్కలకీ ఆశపడి ప్రజల్లో నా పేరును అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్తూ వాళ్ళు నిర్దోషులను చంపేలా, చావడానికి అర్హులైన వాళ్ళను విడిచిపెట్టేలా చేశారు.
20
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. పక్షులకు వల విసిరినట్టుగా ప్రజల ప్రాణాలకు ఉచ్చు వేయడానికి మీరు ఉపయోగించే తాయెత్తులకి నేను వ్యతిరేకం. వాటిని మీ చేతులనుండి నేను కచ్చితంగా తెంపి వేస్తాను. పక్షులను పట్టినట్టు మీరు వల వేసి పట్టిన ప్రజలను నేను విడిపిస్తాను.
21
వాళ్ళు ఇకపై మీ చేతుల్లో బందీలుగా ఉండకుండాా నేను మీ ముసుగులను చింపి వాళ్ళని విడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
22
నీతిగల వ్యక్తి నిరుత్సాహపడాలని నేను కోరుకోను. కానీ మీరు మీ అబద్దాల చేత నీతిగల వ్యక్తులను నిరుత్సాహపరిచారు. దుర్మార్గుడు తన పాపం వదిలేసి తన ప్రాణాన్ని కాపాడుకోకుండా మీరు వాడి దుర్మార్గతను ప్రోత్సహించారు.
23
కాబట్టి మీరు ఇకనుండి అబద్ధపు దర్శనాలు చూడరు. జోస్యాలూ చెప్పరు. నా ప్రజలను నేను మీ స్వాధీనం నుండి విడిపిస్తాను. అప్పుడు నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
14
విగ్రహాలను విసర్జించమని పిలుపు
1
తరువాత ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో కొందరు నా దగ్గరకి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
2
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
3
<<నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా?
4
కాబట్టి నువ్వు ప్రకటన చేసి వాళ్లకి ఈ సంగతి చెప్పు. కాబట్టి నీవు వాళ్లకి సంగతి తెలియజేసి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహాలను హృదయంలో ప్రతిష్టించుకున్న వారెవరైనా, లేదా తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్న ఎవరైనా, ఆ తరువాత ప్రవక్త దగ్గరికి వస్తే యెహోవానైన నేను వాడు పెట్టుకున్న విగ్రహాల సంఖ్యను బట్టి వాడికి జవాబిస్తాను.
5
వాళ్ళు పెట్టుకున్న విగ్రహాల కారణంగా నాకు దూరమయ్యారు కాబట్టి తిరిగి వాళ్ళ హృదయాలను వశం చేసుకోడానికి నేనలా చేస్తాను.
6
కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట చెప్పు. <పశ్చాత్తాప పడండి. విగ్రహాలను విడిచిపెట్టండి. మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మాని వేయండి.>
7
ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా, వాళ్ళ మధ్య నివసించే విదేశీయుల్లో ఎవరైనా నన్ను విడిచి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్టించుకుని, తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకుని ప్రవక్త దగ్గరికి వస్తే నేనే సూటిగా వాళ్ళకి జవాబిస్తాను.
8
అలాంటి వ్యక్తికి నేను విరోధంగా ఉండి అతణ్ణి సూచనగానో, సామెతగానో మారుస్తాను. ఎందుకంటే నేను అతణ్ణి నా ప్రజల్లో నుండి కొట్టివేస్తాను. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
9
ఒకవేళ ఎవరన్నా ఒక ప్రవక్త మోసపోయి ఒక సందేశం పలికితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి విరోధంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలు నుండి అతణ్ణి నాశనం చేస్తాను.
10
ఇశ్రాయేలు ప్రజలు తమ అతిక్రమాల్లో కొనసాగుతారు. ఎందుకంటే ప్రవక్త దోషం ఎంతో అతడి దగ్గర ఆలోచన కోసం వచ్చేవాడిదీ అంతే దోషం అవుతుంది.
11
దీని కారణంగా ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట నాకు దూరంగా వెళ్ళరు. తమ అతిక్రమాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వాళ్ళు నా ప్రజలై ఉంటారు. నేను వాళ్ళ దేవుడినై ఉంటాను.>>ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
12
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
13
<<నరపుత్రుడా, ఒక దేశం నాకు విరోధంగా పాపం చేసినప్పుడు నేను దాన్ని శిక్షించడానికి నా హస్తం చాపి దాని ఆహార వనరులను నాశనం చేసి, దానిపై కరువు పంపి, దేశంలో మనుషులనూ పశువులనూ నిర్మూలం చేస్తాను.
14
అప్పుడు ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు- ఈ ముగ్గురూ ఉన్నప్పటికీ వాళ్ళు తమ నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకోగలుగుతారు. ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
తీర్పు తప్పించుకోవడానికి మార్గం లేదు
15
బాటసారులెవ్వరూ దానిగుండా ప్రయాణం చేయలేకుండా దేశాన్ని బంజరుగానూ నిర్జనం గానూ చేయడానికి అడవి మృగాలను నేను రప్పిస్తే
16
నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులనూ కూతుళ్ళనూ కూడా రక్షించుకోలేరు. వాళ్ళ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. దేశం వ్యర్ధమై పోతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
17
నేను దేశానికి విరోధంగా ఖడ్గాన్ని పంపి <ఖడ్గమా, దేశమంతా సంచరించి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చెయ్యి> అని ఆజ్ఞ ఇస్తే
18
నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
19
రక్తపాతం జరిగించడం ద్వారా నేను నా క్రోధాన్ని దేశంపై కుమ్మరించడానికి తెగులు పంపి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయాలని చూస్తే
20
అప్పుడు నోవహు, దానియేలు, యోబు అనే ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. వాళ్ళు తమ నీతి వల్ల తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు.
21
ఎందుకంటే ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. యెరూషలేముకు విరోధంగా దానిలోని మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయడానికి నేను కరువు, ఖడ్గం, క్రూర మృగాలు, తెగులు అనే నాలుగు శిక్షలను కచ్చితంగా పంపుతాను. మరింత గడ్డు పరిస్థితి కలిగిస్తాను.
22
అయినా, వినండి! తమ కొడుకులతో కూతుళ్ళతో బయటకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా దానిలో కొంత <శేషం> మిగిలిపోతుంది. చూడండి! వాళ్ళ కొడుకులూ కూతుళ్ళూ తిరిగి నీ దగ్గరికి వస్తారు. నువ్వు వాళ్ళ ప్రవర్తననూ, పనులనూ చూస్తావు. అప్పుడు యెరూషలేముకు వ్యతిరేకంగా నేను పంపిన శిక్షల విషయంలోనూ, దేశానికి విరోధంగా నేను పంపిన వాటన్నిటి విషయంలోనూ నీకు ఆదరణ కలుగుతుంది.
23
మిగిలి ఉన్న వాళ్ళ ప్రవర్తన, పనులు చూసినప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. వాళ్ళు నిన్ను ఆదరిస్తారు. నేను ఆమెకి వ్యతిరేకంగా చేసినదేదీ నిష్కారణంగా చేయలేదని మీరు తెలుసుకుంటారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.>>
15
ద్రాక్ష చెట్టు ఉపమానం
1
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
2
<<నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కర్రల కంటే ఏ విషయంలో గొప్పది?
3
ద్రాక్ష చెట్టు కర్రను ఎవరైనా దేనికైనా ఉపయోగిస్తారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో కొక్కేలు తయారు చేస్తారా?
4
చూడండి! అది పొయ్యిలో పెట్టి కాల్చడానికే ఉపయోగపడుతుంది కదా! ఆ కర్ర రెండు వైపులా, మధ్యలోనూ పూర్తిగా కాలిన తరువాత ఇక దేనికి పనికి వస్తుంది?
5
చూడు, అది కాలకముందు దేనికీ ఉపయోగపడలేదు. పూర్తిగా కాలిపోయిన తరువాత కూడా దేనికీ పనికి రాదు!
6
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అడవిలోని ఇతర చెట్లవలే కాకుండా ద్రాక్ష చెట్టుని అగ్నికి ఇంధనంగా ఉపయోగించాను. ఇదే విధంగా నేను యెరూషలేములో నివసించే వారి విషయంలో చేస్తాను.
7
నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.
8
వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను దేశాన్ని అంతా దిక్కుమాలిన బంజరు భూమిగా మారుస్తాను.>> ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
16
యెరూషలేము పై తీర్పు
1
అప్పుడు యెహోవా నాకు తన వాక్కు ఇచ్చి,
2
<<నరపుత్రుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన పనులు దానికి తెలియజేసి, నువ్వు ఇలా ప్రకటించు,
3
ప్రభువైన యెహోవా యెరూషలేము గురించి ఇలా అంటున్నాడు, నీ ఆరంభం, నీ పుట్టుక కనాను ప్రదేశంలో జరిగింది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.
4
నువ్వు పుట్టిన రోజు నీ తల్లి నీ బొడ్డు కొయ్యలేదు. శుభ్రం చెయ్యడానికి నిన్ను నీళ్ళతో కడగలేదు, నిన్ను ఉప్పుతో తుడవలేదు, నిన్ను బట్టల్లో చుట్టలేదు.
5
ఈ పనుల్లో ఒక్కటైనా నీ పట్ల చెయ్యాలని ఎవరికీ కనికరం కలగలేదు. నీ పట్ల జాలి పడినవాడు ఒక్కడూ లేడు. నువ్వు పుట్టిన రోజే నీ మీద ద్వేషంతో నిన్ను ఆరుబయట పొలంలో విసిరేశారు.
6
కాని నేను నీ దగ్గరికి వచ్చి, నీ రక్తంలోనే పొర్లుతున్న నిన్ను చూసి, నీ రక్తంలో పొర్లుతున్న నీతో, <బ్రతుకు> అని చెప్పాను.
7
పొలంలో నాటిన ఒక మొక్క ఎదిగినట్టు నువ్వు ఎదిగేలా చేశాను. నువ్వు వృద్ధి పొంది గొప్పదానివై రత్నాలు పొదిగిన ఆభరణం అయ్యావు. నువ్వు నగ్నంగా వస్త్రహీనంగా ఉన్నా, నీ రొమ్ములు బిగువుగా, నీ తలవెంట్రుకలు ఒత్తుగా పెరిగాయి.
8
మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూశాను. చూడు! ప్రేమ కలిగించే ప్రాయం నీకు వచ్చింది గనక నా వస్త్రంతో నీ నగ్నత్వాన్ని కప్పాను. ఆ తరవాత నేను నీతో ఒప్పందం చేశాను.>> ఇది ప్రభువైన యెహోవా చేసిన ప్రకటన. <<అప్పుడు నువ్వు నా దానివయ్యావు.
9
కాబట్టి నేను నీళ్ళతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతా తుడిచి, నిన్ను నూనెతో అభిషేకం చేసి,
10
బుటాదారీ పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసి, నీ పాదాలకు తోలు చెప్పులు తొడిగాను. సన్నని నారబట్టతో నిన్ను చుట్టి, పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.
11
తరువాత ఆభరణాలతో నిన్ను అలంకరించి నీ చేతులకు కడియాలు తొడిగి నీ మెడలో గొలుసు వేసి,
12
నీ చెవులకూ, ముక్కుకూ పోగులు పెట్టి, నీ తల మీద కిరీటం పెట్టాను.
13
ఈ విధంగా బంగారంతో, వెండితో నేను నిన్ను అలంకరించి, సన్న నార, పట్టు, బుటాదారీ పని ఉన్న బట్టలు నీకు ధరింపజేశాను. నువ్వు మెత్తని గోదుమ పిండి, తేనె, నూనె ఆహారంగా తిని, అత్యంత సౌందర్యరాశివైన రాణివయ్యావు.
14
నేను నీకిచ్చిన ఘనతతో నీ అందం పరిపూర్ణం అయింది. దేశదేశాల్లో నీ కీర్తి ప్రచురం అయ్యింది.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
15
<<కాని నువ్వు నీ అందాన్ని ఆధారం చేసుకుని, నీకు కీర్తి వచ్చినందుకు, ఒక వేశ్యలా దారిలో వెళ్ళే ప్రతివాడితో పొకిరీ పనులు జరిగిస్తూ వచ్చావు. నువ్వు ఆ మగాళ్ళ సొత్తుగా అయ్యావు.
16
అప్పుడు నువ్వు నీ వస్త్రాలతో రంగురంగులతో అలంకరించిన దేవాలయాలు నీ కోసం చేసుకుని, వాటి దగ్గర ఒక వేశ్యలా ప్రవర్తించావు. ఇలా జరగాల్సింది కాదు. ఇది జరగక పొతే బాగుండేది.
17
నేను నీకిచ్చిన బంగారం, వెండి ఆభరణాలతో నువ్వు పురుష రూపంలో విగ్రహాలు చేసుకుని వాటితో ఒక పతిత చేసినట్టు చేశావు.
18
ఇంకా నీ బుటాదారీ పని చేసిన వస్త్రాలు తీసి వాటికి కప్పి, నా తైలాలు, నా పరిమళ తైలాలు వాటి కోసం అర్పించావు.
19
నీ పోషణ కోసం నేను నీకిచ్చిన మెత్తని గోదుమ పిండితో చేసిన నా రొట్టెలు, నూనె, తేనె తీసుకుని, సువాసన కలిగేలా నువ్వు వాటి కోసం అర్పణ చేశావు. నిజంగా జరిగింది ఇదే.>> ఇది ప్రభువైన యెహోవా వాక్కు.
20
<<తరువాత ఆ ప్రతిమలు ఆత్రంగా మింగేయడానికి నువ్వు నాకు కన్న కొడుకులను, కూతుళ్ళను వాటికి బలి అర్పించావు.
21
నువ్వు నా పిల్లలను చంపి ఆ ప్రతిమలకు దహనబలిగా అర్పించావు.
22
నీ బాల్యంలో నువ్వు నగ్నంగా, వస్త్రహీనంగా ఉండి నీ రక్తంలో నువ్వు పొర్లుతూ ఉన్న సంగతి మర్చిపోయి ఈ అసహ్యమైన వ్యభిచార క్రియలు చేస్తూ వచ్చావు.
23
బాధ! నీకు బాధ>> ఇది ప్రభువైన యెహోవా వాక్కు. <<కాబట్టి, ఈ దుర్మార్గమంతటికీ తోడుగా,
24
నువ్వు నీ కోసం ఒక బలిపీఠం, ప్రతి బహిరంగ ప్రాంగణంలో ఒక గుడి కట్టించావు.
25
ప్రతి వీధి మొదట్లో గుళ్ళు కట్టి, నీ అందాన్ని అసభ్య క్రియల కోసం వాడి, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నీ కాళ్ళు తెరిచి వాళ్ళతో ఎన్నో వ్యభిచార క్రియలు చేశావు.
26
నువ్వు కామ వాంఛలతో నిండి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వేశ్యలా ప్రవర్తించి, వ్యభిచార క్రియలు ఎన్నో చేసి నాకు కోపం పుట్టించావు.
27
కాబట్టి చూడు! నేను నీకు విరోధినై నీకు తిండి లేకుండా చేస్తాను. నీ వ్యభిచార క్రియలనుబట్టి నిన్ను సిగ్గు పరచడానికి, నీ శత్రువులైన ఫిలిష్తీయుల కూతుళ్ళ చేతికి నీ ప్రాణం అప్పగిస్తాను.
28
నీకు తృప్తి లేక, అష్షూరువాళ్ళతో కూడా నువ్వు ఒక వేశ్యలా ప్రవర్తించావు. వేశ్యలా ప్రవర్తించినా, నీకు తృప్తి కలగలేదు.
29
కనాను దేశం మొదలుకుని కల్దీయ దేశం వరకూ ఎంతో వ్యభిచారం చేసినా, నువ్వు తృప్తి పొందలేదు.
30
నీ హృదయం ఎందుకింత బలహీనంగా ఉంది?>> ఇది ప్రభువైన యెహోవా వాక్కు<<సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటనన్నిటినీ జరిగించడానికి
31
నువ్వు ప్రతి వీధి మొదట్లో బలిపీఠాలు, ప్రతి బహిరంగ ప్రదేశంలో గుళ్ళు కట్టి, నిజానికి నువ్వు ఒక వేశ్య చేసినట్టు చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు చేసిన వేశ్యక్రియలకు డబ్బు తీసుకోలేదు!
32
కులటా! నువ్వు నీ భర్తకు బదులుగా పరాయివాళ్ళను అంగీకరించావు!
33
మనుషులు వేశ్యలకు డబ్బు చెల్లిస్తారు, కాని నీ ప్రేమికులందరూ నలుదిక్కుల నుంచి వచ్చి నీతో వ్యభిచరించడానికి రమ్మని వాళ్ళందరికీ నువ్వే నీ డబ్బు బాడుగగా ఇస్తూ వచ్చావు.
34
నీకు, ఇతర స్త్రీలకు తేడా ఉంది. ఎందుకంటే, తమతో వ్యభిచారం చెయ్యమని ఎవరూ నిన్ను అడగరు. నువ్వే వాళ్లకు ఎదురు డబ్బు చెల్లిస్తావు! నీకెవరూ డబ్బు ఇవ్వరు.>>
35
కాబట్టి కులటా, యెహోవా మాట ఆలకించు!
36
ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే <<నువ్వు నీ వ్యభిచార క్రియల ద్వారా నీ ప్రేమికులతోనూ, అసహ్యమైన నీ ప్రతిమలన్నిటితోనూ నీ కామం ఒలకబోసి నీ అంగప్రదర్శన చేశావు గనుక, ఆ విగ్రహాలకు నువ్వు నీ పిల్లలను బలి ఇచ్చి వాళ్ళ రక్తం చిందించావు గనుక,
37
ఇదిగో! నువ్వు ఎవరితో పడుకున్నావో ఆ నీ ప్రేమికులందర్నీ, విటులందర్నీ, నువ్వు ద్వేషించే వాళ్ళందర్నీ నేను పోగుచేస్తున్నాను. వాళ్ళను నీ చుట్టూ పోగు చేసి, వాళ్లకు నీ మానం కనబడేలా నేను నీ దిగంబరత్వాన్ని బట్ట బయలు చేస్తాను!
38
నువ్వు చేసిన వ్యభిచారాన్ని బట్టి, నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి నా కోపంతో నా రోషంతో కూడిన రక్తపాతం నీ మీదకు తెప్పిస్తాను.
39
వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాను. నువ్వు కట్టిన గుళ్లను వాళ్ళు కూలదోసి, నువ్వు నిలబెట్టిన బలిపీఠాలను పగల గొట్టి, నీ బట్టలు ఊడదీసి, నీ నగలు లాగేసుకుని నిన్ను నగ్నంగా, బోడిగా చేస్తారు.
40
వాళ్ళు నీ మీదకి సమూహాలను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. కత్తులతో నిన్ను పొడిచి ముక్కలు చేస్తారు.
41
వాళ్ళు నీ ఇళ్ళను తగలబెడతారు. ఎంతోమంది స్త్రీలు చూస్తూ ఉండగా నీకు ఎన్నో శిక్షలు వేస్తారు. ఈ విధంగా నేను నీ వ్యభిచారం మాన్పిస్తాను. ఇంక నువ్వు వాటి కోసం ఎవరికీ డబ్బు చెల్లించవు!
42
అప్పుడు నాకు నీ మీద ఉన్న ఉగ్రత చల్లార్చుకుంటాను. నీ పట్ల నాకున్న కోపం పోతుంది, అప్పుడు నేను తృప్తి చెంది, ఇకపై నీ మీద కోపం తెచ్చుకోను.
43
నువ్వు నీ యవ్వన ప్రాయం గుర్తు చేసుకోకుండా వీటన్నిటి మూలంగా నాకు పట్టరాని కోపం తెప్పించావు గనక, చూడు! నువ్వు చేసిన అసహ్యమైన పనులన్నిటిని బట్టి నీ తల మీదకి నేనే శిక్ష రప్పిస్తాను>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. <<కాబట్టి ఇంక నువ్వు నీ అసహ్యమైన దుర్మార్గపు ప్రవర్తన మానుకుంటావు.
44
చూడు! సామెతలు చెప్పేవాళ్ళందరూ, <తల్లి ఎలాంటిదో కూతురూ అలాంటిదే> అని నిన్ను గూర్చి అంటారు.
45
భర్తనూ, బిడ్డలనూ విడిచిపెట్టిన నీ తల్లీ, నువ్వూ ఒకే రకం. భర్తనూ, బిడ్డలనూ విడిచిపెట్టిన నీ అక్కచెల్లెళ్ళు, నువ్వూ ఒకే రకం. నీ తల్లి హిత్తీయురాలు. నీ తండ్రి అమోరీయుడు.
46
నీ ఎడమవైపు నివసించే షోమ్రోనూ, దాని కుమార్తెలూ నీకు అక్కలు, నీ కుడివైపు నివసించే సొదొమ, దాని కుమార్తెలూ నీకు చెల్లెళ్ళు.
47
అయితే అవేవో చిన్న విషయాలన్నట్టు, వాళ్ళ అసహ్యమైన ప్రవర్తన ప్రకారం గాని, వాళ్ళ దుర్మార్గంలో గాని నువ్వు ఉండొద్దు. నిజానికి వాళ్ళందరికన్నా నీ ప్రవర్తన ఎంతో ఘోరం.
48
నువ్వూ, నీ కూతుళ్ళూ చేసినట్టు నీ చెల్లెలు సొదొమ గాని, దాని కూతుళ్ళు గాని చెయ్యలేదని నా జీవం తోడు, ప్రమాణం చేస్తున్నాను>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
49
<<చూడు! నీ చెల్లెలు సొదొమ పాపం ఏమంటే, అది తనకు కలిగిన కులాసాను బట్టి అహంకారం చూపింది. దేని గురించీ దానికి దిగులు లేదు, దేన్నీ లక్ష్య పెట్టదు. పేదల చేతులు దాని వైపుకు, దాని కూతుళ్ళ వైపుకు చాచి ఉన్నాయి గానీ అది ఎవరికీ సాయం చెయ్యలేదు.
50
వాళ్ళు అహంకారంతో నా దృష్టిలో అసహ్యమైన క్రియలు చేశారు గనుక నేను దాన్ని చూసి వాళ్ళను వెళ్ళగొట్టాను.
51
షోమ్రోను కూడా నీ పాపాల్లో సగమైనా చెయ్యలేదు. వాళ్ళకన్నా నువ్వు అత్యధికంగా అసహ్యకార్యాలు చేశావు. నువ్వు ఇన్ని అసహ్యమైన పనులు చేసి, నీ సోదరి నీకన్నా మెరుగైనదిగా కనబడేలా చేశావు.
52
నువ్వు వాళ్ళకన్నా అత్యధికంగా అసహ్యమైన పనులు చేశావు గనుక నీతో పోల్చి చూసినప్పుడు నీ సోదరీలు నీకన్నా మెరుగైనవాళ్ళుగా నువ్వు చూపించావు. నువ్వు వాళ్లకు విధించిన అవమాన శిక్ష నీకే రావాలి. నీతో పోల్చి చూసినప్పుడు నీ సోదరీలు నీకన్నా మెరుగైనవాళ్ళుగా కనిపిస్తున్నారు గనుక నీకు అవమానం, సిగ్గూ కలుగుతాయి.
53
నేను సొదొమను, దాని కూతుళ్ళనూ, షోమ్రోను, దాని కూతుళ్ళనూ గతంలో ఉన్న సౌభాగ్యానికి తెస్తాను. కాని నీ భాగ్యం వాళ్ళలా ఉండదు.
54
వీటివలన నువ్వు సిగ్గుపడతావు. నువ్వు చేసిన వాటన్నిటి బట్టి నువ్వు అవమానం పాలవుతావు. ఆ విధంగా నువ్వు వాళ్లకు ఆదరణగా ఉంటావు.
55
సొదొమ, దాని కూతుళ్ళూ తమ పూర్వస్థితికి వస్తారు. షోమ్రోను, దాని కూతుళ్ళూ తమ పూర్వస్థితికి వస్తారు. తరువాత నువ్వూ నీ కూతుళ్ళూ మీ పూర్వస్థితికి వస్తారు.
56
నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కూతుళ్ళూ, సిరియా కూతుళ్ళూ నిన్ను అవమానపరిచినప్పుడు
57
నీ దుర్మార్గం బయట పడక ముందు, నువ్వు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలు సొదొమ ప్రస్తావన నువ్వు తీసుకురాలేదు.
58
నువ్వు చేసిన మోసం, నీ అసహ్యమైన పనులు నువ్వే భరించావు.>> ఇదే యెహోవా వాక్కు.
59
యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. <<చేసిన ప్రమాణాన్ని చులకనగా ఎంచి, ఒప్పందం భంగ పరిచే ఎవరికైనా ఏమి చేస్తానో అదే నీకు చేస్తాను.
60
కానీ నేనే నీ యవ్వనంలో నీతో చేసిన నిబంధన గుర్తు చేసుకుంటాను. నీతో శాశ్వత నిబంధన చేస్తాను.
61
అప్పుడు నువ్వు నీ అక్కలను చెల్లెళ్ళను కలుసుకున్నప్పుడు గతంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన గుర్తు చేసుకుంటావు. వారిని నీకు కూతుర్లుగా ఇస్తాను, అయితే నిబంధన మూలంగా కాదు.
62
నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు!
63
నువ్వు చేసిన వాటన్నిటి కోసం నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడి, నోరు మూసుకుంటావు.>> ఇదే ప్రభువైన యెహోవా ప్రకటన.
17
పక్షి రాజు, ద్రాక్షావల్లి
1
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
2
<<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక పొడుపు కథ వెయ్యి. ఒక ఉదాహరణ వారికి చెప్పు.
3
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు.
ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి.
వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి.
ఈ రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది.
4
అది ఆ చెట్టు లేత కొమ్మల చిగుళ్ళు తుంచి, వాటిని కనాను దేశానికి తీసుకు వెళ్ళింది.
అక్కడ వర్తకులుండే పట్టణంలో వాటిని నాటింది.
5
అది ఆ దేశంలో నుండి కొన్ని విత్తనాలు కూడా తీసుకు వెళ్ళింది.
విత్తనాలు నాటడానికి సిద్ధపరిచిన ఒక పొలంలో వాటిని నాటింది.
వాటిని నాటిన చోటికి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది.
6
అది మొలకలు వేసింది. పైకి పెరగకుండా భూమిపై ఎత్తు పెరగకుండానే విశాలమైన కొమ్మలతో నేలపై వ్యాపించి పెద్ద ద్రాక్షావల్లి అయింది.
దాని కొమ్మలు ఆ డేగ వరకూ వ్యాపించాయి. దాని వేళ్ళు డేగ కింద వైపుకు వ్యాపించాయి. ఆ విధంగా ఆ ద్రాక్ష చెట్టు అనేక శాఖలతో వర్ధిల్లి కొత్తగా రెమ్మలు వేసింది.
7
పెద్ద రెక్కలూ, విస్తారమైన ఈకలూ ఉన్న ఇంకో గొప్ప డేగ ఉంది.
చూడండి! ఈ ద్రాక్ష చెట్టు తన వేళ్ళను ఈ డేగ వైపుకి మళ్ళించింది.
అది నీళ్ళు సమృద్ధిగా ఉన్న మంచి భూమి నుండి తన కొమ్మలను డేగ వైపుకి మళ్ళించింది.
8
దాన్ని ఒక పెద్ద నీటి చెరువు పక్కనే మంచి నేల్లో అనేక కొమ్మలు వేసి, ఫలించి, చక్కని ద్రాక్ష తీగె కావాలని నాటడం జరిగింది.>>
9
ప్రజలను ఇలా అడుగు. <<అది అభివృద్ధి చెందుతుందా? ప్రజలు దాని వేళ్ళను పీకివేసి దాని పళ్ళు కోసుకోరా?
అప్పుడది ఎండి పోవాల్సిందే గదా! దాని చిగుళ్ళు ఎండి పోయాక ఎంతమంది దాని కోసం శ్రమించినా దాని వేళ్ళు ఇక చిగురించవు.
10
ఒకవేళ దాన్ని తిరిగి నాటినా అది పెరుగుతుందా? తూర్పునుండి గాలి దాన్ని తాకినప్పుడు అది ఎండిపోతుంది కదా! అది నాటి ఉన్న భూమిలోనే మొత్తం ఎండిపోతుంది.>>
11
తరువాత యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
12
<<తిరగబడే జాతికి ఇలా చెప్పు. ఈ మాటల భావం మీకు తెలియదా? చూడండి! బబులోనురాజు యెరూషలేముకు వచ్చి ఆమె రాజునూ ఆమె యువరాజులనూ పట్టుకుని వాళ్ళని బబులోనులో తన దగ్గరకి తీసుకు పోయాడు.
13
అతడు రాజు వంశస్థుల్లో ఒకణ్ణి తీసుకుపోయి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. అతనితో ఒట్టు పెట్టించాడు. రాజ్యం బలహీనం కావడం కోసం, అది మళ్ళీ కోలుకోకుండా ఉండటానికి దేశంలో ఉన్న బలవంతులను అతడు తీసుకు వెళ్లి పోయాడు.,
14
ఇప్పుడు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటే దేశం నిలిచి ఉంటుంది.
15
కాని యెరూషలేము రాజు గుర్రాల కోసమూ, సైన్యం కోసమూ ఐగుప్తు రాజు దగ్గరికి రాయబారులను పంపడం ద్వారా తిరుగుబాటు చేశాడు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అలాంటి పనులు చేసి అతడు తప్పించుకుంటాడా? నిబంధనను మీరినవాడు తప్పించుకుంటాడా?
16
నా ప్రాణం పైన ఒట్టు, ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన. ఎవరితో చేసిన నిబంధనను అతడు భంగ పరిచాడో, ఏ రాజు దగ్గర ఒట్టు పెట్టాడో, ఏ రాజు తనని రాజుగా చేశాడో ఆ రాజు రాజ్యంలోనే అతడు చనిపోతాడు. అతడు బబులోను లోనే చనిపోతాడు!
17
బబులోను సైన్యాలు యుద్ధంలో ముట్టడికై ఉన్నత స్థలాలను కట్టినప్పుడు, ప్రజలను చంపడానికి ప్రాకారాలను ముట్టడి వేసినప్పుడు ఫరో, అతని బలమైన సైన్యం, అతడు యుద్ధానికి సమకూర్చిన మనుషులు యుద్ధంలో యెరూషలేము రాజును కాపాడలేవు.
18
ఎందుకంటే రాజు తన చేతులు కలిపి ప్రమాణం చేశాడు. నిబంధనను భంగపరచడం ద్వారా తాను చేసిన ప్రమాణాన్ని తృణీకరించాడు. అతడు తప్పించుకోలేడు.>>
19
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<అతడు తృణీకరించిన ప్రమాణం నాకు చేసింది కాదా! నా నిబంధనను అతడు భంగం చేశాడు కదా! కాబట్టి అతడి పైకి శిక్ష రప్పిస్తున్నాను.
20
నా వల అతనిపై విసురుతున్నాను. అతడు నా ఉచ్చులో చిక్కుకుంటాడు. రాజద్రోహం చేసినందుకూ, నాకు నమ్మకద్రోహం చేసినందుకూ అతనిపై శిక్ష అమలు పరచడానికి అతణ్ణి బబులోనుకి తీసుకు వెళ్తాను.
21
అతనితో ఉన్న సైన్యంలో తప్పించుకుని పారిపోయిన వాళ్ళందరూ ఖడ్గం చేత నిర్మూలం అవుతారు. మిగిలిన వాళ్ళు అన్ని వైపులకీ చెదిరిపోతారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందని ప్రకటిస్తున్నాను.>>
22
ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. <<కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.
23
అది శాఖలుగా విస్తరించి ఫలాన్ని ఇచ్చేలా నేను దాన్ని ఇశ్రాయేలు పర్వతాల పైన నాటుతాను. అది ఎంతో ఘనమైన దేవదారు వృక్షం అవుతుంది. దాని కింద రెక్కలున్న పక్షులన్నీ నివసిస్తాయి. దాని కొమ్మల నీడలో అవి తమ గూళ్ళు కట్టుకుని పిల్లలను పెడతాయి.
24
అప్పుడు భూమిపైన చెట్లన్నీ నేనే యెహోవాను అని తెలుసుకుంటాయి. గొప్ప చెట్లను నేను కిందకు లాగుతాను. హీనమైన చెట్లను పైకి లేపుతాను. పచ్చని చెట్టు ఎండిపోయేలా చేస్తాను. ఎండిన చెట్టు వికసించేలా చేస్తాను. నేనే యెహోవాను. ఇది జరుగుతుందని నేను చెప్పాను. దీన్ని తప్పక నెరవేరుస్తాను.>>
18
పాపం చేసవాడు మరణం పొందుతాడు
1
యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది.
2
<<తండ్రులు ద్రాక్షలు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి>> అనే సామెత మీరు ఇశ్రాయేలు ప్రదేశం విషయంలో వాడినప్పుడు, దాని అర్థం ఏంటి?
3
నా జీవం తోడు, ఈ సామెత ఇశ్రాయేలీయుల్లో ఇంక మీరు పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
4
<<చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!
5
ఒకడు నీతిమంతుడుగా ఉండి, నీతిన్యాయాలు జరిగించేవాడై ఉండి,
6-7
పర్వతాల మీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా, అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,
8
వడ్డీకి అప్పు ఇవ్వకుండా, అధిక లాభం తీసుకోకుండా, అన్యాయం చెయ్యకుండా, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చి,
9
నమ్మకంగా నా ఆదేశాలు పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే, వాడే నీతిమంతుడు. అతడు నిజంగా బ్రతుకుతాడు>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
10
కాని ఆ నీతిమంతునికి, ఇలాంటివేవీ చెయ్యకుండా రక్తం ఒలికించే ఒక హింసాత్మకుడైన కొడుకు ఉంటే, వాడు బలాత్కారం చేస్తూ, ప్రాణహాని చేస్తూ, చెయ్యరాని పనులు చేసి,
11
చెయ్యాల్సిన మంచి పనులు ఏవీ చెయ్యకుండా ఉంటే, అంటే, పర్వతాల మీద భోజనం చెయ్యడం, తన పొరుగువాడి భార్యను చెరచడం,
12
అవసరతలో ఉన్నవాళ్ళను, పేదలను బాధ పెట్టి బలవంతంగా నష్టం కలిగించడం, తాకట్టు వస్తువు తిరిగి ఇవ్వకపోవడం, విగ్రహాలవైపు చూసి అసహ్యమైన పనులు జరిగించడం,
13
అప్పిచ్చి వడ్డీ తీసుకోవడం, అధిక లాభం తీసుకోవడం, మొదలైన పనులు చేస్తే, వాడు బ్రతకాలా? వాడు బ్రతకడు! ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు గనుక అతడు తప్పకుండా చస్తాడు. అతని ప్రాణానికి అతడే బాధ్యుడు.
14
అయితే అతనికి ఒక కొడుకు పుట్టినప్పుడు, ఆ కొడుకు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూసి, తనమట్టుకు తాను దేవునికి భయపడి, అలాంటి పనులు చెయ్యకపోతే, అంటే,
15
పర్వతాలమీద భోజనం చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరచకుండా,
16
ఎవరినీ బాధ పెట్టకుండా, తాకట్టు వస్తువు ఉంచుకోకుండా, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యకుండా, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,
17
పేదవాడి మీద అన్యాయంగా చెయ్యి వేయకుండా, లాభం కోసం అప్పివ్వకుండా, వడ్డీ తీసుకోకుండా, నా ఆదేశాలు పాటిస్తూ నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!
18
అతని తండ్రి క్రూరంగా ఇతరులను బాధపెట్టి, బలవంతంగా తన సహోదరులను దోపిడీ చేసి, తన ప్రజల్లో తగని పనులు చేశాడు గనుక తన పాపం కారణంగా తానే చస్తాడు.
19
కాని మీరు <<తండ్రి పాపశిక్ష కొడుకు ఎందుకు మొయ్యడు?>> అంటారు. ఎందుకంటే, కొడుకు నీతిన్యాయాలకు అనుగుణంగా, నా శాసనాలనే అనుసరించి వాటి ప్రకారం చేస్తున్నాడు గనుక అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!
20
పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.
21
అయితే దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచి, నా శాసనాలన్నీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయం జరిగిస్తే అతడు చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు.
22
అతనికి విరోధంగా అతడు చేసిన అతిక్రమాలు జ్ఞాపకానికి రావు. అతడు పాటించే నీతినిబట్టి అతడు బ్రదుకుతాడు.
23
<<దుష్టులు నశిస్తే నేను గొప్పగా ఆనందిస్తానా? అతడు తన ప్రవర్తన సరిచేసుకుని బ్రతకడమే నాకు ఆనందం.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
24
<<కాని, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసి, దుష్టులు చేసే అసహ్యమైన పనులు జరిగిస్తే అతడు బ్రతుకుతాడా? అతడు నాకు నమ్మకద్రోహం చేసి రాజద్రోహం జరిగించాడు గనుక అతడు చేసిన నీతి పనులు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. కాబట్టి అతడు చేసిన పాపం కారణంగా చస్తాడు.
25
కాని మీరు, <యెహోవా మార్గం న్యాయం కాదు> అంటారు. ఇశ్రాయేలీయులారా, నా మాట వినండి! మీ మార్గాలే గదా అన్యాయమైనవి.
26
నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే అతడు వాటిని బట్టి చస్తాడు. తాను పాపం చేసిన కారణంగానే అతడు చస్తాడు.
27
కాని ఒక దుష్టుడు తాను చేస్తూ వచ్చిన దుష్టత్వం నుంచి వెనుదిరిగి నీతిన్యాయాలు జరిగిస్తే తన ప్రాణం రక్షించుకుంటాడు.
28
అతడు గమనించుకుని తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నీ చెయ్యకుండా మాని వేశాడు గనక అతడు చావకుండా కచ్చితంగా బ్రతుకుతాడు.
29
కాని ఇశ్రాయేలీయులు <యెహోవా మార్గం న్యాయం కాదు> అని అంటున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గం న్యాయం ఎందుకు కాదు? మీ మార్గం అన్యాయం ఎందుకు కాదు?
30
కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి.
31
మీరు చేసిన అతిక్రమాలన్నీ మీ మీద నుంచి విసిరేసి మీరు మీ కోసం ఒక కొత్త హృదయం, ఒక కొత్త మనస్సు నిర్మించుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చావాలి?
32
నశించేవాడి చావు కారణంగా నేను ఆనందించేవాణ్ణి కాదు.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. <<కాబట్టి మీరు మనస్సు మార్చుకుని బ్రతకండి.>>
19
ఇశ్రాయేలు నాయకుల గూర్చి ప్రలాప వాక్యం
1
<<కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.
2
నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది.
అది ఇతర కొదమసింహాల మధ్య తన పిల్లలను పెంచింది.
3
వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది.
అది మనుషులను మింగేసింది.
4
అప్పుడు ఇతర ప్రజలు అతని సంగతి విన్నారు. వాళ్ళ ఉచ్చులో అతడు చిక్కాడు.
వాళ్ళు అతనికి గాలాలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు.
5
దాని తల్లి దాని కోసం కనిపెట్టి, తన ఆశ భంగం అయిందని తెలుసుకుని, తన పిల్లల్లో ఇంకొకదాన్ని పెంచి, కొదమసింహంగా చేసింది.
6
ఇది కూడా కొదమ సింహమై, తక్కిన కొదమ సింహాలతో పాటు తిరిగి, చీల్చి చెండాడి వేటాడడం నేర్చుకుని, మనుషులును మింగేసింది.
7
తరువాత అతడు వాళ్ళ వితంతువులను మానభంగం చేసి వాళ్ళ పట్టణాలు పాడు చేశాడు.
అతని గర్జన శబ్దానికి ఆ దేశం, దానిలో ఉన్నదంతా ఖాళీ అయి పోయింది.
8
నాలుగు దిక్కుల దేశపు ప్రజలందరూ దాన్ని పట్టుకోడానికి పొంచి ఉండి, వల పన్నినప్పుడు, అది వాళ్ళ ఉచ్చులో చిక్కింది.
9
అప్పుడు వాళ్ళు దానికి గాలాలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు.
దాని గర్జన ఇశ్రాయేలు పర్వతాలమీద ఇక ఎన్నటికీ వినబడకుండా వాళ్ళు దాన్ని కొండ కోటలో ఉంచారు.
10
నీ తల్లి ఫలవంతమైన తీగెలతో నిండి, ఒక నీటి ప్రవాహపు కాలవ దగ్గర నాటిన ద్రాక్షావల్లిలా ఉండేది.
అక్కడ విస్తారమైన నీళ్ళు ఉండేవి గనుక అది ఎన్నో తీగలు కలిగి విరివిగా ద్రాక్షలు కాసేది.
11
రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి.
12
కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది.
తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి.
దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి.
13
కాబట్టి ఇప్పుడు అది కరువు, దాహం ఉన్న ప్రదేశంలో ఎడారిలో నాటి ఉంది.
దాని కొమ్మల్లోనుంచి అగ్ని బయలుదేరి,
14
దాని పండ్లు కాల్చేసింది. గట్టి కొమ్మ ఒక్కటి కూడా లేదు.
ఏలుబడి చేసేందుకు రాజదండం లేదు.>>
ఇది ఒక శోకం, ఒక శోక గీతంగా దీన్ని పాడతారు.
20
ఇశ్రాయేలు మత భ్రష్టత్వం
1
బబులోను చెరలో ఉన్న కాలంలో, ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమంది యెహోవాను యోచన అడగాలని ఆయన దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
2
అప్పుడు యెహోవా వాక్కు నాకు ఇలా వినిపించింది,
3
<<నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పెద్దలతో నువ్వు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నన్ను అడిగి తెలుసుకోడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నానుంచి ఏ ఆలోచనా మీకు దొరకదు.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
4
<<వాళ్లకు న్యాయం తీరుస్తావా? నరపుత్రుడా, వాళ్లకు న్యాయం తీరుస్తావా? వాళ్ళ పితరులు చేసిన అసహ్యమైన పనులు వాళ్ళకు తెలియజేయి.
5
వాళ్ళతో చెప్పు, ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకున్న రోజు, యాకోబు సంతానానికి ప్రమాణం చేసిన రోజు, ఐగుప్తుదేశంలో నన్ను వాళ్లకు ప్రత్యక్షం చేసుకుని ప్రమాణం చేసి, నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలంలో,
6
వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించి, వాళ్ళ కోసం నేను ఎంపిక చేసిన దేశం, పాలు తేనెలు ప్రవహించేది, అన్ని దేశాలకూ ఆభరణమైనది అయిన ఆ దేశంలోకి తీసుకు వెళ్తానని నేను ప్రమాణం చేశాను.
7
అప్పుడు నేను వాళ్ళతో, నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడూ అసహ్యమైన పనులు విడిచిపెట్టాలి, ఐగుప్తీయుల విగ్రహాలు విసిరేసి, వాటిని పూజించడం వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకుండా ఉండాలి, అన్నాను.
8
అయితే వాళ్ళు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసి, అసహ్యమైన పనులు చెయ్యడం మానలేదు. ఐగుప్తీయుల విగ్రహాలు పూజించడం మానలేదు గనుక వాళ్ళు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళ మీద నా కోపం తీర్చుకుంటానని అనుకున్నాను.
9
ఏ అన్యదేశాల ఎదుట నన్ను నేను ప్రత్యక్షం చేసుకున్నానో, ఏ అన్యప్రజల మధ్య వాళ్లున్నారో, ఆ అన్యప్రజల్లో, వాళ్ళున్న అన్యప్రజల ఎదుట వాళ్లకు నన్ను ప్రత్యక్షం చేసుకున్నాను. నా పేరుకు దూషణ కలగకుండా ఉండాలని ఆ విధంగా చెయ్యకుండా, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా ఘన నామం కోసం నేను వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించాను.
10
వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించి నిర్జన ప్రదేశంలోకి తీసుకొచ్చి,
11
వాళ్లకు నా కట్టడలు నియమించి, నా విధులు వాళ్లకు తెలియజేశాను. ఎవడైనా వాటిని అనుసరిస్తే, వాటిని బట్టి బ్రతుకుతాడు.
12
యెహోవానైన నేనే వాళ్ళను పవిత్రపరచే వాడినని వాళ్ళు తెలుసుకునేలా నాకూ, వాళ్ళకూ మధ్య నా విశ్రాంతి దినాలను నేను వాళ్లకు సూచనగా నియమించాను.
13
అయితే ఎడారిలో ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరించకుండా, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు, ఎడారిలో నా ఉగ్రత నేను వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళను నాశనం చేద్దామనుకున్నాను.
14
కాని నేను వాళ్ళను రప్పించినప్పుడు ఏ అన్యప్రజలు చూశారో, ఏ అన్యప్రజల్లోనుంచి నేను వాళ్ళను రప్పించానో, వాళ్ళ ఎదుట నా పేరుకు దూషణ కలగకుండా ఉండేలా నేను అనుకున్న ప్రకారం చెయ్యకుండా మానాను.
15
తమకిష్టమైన విగ్రహాలను అనుసరించాలని కోరి, వాళ్ళు నా విధులను తృణీకరించి, నా కట్టడలను అనుసరించకుండా నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు,
16
ఇస్తానని నేను చెప్పినదీ, పాలు తేనెలు ప్రవహించేదీ, అన్ని దేశాలకూ ఆభరణం అయిన ఆ దేశంలోకి వాళ్ళను తీసుకు రానని వాళ్ళు ఎడారిలో ఉండగానే నేను ప్రమాణం చేశాను.
17
అయినా వాళ్ళు నశించిపోకుండా ఉండాలని వాళ్ళ మీద కనికరం చూపించి, ఎడారిలో నేను వాళ్ళను నాశనం చెయ్యలేదు.
18
వాళ్ళు ఎడారిలో ఉండగానే వాళ్ళ పిల్లలతో నేను, మీరు మీ పితరులూ ఆచారాలు అనుసరించకుండా, వాళ్ళ పద్ధతుల ప్రకారం ప్రవర్తించకుండా, వాళ్ళు పెట్టుకున్న దేవుళ్ళను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకుండా ఉండండి.
19
మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను పాటించి, నేను నియమించిన విశ్రాంతి దినాలు ఆచరించండి.
20
నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా ఆ విశ్రాంతిదినాలు నాకూ, మీకూ మధ్య సూచనగా ఉంటాయి.
21
అయినా వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు కూడా నా మీద తిరగబడి, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన నా కట్టడలు అనుసరించకుండా, నా విధులను పాటించకుండా, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేశారు గనుక, వాళ్ళు ఎడారిలో ఉండగానే నేను నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళ మీద నా కోపం తీర్చుకోవాలని అనుకున్నాను.
22
కాని నేను ప్రత్యక్షమైన అన్యప్రజల మధ్య నా పేరుకు అవమానం కలగకుండా ఉండేలా, ఏ ప్రజల్లోనుంచి వాళ్ళను రప్పించానో, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా చెయ్యి వెనక్కు తీసి నా వాగ్దానం నెరవేర్చాను.
23
వాళ్ళు నా విధులు అనుసరించకుండా, నా కట్టడలు తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినాలను అపవిత్రం చేసి,
24
తమ పితరులు పెట్టుకున్న విగ్రహాలు పూజించాలని కోరుకున్నప్పుడు, అన్యప్రజల్లోకి వాళ్ళను చెదరగొట్టి, ప్రతి దేశంలోకీ వాళ్ళను వెళ్ళగొడతానని ప్రమాణం చేశాను.
25
తరువాత నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా, మంచివి కాని కట్టడలు, బ్రతకడానికి అనుకూలం కాని విధులు వాళ్ళకు ఇచ్చాను.
26
మొదట పుట్టిన పిల్లలను మంటల్లోనుంచి దాటించి బలి అర్పించడం ద్వారా తమ్మును తాము అపవిత్రం చేసుకోనిచ్చాను.>>
27
కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ఇలా ప్రకటించు. <<ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ పితరులు నా పట్ల అతిక్రమం చేసి, నన్ను దూషించి,
28
వాళ్లకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోకి నేను వాళ్ళను రప్పించిన తరువాత, ఒక ఎత్తయిన కొండను గాని, ఒక దట్టమైన చెట్టును గాని వాళ్ళు చూసినప్పుడెల్లా బలులు అర్పిస్తూ, అర్పణలు అర్పిస్తూ, అక్కడ పరిమళ ధూపం వేస్తూ, పానార్పణలు చేస్తూ, నాకు కోపం పుట్టించారు.>>
29
అప్పుడు నేను వాళ్ళతో <<మీరు బలులు తీసుకొస్తున్న ఈ ఉన్నత స్థలాలు ఏంటి?>> అని అడిగాను. కాబట్టి దానికి <<బామా>> అనే పేరు ఈ రోజు వరకూ వాడుకలో ఉంది.
తీర్పు, పునరుద్ధరణ
30
కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు. <<ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ పితరుల విధానంలోనే మీరూ అపవిత్రులు అయ్యారు. వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలను అనుసరిస్తూ మీరూ వ్యభిచారులయ్యారు.
31
ఈనాటి వరకూ మీరు అర్పణలు అర్పించి మీ కొడుకులను అగ్నిగుండా దాటించేటప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులయ్యారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నానుంచి మీకు ఏ ఆలోచనా దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
32
<అన్యప్రజలు, భూమి మీద ఇతర జాతులూ చేస్తున్నట్టు మేము కూడా కొయ్యకూ, రాళ్లకూ పూజిస్తాం> అని మీరు అనుకుంటున్నారు. మీ మనస్సులో ఏర్పడుతున్న ఈ ఆలోచన ఎన్నటికీ నెరవేరదు.
33
నా జీవం తోడు, నా బలమైన చేతితో, ఉగ్రతతో, ఎత్తిన చేతితో నీ మీద రాజ్యపాలన చేస్తాను.
34
నేను ఉగ్రత కుమ్మరిస్తూ, బలమైన చేతితోనూ, ఎత్తిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లోనుంచ, ప్రజల్లోనుంచి నేను మిమ్మల్ని సమకూర్చి
35
జనాలున్న ఎడారిలోకి మిమ్మల్ని రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీకు తీర్పు చెబుతాను. ఇదే యెహోవా వాక్కు.
36
ఐగుప్తీయుల దేశపు ఎడారిలో నేను మీ పితరులకు తీర్పు చెప్పినట్టు మీకూ తీర్పు చెబుతాను.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
37
<<నా చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధన ఒడంబడికలోకి మిమ్మల్ని తీసుకొస్తాను.
38
నా మీద తిరుగుబాటు చేసేవాళ్ళనూ, దోషం చేసేవాళ్ళనూ, మీలో ఉండకుండాా ప్రక్షాళన చేస్తాను. వారు కాపురమున్న దేశంలో నుంచి వాళ్ళను రప్పిస్తాను గాని, నేను యెహోవానని మీరు తెలుసుకునేలా, వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు.>>
39
ఇశ్రాయేలు ఇంటివారలారా, ప్రభువైన యెహోవా మీతో చెప్పేదేమంటే <<మీరు నామాట వినకపోతే, మీరు పెట్టుకున్న విగ్రహాలు మీ కిష్టమైనట్టుగా పూజించుకోండి, కాని మీ అర్పణల వల్ల, మీ విగ్రహాల వల్ల, నా పవిత్రమైన పేరును అపవిత్రం చెయ్యొద్దు.>>
40
ఇది ప్రభువైన యెహోవా వాక్కు. <<ఇశ్రాయేలీయుల ఎత్తయిన నా పవిత్ర పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల ఇంటి వాళ్ళందరూ నన్ను ఆరాధిస్తారు. అక్కడ నేను వాళ్ళ పట్ల సంతోషిస్తాను. అక్కడ మీ ప్రతిష్ఠిత అర్పణలు, మీ ప్రథమ ఫలదానాలూ, ప్రతిష్ఠిత కానుకలన్నీ నేను అంగీకరిస్తాను.
41
దేశాల్లో నుంచి నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు, మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లో నుంచి మిమ్మల్ని సమకూర్చేటప్పుడు, ఒక పరిమళ ధూపంగా మిమ్మల్ని అంగీకరిస్తాను. అన్యప్రజల ఎదుటా, మీ మధ్యలోనూ, నన్ను నేను పవిత్రం చేసుకుంటాను.
42
మీ పితరులకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశానికి, అంటే ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
43
అక్కడ చేరి, మీ ప్రవర్తనను, మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న మీ పనులన్నిటినీ గుర్తు చేసుకుని మీరు చేసిన చెడుపనులన్నిటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.
44
ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ చెడు చేష్టలను బట్టి కాక నా పేరును బట్టి మాత్రమే నేను మీ పట్ల ఈ విధంగా చేసినప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.>>
దక్షిణ దేశం పై ప్రవచనం
45
ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది.
46
<<నరపుత్రుడా, నీ ముఖం దక్షిణం వైపు తిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు, దక్షిణ దేశపు ఎడారి అరణ్యాన్ని గూర్చి ప్రవచించి ఇలా చెప్పు,
47
దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నీలో అగ్ని రగిలిస్తాను. అది నీలో ఉన్న పచ్చని పళ్ళ చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ కాల్చేస్తుంది. అది ఆరిపోదు. దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ భూతలమంతా ఆ భీకరమైన అగ్ని దహిస్తుంది.
48
అది ఆరిపోకుండా ఉండగా యెహోవానైన నేను దాన్ని రగిలించానని మనుషులందరూ చూస్తారు.>>
49
అప్పుడు నేను ఇలా అన్నాను<<అయ్యో ప్రభూ, యెహోవా, వాళ్ళు నా గురించి, <వీడు కేవలం ఉపమానాలు చెప్పేవాడేగదా?> అంటున్నారు.>>
21
యెహోవా ఖడ్గం
1
అప్పుడు నాకు యెహోవా వాక్కు వచ్చి ఇలా అన్నాడు,
2
<<నరపుత్రుడా, యెరూషలేము వైపు నీ ముఖం తిప్పుకుని, వాళ్ళ పవిత్రస్థలాలకూ, ఇశ్రాయేలీయుల దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించు.
3
యెహోవా చెప్పేదేమంటే, నేను నీకు విరోధిని. నీతిమంతుడుగాని, దుష్టుడుగాని నీలో ఎవరూ ఉండకుండాా అందరినీ నీనుంచి తెంచివేయడానికి నా కత్తి దూసి ఉన్నాను.
4
నీతిమంతుడుగాని, దుష్టుడుగాని ఎవరూ నీలో ఉండకుండాా దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ అందరినీ నేను తెంచివేయడానికి నా కత్తి శరీరులందరికీ విరోధంగా బయలుదేరింది.
5
యెహోవానైన నేను నా కత్తి మళ్ళీ ఒరలో పెట్టకుండా దాన్ని దూసి ఉన్నానని ప్రజలందరూ తెలుసుకుంటారు.
6
కాబట్టి నరపుత్రుడా, మూలుగు. వాళ్ళు చూస్తూ ఉండగా నీ నడుము విరిగేలా దుఃఖంతో మూలుగు.
7
అప్పుడు <నువ్వు ఎందుకు మూలుగుతున్నావు?> అని వారు అడుగుతారు. అప్పుడు నువ్వు వాళ్ళతో, <కష్టదినం వచ్చేస్తోందనే దుర్వార్త నాకు వినిపించింది. అందరి గుండెలూ కరిగిపోతాయి. అందరి చేతులూ బలహీనం అవుతాయి. అందరి మనస్సులూ సొమ్మసిల్లిపోతాయి, అందరి మోకాళ్లు నీరుగారిపోతాయి. ఇంతగా కీడు వస్తూ ఉంది. అది వచ్చేసింది> అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు.>>
8
యెహోవా నాకు ఈ సంగతి మళ్ళీ తెలియజేశాడు.
9
<<నరపుత్రుడా, ప్రవచించి ఇలా చెప్పు,
<ప్రభువు చెప్పేదేమంటే, ఒక కత్తి, ఒక కత్తి! అది పదునుపెట్టి ఉంది.
అది మెరుగుపెట్టి ఉంది.
10
అది భారీ ఎత్తున వధ చెయ్యడానికి పదును పెట్టి ఉంది!
తళతళలాడేలా అది మెరుగుపెట్టి ఉంది!
నా కుమారుడి రాజదండం విషయంలో మనం ఆనందించాలా?
రాబోతున్న రాబోయే కత్తి అలాంటి ప్రతి దండాన్నీ ద్వేషిస్తుంది!
11
కాబట్టి ఆ కత్తిని మెరుగు పెట్టడానికి అప్పగించడం జరుగుతుంది.
ఆ తరువాత అది చేతికి వస్తుంది.
ఆ కత్తి పదునుపెట్టి ఉంది! హతం చేసేవాడి చేతికి ఇవ్వడానికి ఆ కత్తి మెరుగు పెట్టి ఉంది.
12
నరపుత్రుడా, శోకించు, సాయం కోసం కేకలుపెట్టు!
ఆ కత్తి నా ప్రజల మీదకీ, ఇశ్రాయేలీయుల నాయకుల మీదకీ వచ్చింది.
కత్తి భయం నా ప్రజలకు కలిగింది గనుక శోకంతో నీ తొడ చరుచుకో!
13
పరీక్ష వచ్చింది. కాని రాజదండం నిలిచి ఉండకపోతే ఎలా?> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
14
నరపుత్రుడా, ప్రవచించి నీ రెండు చేతులు చరుచుకో.
కత్తి మూడోసారి కూడా దాడి చేస్తుంది!
అది భారీ ఎత్తున వధ కొరకైన కత్తి!
అది అనేకమందిని హతం చెయ్యడానికీ, వాళ్ళను అన్నిచోట్లా పొడవడానికీ సిద్ధంగా ఉంది!
15
వాళ్ళ గుండెలు కరిగిపోయేలా, అడ్డంకులు అధికం అయ్యేలా వాళ్ళ గుమ్మాలకు విరోధంగా నేను కత్తి దూసి భారీ ఎత్తున వధ సిద్ధం చేశాను!
బాధ! అది మెరుపులా ఉంది. వధ చెయ్యడానికి సిద్ధంగా ఉంది.
16
ఓ కత్తీ! కుడివైపు దెబ్బ కొట్టు! ఎడమవైపు దెబ్బ కొట్టు! నీ పదునైన అంచు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లనివ్వు.
17
నేను కూడా నా రెండు చేతులు చరుచుకుని, నా ఉగ్రత తీర్చుకుంటాను! యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను.>>
18
యెహోవా నాకీ విషయం మళ్ళీ చెప్పాడు,
19
<<నరపుత్రుడా, బబులోను రాజు కత్తి రావడానికి రెండు రహదారులు కేటాయించు. ఆ రెండూ, ఒకే దేశంలోనుంచి బయలుదేరుతాయి. ఆ రెండు రహదారుల్లో ఒకటి, ఒక పట్టణానికి వెళ్తుందన్న సూచన రాసి ఉంటుంది.
20
ఒక రహదారి, అమోనీయుల పట్టణమైన రబ్బాకు బబులోను సైన్యం వెళ్ళే మార్గంగా సూచన రాసి పెట్టు. ఇంకొక రహదారి యూదా దేశంలోని ప్రాకారాలుగల పట్టణమైన యెరూషలేముకు ఆ సైన్యాన్ని నడిపించేదిగా సూచన రాసి పెట్టు.
21
రహదారులు చీలే చోట రెండు దారులు చీలే కూడలిలో శకునం చూడడానికి బబులోను రాజు ఆగాడు. అతడు బాణాలు ఇటు అటు ఆడిస్తూ, విగ్రహాలను అడుగుతున్నాడు. అతడు కాలేయం శకునం పరీక్షించి చూస్తున్నాడు!
22
యెరూషలేము ఎదుట ద్వారాలను పడగొట్టే పరికరాలు సిద్ధం చెయ్యమనీ,
ఊచ కోత ఆరంభించమనీ, యుద్ధధ్వని చెయ్యమనీ, ముట్టడి దిబ్బలు కట్టమనీ అడుగుతున్నాడు.
యెరూషలేముగూర్చి తన కుడివైపు శకునం కనిపించింది!
23
బబులోనీయులతో ఒప్పందం చేసుకున్న వాళ్ల కళ్ళకు ఈ శకునం వ్యర్ధంగా కనిపిస్తుంది!
కాని ఆ రాజు వాళ్ళను పట్టుకోవడం కోసం, వాళ్ళు ఆ ఒప్పందం మీరారు అన్న నెపం వాళ్ళ మీద మోపుతాడు.>>
24
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే <<మీ దోషం మీరు నా జ్ఞాపకానికి తెచ్చిన కారణంగా మీ అతిక్రమం వెల్లడి ఔతుంది. మీ క్రియలన్నిట్లో మీ పాపం కనిపిస్తుంది. ఈ కారణంగా, మీ శత్రువు చేతికి మీరు దొరుకుతారని మీరు అందరికీ గుర్తు చేస్తారు!
25
అపవిత్రుడా నీ శిక్షా దినం దగ్గర పడింది. ఇశ్రాయేలీయుల పాలకుడా, అపవిత్రం చేసే కాలం ముగింపుకు వచ్చిన వాడా,
26
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నీ తలపాగా, నీ కిరీటం తీసివేయి. సంగతులు ఇదివరకులాగా ఇకపై ఉండవు. ఇక తక్కువ వాళ్ళను గొప్ప వాళ్ళనుగానూ, గొప్ప వాళ్ళను తక్కువ వాళ్ళనుగానూ చెయ్యి.
27
నేను అంతటినీ శిథిలం చేస్తాను! శిథిలం చేస్తాను! ఆ కిరీటం ఇంక ఉనికిలో ఉండదు. దానికి రాజుగా ఉండే అసలైన హక్కు ఉన్నవాడు వచ్చే వరకూ అది కనిపించదు. అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను.>>
28
నరపుత్రుడా నువ్వు ప్రవచించి ఇలా చెప్పు. <<అమ్మోనీయులను గూర్చీ, వాళ్ళ అపకీర్తిని గూర్చీ ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఒక కత్తి! ఒక కత్తి దూసి ఉంది! పదును పెట్టిన కత్తి భారీగా వధ చెయ్యడానికి దూసి ఉంది, అది ఒక మెరుపులా ఉంది!
29
శకునం చూసేవాళ్ళు నీ కోసం దొంగ దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు వ్యర్థమైన వాటిని నీకు చెప్తూ ఉన్నప్పుడు, ఈ కత్తి చావడానికి సిద్ధంగా ఉన్న ఆ దుష్టుల మెడల మీద ఉంటుంది. ఆ దుష్టుల శిక్షా దినం వచ్చింది. వాళ్ళు అతిక్రమం చేసే సమయం ముగిసింది.
30
మళ్ళీ కత్తి ఒరలో పెట్టు. నువ్వు సృష్టి అయిన స్థలంలోనే, నువ్వు పుట్టిన దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను!
31
నా కోపం నీ మీద కుమ్మరిస్తాను. నా ఉగ్రతాగ్నిని నీ మీద రాజేస్తాను. నాశనం చెయ్యడంలో ప్రవీణులైన క్రూరులకు నిన్ను అప్పగిస్తాను.
32
ఆ అగ్నికి నువ్వు ఇంధనం ఔతావు. దేశంలో నీ రక్తం కారుతుంది. నువ్వు ఎప్పటికీ జ్ఞాపకానికి రావు. యెహోవానైన నేనే ఇది ప్రకటించాను.>>
22
యెరూషలేము పాపాలు
1
యెహోవా వాక్కు నాకు వచ్చి నాతో ఇలా అన్నాడు,
2
<<నరపుత్రుడా, తీర్పు తీరుస్తావా? ఈ రక్తపు పట్టణానికి తీర్పు తీరుస్తావా? దాని అసహ్యమైన పనులన్నీ దానికి తెలియజెయ్యి.
3
నువ్వు ఇలా చెప్పాలి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇది దాని కాలం దగ్గర పడేలా, రక్తం ఒలికించే పట్టణం. ఇది తనను తాను అపవిత్రం చేసుకునేలా విగ్రహాలు పెట్టుకునే పట్టణం!
4
రక్తం కార్చిన కారణంగా నువ్వు నేరం చేశావు. నువ్వు చేసుకున్న విగ్రహాల మూలంగా నువ్వు అశుద్ధం అయ్యావు! నువ్వే నీ దినాలు ముగింపుకు తెచ్చుకున్నావు. నువ్వు నీ ఆఖరి సంవత్సరాల్లో ఉన్నావు. కాబట్టి అన్యప్రజల్లో ఒక నిందగానూ, అన్ని దేశాల దృష్టిలో ఒక ఎగతాళిగానూ నిన్ను చేస్తాను.
5
దగ్గర వాళ్ళూ, దూరం వాళ్ళు అందరూ నిన్ను వెక్కిరిస్తారు. ఓ అపవిత్ర పట్టణమా, నువ్వు గందరగోళంతో నిండిన దానివన్న కీర్తి అందరికీ పాకింది.
6
నీలోని ఇశ్రాయేలీయుల నాయకులందరూ తమ శక్తి కొలదీ రక్తం ఒలికించడానికి వచ్చారు.
7
నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు.
8
నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను నువ్వు అలక్ష్యం చేశావు. నా విశ్రాంతిదినాలను అపవిత్రం చేశావు.
9
దూషణ, నరహత్య చేసేవాళ్ళు నీలో ఉన్నారు. వాళ్ళు పర్వతాల మీద భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు నీ మధ్యలో దుష్టత్వం జరిగిస్తున్నారు.
10
తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునేవాళ్ళు నీలో ఉన్నారు. రుతుస్రావం వల్ల అశుద్ధంగా ఉన్న స్త్రీని చెరిచే వాళ్ళు నీలో కాపురం ఉన్నారు.
11
ఒకడు తన పొరుగువాడి భార్యతో పండుకుని అసహ్యమైన పనులు చేస్తున్నాడు. ఇంకొకడు సిగ్గు లేకుండా తన సొంత కోడలిని పాడు చేస్తున్నాడు. తమ సొంత తండ్రికే పుట్టిన అక్కచెల్లెళ్ళను చెరిచే వాళ్ళు నీలో ఉన్నారు.
12
వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
13
<<కాబట్టి చూడు, నువ్వు పొందిన అన్యాయపు లాభాన్ని నా చేత్తో దెబ్బ కొట్టాను. నువ్వు ఒలికించిన రక్తం నేను చూశాను.
14
నేను నీకు శిక్ష వేసినప్పుడు తట్టుకోడానికి చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉందా? యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను. దాన్ని నేను నెరవేరుస్తాను.
15
కాబట్టి అన్యప్రజల్లోకి నిన్ను చెదరగొడతాను. ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను. ఈ విధంగా నీ అపవిత్రతను ప్రక్షాళన చేస్తాను.
16
కాబట్టి నువ్వు అన్యదేశాల దృషిలో అశుద్ధం ఔతావు. అప్పుడు నేనే యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.>>
17
తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.
18
<<నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి పనికి రాని వాళ్ళలా ఉన్నారు. వాళ్ళందరూ కొలిమిలో మిగిలిపోయిన ఇత్తడి, తగరంలా, పనికి రాని ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్ళు నీ కొలిమిలో మిగిలి పోయిన పనికి రాని వెండిలా ఉన్నారు.>>
19
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే <<మీరందరూ పనికిరాని చెత్తలా ఉన్నారు గనుక, చూడండి, యెరూషలేము మధ్యకు మిమ్మల్ని పోగు చేస్తాను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసం, తగరం పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్టు,
20
నా కోపంతోనూ, ఉగ్రతతోనూ మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగిస్తాను.
21
మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదినప్పుడు కచ్చితంగా మీరు దానిలో కరిగిపోతారు.
22
కొలిమిలో వెండి కరిగినట్టు మీరు దానిలో కరిగిపోతారు, అప్పుడు యెహోవానైన నేను నా కోపం మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.>>
23
యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు,
24
<<నరపుత్రుడా, యెరూషలేముతో ఈ మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు!
25
అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు.
26
దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారు. నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను అపవిత్రం చేస్తారు. ప్రతిష్ఠితమైన దానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా ఎంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవడాన్ని ప్రజలకు నేర్పరు. వాళ్ళ మధ్య నేను దూషణ పొందేలా, నేను విధించిన విశ్రాంతి దినాలను వాళ్ళ దృష్టికి రానివ్వరు.
27
దానిలో రాజకుమారులు లాభం సంపాదించడానికి నరహత్య చెయ్యడంలో, మనుషులను నాశనం చెయ్యడంలో వేటను చీల్చే తోడేళ్లలా ఉన్నారు.
28
దాని ప్రవక్తలు దొంగ దర్శనాలు చూస్తూ, యెహోవా ఏమీ చెప్పనప్పటికీ, <ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు> అని చెప్తూ, అసత్య అంచనాలు ప్రకటిస్తూ, మట్టి గోడకు సున్నం వేసినట్టు తమ పనులు కప్పిపుచ్చుతూ ఉన్నారు.
29
దేశ ప్రజలు బలవంతంగా దండుకుంటూ, దోపిడీతో కొల్లగొడుతూ, పేదలను, అవసరతలో ఉన్న వాళ్ళను కష్టాలపాలు చేస్తూ, అన్యాయంగా పరదేశిని పీడించారు.
30
నేను దేశాన్ని పాడు చెయ్యకుండా ఉండేలా గోడలు కట్టి, బద్దలైన గోడ సందుల్లో నిలిచి ఉండడానికి తగిన వాడి కోసం నేను ఎంత చూసినా, ఒక్కడైనా నాకు కనిపించలేదు.
31
కాబట్టి నేను నా కోపం వాళ్ళ మీద కుమ్మరిస్తాను. వాళ్ళ ప్రవర్తన ఫలం వాళ్ళ మీదకి రప్పించి, నా కోపాగ్నితో వాళ్ళను కాల్చేస్తాను.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
23
వ్యభిచారిణులైన అక్క, చెల్లెలు
1
యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు,
2
<<నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.
3
వీళ్ళు ఐగుప్తు దేశంలో వేశ్యల్లా ప్రవర్తించారు. యవ్వనంలోనే వాళ్ళు వేశ్యల్లా ప్రవర్తించారు. అక్కడ వాళ్ళ రొమ్ములు వత్తడం, వాళ్ళ లేత చనుమొనలు నలపడం జరిగాయి.
4
వాళ్ళల్లో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె చెల్లి పేరు ఒహొలీబా. వీళ్ళను నేను పెళ్లి చేసుకున్నప్పుడు, నాకు కొడుకులనూ, కూతుళ్ళనూ కన్నారు. ఒహొలా అనే పేరుకు షోమ్రోను, ఒహొలీబా అనే పేరుకు యెరూషలేము అని అర్థం.
5
ఒహొలా నాది అయినప్పటికీ, వ్యభిచారం చేసి
6
తన విటుల మీద మొహం పెంచుకుంది. ఆమె అష్షూరుకు చెందిన ఊదారంగు వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది.
7
అష్షూరు వాళ్ళల్లో ముఖ్యులైన వాళ్ళందరి ఎదుట ఒక వేశ్యలా తిరుగుతూ, వాళ్ళందరితో వ్యభిచారం చేస్తూ, వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలన్నిటినీ ఆశించి తనను అపవిత్రం చేసుకుంది.
8
ఐగుప్తులో దాని యౌవ్వనంలోనే వాళ్ళు దాని చను మొనలు నలిపి, దానితో పండుకుని, వాళ్ళ కామం దాని మీద ఒలకబోసినప్పుడు అది నేర్చుకున్న వేశ్య ప్రవర్తన విడిచిపెట్టలేదు.
9
కాబట్టి దాని విటులకు నేను దాన్ని అప్పగించాను. అది మోహించిన అష్షూరు వాళ్లకు దాన్ని అప్పగించాను.
10
వాళ్ళు దాని వస్త్రాలు తీసేసి నగ్నంగా చేశారు. దాని కొడుకులను, కూతుళ్ళను పట్టుకుని, దాన్ని కత్తితో చంపారు. ఆ విధంగా ఆమె ఇతర స్త్రీలకు అవమానంగా అయ్యింది. కాబట్టి ఇతర స్త్రీలు దాని మీద వాళ్ళ తీర్పు చెప్పారు.
11
దాని చెల్లెలైన ఒహొలీబా దాన్ని చూసి, కామంలో దాన్ని మించిపోయి, అక్క చేసిన వ్యభిచారం కంటే ఇంకా అధికంగా పోకిరీతనం జరిగించింది.
12
అష్షూరు వాళ్ళల్లో ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది.
13
అది తనను అశుద్ధం చేసుకుందని నేను గమనించాను. ఇద్దరు అక్కాచెల్లెళ్ళూ ఆ విధంగానే చేశారు.
14
అప్పుడు అది తన వ్యభిచార క్రియలు ఇంకా అధికం చేసింది. ఎర్రని రంగుతో గోడ మీద చెక్కిన కల్దీయ పురుషుల ఆకారాలు చూసింది.
15
మొలలకు నడికట్లు, తలల మీద విచిత్రమైన తలపాగాలు పెట్టుకుని, తమ జన్మదేశమైన బబులోను రథాలపై కూర్చున్న అధిపతుల స్వరూపాలు చూసి మోహించింది.
16
అది వాళ్ళను చూసిన వెంటనే మోహించి, కల్దీయ దేశానికి వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి వాళ్ళను పిలిపించుకుంది.
17
బబులోనువాళ్ళు పడుపు కోసం కోరి వచ్చి వ్యభిచారంతో దాన్ని అపవిత్రం చేశారు. వాళ్ళ చేత అది అపవిత్రం అయిన తరువాత, దాని మనస్సు వాళ్ళ మీద నుంచి తిరిగి పోయింది.
18
ఈ విధంగా అది వ్యభిచారం అధికంగా చేసి,
తన నగ్నత బహిర్గతం చేసి,
దాన్ని పోగొట్టుకుంది గనుక తన అక్క విషయంలో నా మనస్సు తిరిగి పోయినట్టు దాని విషయంలో కూడా నా మనస్సు తిరిగిపోయింది.
19
తన యవ్వనంలో ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారం మనస్సుకు తెచ్చుకుని,
ఆ తరువాత అది ఇంకా ఎన్నో వ్యభిచార క్రియలు జరిగించింది.
20
గాడిద పురుషాంగం వంటి, గుర్రాల అంగాల వంటి అంగాలు కలిగిన తన విటులను మోహించింది.
21
యవ్వనంలో నువ్వు ఐగుప్తీయుల చేత నీ లేత చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని,
అప్పటి సిగ్గుమాలిన ప్రవర్తన మళ్ళీ జరిగించింది.
22
కాబట్టి ఒహొలీబా, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,
నీ మనస్సుకు దూరమైన నీ విటులను రేపి, నాలుగు వైపుల నుంచి వాళ్ళను నీ మీదకి రప్పిస్తాను.
23
గుర్రాలు స్వారీ చేసే బబులోను వాళ్ళను, కల్దీయులను,
అధిపతులను, ప్రధానాధికారులనందరిని, అష్షూరీయులను,
అందంగా ఉండే శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను, అందరినీ నీ మీదకి నేను రప్పిస్తున్నాను.
24
ఆయుధాలు పట్టుకుని, బళ్ళు కట్టిన రథాలతో, పెద్ద సైన్యంతో వాళ్ళు నీ మీదకి వచ్చి,
పెద్ద డాళ్ళు, చిన్న డాళ్ళు పట్టుకుని, ఇనుప టోపీలు పెట్టుకుని వాళ్ళు నీ మీదకి వచ్చి,
నిన్ను ముట్టడిస్తారు. వాళ్ళు తమ చేతలతో నిన్ను శిక్షించేలా నేను వాళ్లకు అవకాశం ఇస్తాను.
25
ఉగ్రతతో వాళ్ళు నిన్ను శిక్షించేలా నా కోపం నీకు చూపిస్తాను.
వాళ్ళు నీ ముక్కూ, చెవులూ కోస్తారు.
నీలో మిగిలిన వాళ్ళు కత్తివాత పడి చస్తారు.
నీ సంతానం అగ్నికి ఆహుతి అయ్యేలా, నీ కొడుకులనూ, నీ కూతుళ్ళనూ వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు.
26
నీ బట్టలు లాగేసి, నీ ఆభరణాలన్నీ తీసేస్తారు.
27
ఐగుప్తు దేశంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన, నీ వ్యభిచార క్రియలు నీనుంచి తొలగిస్తాను.
నువ్వు ఇంక నీ కళ్ళెత్తి ఐగుప్తు వైపు ఆశగా చూడవు. దాని గురించి ఇంక ఆలోచించవు.
28
ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, చూడు! నువ్వు ద్వేషించిన వాళ్ళకూ, నీ మనస్సు దూరమైన వాళ్ళకూ నిన్ను అప్పగిస్తున్నాను.
29
ద్వేషంతో వాళ్ళు నిన్ను బాధిస్తారు. నీ కష్టార్జితమంతా చెరబట్టి నిన్ను వస్త్రహీనంగా, నగ్నంగా విడిచిపెడతారు. అప్పుడు వ్యభిచారం వల్ల నీకు కలిగిన అవమానం వెల్లడి ఔతుంది. నీ వేశ్యక్రియలు, నీ దుష్ప్రవర్తన వెల్లడి ఔతుంది.
30
నువ్వు అన్యప్రజలతో చేసిన వ్యభిచారం కారణంగా, నువ్వు వాళ్ళ విగ్రహాలు పూజించి అపవిత్రం అయిన కారణంగా నీకు ఇవి జరుగుతాయి. నీ అక్క ప్రవర్తించినట్టు నువ్వు కూడా ప్రవర్తించావు గనుక ఆమె తగిన శిక్షాపాత్ర నీ చేతికిస్తాను.
31
ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే నీ అక్క తాగిన, లోతైన వెడల్పైన పాత్రలోనిది నీవు కూడా తాగాలి.
32
ఆ గిన్నె చాలా పెద్దది, చాలా లోతైనది, గనుక నువ్వు ఒక ఎగతాళిగానూ, పరిహాసంగానూ ఔతావు.
33
ఇది నీ అక్క షోమ్రోను గిన్నె! ఇది భయంతోనూ, వినాశనంతోనూ నిండినది. నువ్వు ఇది తాగి కైపెక్కి దుఃఖంతో నిండి ఉంటావు.
34
అడుగు వరకూ దాని తాగి, ఆ గిన్నె చెక్కలు చేసి, వాటితో నీ స్తనాలు పెరికేసుకుంటావు. ఇది నేనే ప్రకటించాను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
35
ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నువ్వు నన్ను మరిచిపోయి నన్ను వెనక్కి తోసేశావు గనుక నీ సిగ్గుమాలిన ప్రవర్తనకూ, నీ వ్యభిచార క్రియలకూ రావలసిన శిక్ష నువ్వు భరిస్తావు.>>
36
యెహోవా నాతో ఇలా అన్నాడు. <<నరపుత్రుడా, ఒహొలాకునూ, ఒహొలీబాకునూ నువ్వు తీర్పు తీరుస్తావా? అలా ఐతే వాళ్ళ అసహ్యమైన పనులు వాళ్లకు తెలియజేయి.
37
వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది. వాళ్ళు విగ్రహాలతో వ్యభిచారం చేశారు. నాకు కన్న కొడుకులను వాళ్ళ విగ్రహాలు మింగేలా వాటికి దహన బలి అర్పించారు.
38
ఇంకా వాళ్ళు ఇలాగే నా పట్ల జరిగిస్తున్నారు. ఇంతే కాక, వాళ్ళు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేసిన రోజే, నేను నియమించిన విశ్రాంతి దినాలను కూడా అపవిత్రం చేశారు.
39
తాము పెట్టుకున్న విగ్రహాల పేరట తమ పిల్లలను చంపిన రోజే, వాళ్ళు నా పవిత్ర ప్రాంగణంలోకి వచ్చి దాన్ని అపవిత్రం చేసి, నా మందిరంలోనే వాళ్ళు ఈ విధంగా చేశారు.
40
దూరంగా ఉన్నవాళ్ళను పిలిపించుకోడానికి వాళ్ళు వర్తమానికులను పంపారు. వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ కోసం నువ్వు స్నానం చేసి, కళ్ళకు రంగు వేసుకుని, నగలు ధరించి,
41
ఒక అందమైన మంచం మీద కూర్చుని, ఒక బల్ల సిద్ధం చేసి, దాని మీద నా పరిమళ ధూపద్రవ్యం, నా నూనె పెట్టావు.
42
అప్పుడు అక్కడ ఆమెతో నిర్లక్ష్యంగా ఉన్న ఒక గుంపు సందడి వినిపించింది. ఆ గుంపులో చేరిన తాగుబోతులు ఎడారి మార్గం నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఈ వేశ్యల చేతులకు కడియాలు తొడిగి, వాళ్ళ తలలకు పూదండలు చుట్టారు.
43
వ్యభిచారం చెయ్యడం వల్ల బలహీనురాలైన దానితో నేను ఇలా అన్నాను, <ఇప్పుడు వాళ్ళు దానితో, అది వాళ్ళతో వ్యభిచారం చేస్తారు.>
44
వేశ్యతో చేసినట్టు వాళ్ళు దానితో చేశారు. అలాగే వాళ్ళు వేశ్యలైన ఒహొలాతోనూ, ఒహొలీబాతోనూ చేశారు.
45
కాని, నీతిగల పురుషులు వ్యభిచారిణులకూ, రక్తపాతం జరిగించిన వారికీ రావలసిన శిక్షను విధిస్తారు. ఎందుకంటే, వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది.>>
46
కాబట్టి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వాళ్ళ మీదకి నేను సైన్యాన్ని రప్పిస్తాను. భయభీతులుగా చెయ్యడానికీ, కొల్లగొట్టుకుపోడానికీ వాళ్ళను శత్రువులకు అప్పగిస్తాను.
47
ఆ సైనికులు రాళ్లు రువ్వి వాళ్ళను చంపుతారు. కత్తితో హతం చేస్తారు. వాళ్ళ కొడుకులనూ, కూతుళ్ళనూ చంపుతారు. వాళ్ళ ఇళ్ళను అగ్నితో కాల్చేస్తారు.
48
స్త్రీలందరూ మీ వేశ్యాప్రవర్తన ప్రకారం చెయ్యకూడదనే సంగతి నేర్చుకునేలా మీ సిగ్గుమాలిన ప్రవర్తనను దేశంలో ఉండకుండాా తొలగిస్తాను.
49
నేనే యెహోవానని మీరు తెలుసుకునేలా మీ సిగ్గుమాలిన ప్రవర్తనకు శిక్ష వస్తుంది. విగ్రహాలను పూజించిన పాపం మీరు భరిస్తారు.
24
వంట కుండ ఉపమానం
1
బబులోను చెరలో ఉన్న కాలంలో, తొమ్మిదో సంవత్సరం, పదో నెల, పదో రోజు యెహోవా వాక్కు నాకు మళ్ళీ ప్రత్యక్షమై ఇలా అన్నాడు,
2
<<నరపుత్రుడా, ఈ రోజు పేరు రాసి ఉంచుకో. కచ్చితంగా ఈ రోజే బబులోను రాజు యెరూషలేమును ముట్టడి వేశాడు.
3
తిరుగుబాటుచేసే ఈ ప్రజలకు ఉపమాన రీతిగా ఒక సామెత చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వంట కుండ తెచ్చి అందులో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టు.
4
తొడ, జబ్బ మొదలైన మంచి ముక్కలన్నీ అందులో వేసి, మంచి ఎముకలు ఏరి దాన్ని నింపు.
5
మందలో శ్రేష్ఠమైన వాటిని తీసికో. దానిలో ఉన్న ఎముకలు ఉడికేలా ఎక్కువ కట్టెలు పోగు చెయ్యి, దాన్ని బాగా పొంగించు. ఎముకలు ఉడికేలా పొంగించు.
6
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, రక్త నగరానికి బాధ. మడ్డి గల ఆ కుండకు బాధ తప్పదు. దానిలోనుంచి ఆ మడ్డి పోదు. దానికోసం చీటీలు వెయ్యకుండా వండిన దాన్ని ముక్క వెంట ముక్క దానిలోనుంచి తీసుకో.
7
దాని రక్తం దాని మధ్యనే ఉంది. అది దాన్ని నున్నటి బండ మీద ఉంచింది. మట్టితో దాన్ని కప్పేందుకు వీలుగా ఆ రక్తాన్ని నేల మీద కుమ్మరించ లేదు.
8
కాబట్టి దాని విషయం కోపాగ్ని రేకెత్తించి ప్రతీకారం తీర్చుకోవాలని, అది చిందించిన రక్తం మట్టితో కప్పకుండా దాన్ని ఆ నున్నటి బండ మీద నేను ఉండనిచ్చాను.>>
9
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే<<ఆ నెత్తురు నగరానికి బాధ. నేను కూడా మరి ఎక్కువ కట్టెలు పేర్చబోతున్నాను.
10
కట్టెలు ఎక్కువ చెయ్యి! అగ్ని రాజెయ్యి! మాంసాన్ని బాగా ఉడకబెట్టు. మాంసం బాగా ఉడికించి మసాలా కలిపి పులుసు పెట్టు! ఎముకలు బాగా మగ్గనివ్వు!
11
తరువాత ఖాళీ గిన్నె పొయ్యి మీద పెట్టు. అప్పుడు దానికున్న అశుద్ధం, మడ్డీ కరిగిపోతాయి. అది వేడై ఆ కంచును కాల్చే వరకూ ఆ గిన్నె పొయ్యి మీదే ఉంచు.
12
అలసట పుట్టే వరకూ ఇంతగా శ్రమించినా, అగ్నిలో కాల్చినా, దానిలో నుంచి ఆ తుప్పు పోలేదు.
13
నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.
14
యెహోవానైన నేను ప్రకటించాను. అది జరుగుతుంది. నేనే దాన్ని నెరవేరుస్తాను. నేను వెనుకాడను, కనికరించను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలనుబట్టి నీకు శిక్ష ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు.>>
యెహెజ్కేలు భార్య మరణం
15
యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు,
16
<<నరపుత్రుడా, చూడు! నీ కళ్ళకు ఇష్టమైన దాన్ని నీ నుంచి ఒక్క తెగులు మూలంగా తీసేస్తాను. నువ్వు సంతాప పడవద్దు. కన్నీరు కార్చ వద్దు.
17
నువ్వు మౌనంగా మూలగాలి. చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు చెయ్యొద్దు. తలపాగా కట్టుకుని చెప్పులు వేసుకో. నీ గడ్డం దాచుకోవద్దు, భార్యను కోల్పోయిన పురుషుని ఆహారం తినొద్దు.>>
18
ఉదయం ప్రజలకు నేను ప్రకటించాను. సాయంత్రం నా భార్య చనిపోగా నాకు ఆజ్ఞాపించినట్టు మరుసటి ఉదయాన నేను చేశాను.
19
ప్రజలు నన్ను <<నువ్వు చేస్తున్నవాటి అర్థం మాకు చెప్పవా?>> అని అడిగారు.
20
కాబట్టి నేను వాళ్ళతో <<యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
21
ఇశ్రాయేలీయులకు నువ్వు ఈ విధంగా చెప్పు, చూడు! ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ బలంలో మీకున్న అతిశయం, మీ నేత్రాశలు, మీ మనస్సులో మీకున్న వాంఛలు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నాయి! కాబట్టి, మీరు వెనుక విడిచిన మీ కొడుకులూ, కూతుళ్ళూ కత్తిచేత కూలిపోతారు.
22
అప్పుడు నేను చేసినట్టే మీరూ చేస్తారు. మీ గడ్డాలు కప్పుకోరు. సంతాపంలో ఉన్న పురుషుల ఆహారం తినరు!
23
మీ తలపాగాలు మీ తలలపై ఉంటాయి. మీ చెప్పులు మీ కాళ్ళకు ఉంటాయి. మీరు సంతాపపడరు, కన్నీరు కార్చరు. ఒకడినొకరు చూసి మూలుగుతూ, మీరు చేసిన దోషాల కారణంగా క్షీణించిపోతారు.
24
కాబట్టి, యెహెజ్కేలు మీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిన ప్రకారం మీరూ చేస్తారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.>>
25
<<కాని, నరపుత్రుడా, వాళ్ళ ఆనందాన్నీ, వాళ్ళ అతిశయాన్నీ, వాళ్ళ కళ్ళకు ఇష్టమైనదాన్నీ, వాళ్ళ కొడుకులనూ, వాళ్ళ కూతుళ్ళనూ నేను బలవంతంగా పట్టుకున్న రోజు నీకు సమాచారం తెలియజేయడానికి, తప్పించుకుని వచ్చిన వాడొకడు నీదగ్గరికి వస్తాడు.
26
ఆ రోజున నువ్వింక మౌనంగా ఉండకుండాా, తప్పించుకుని వచ్చిన వాడితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు,
27
నేను యెహోవానై ఉన్నానని వాళ్ళు తెలుసుకునేలా నువ్వు వాళ్లకు సూచనగా ఉంటావు.>>
25
అమ్మోనీయుల గూర్చి ప్రవచనం
1
యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు,
2
<<నరపుత్రుడా, అమ్మోనీయుల వైపు ముఖం తిప్పి వాళ్ళను గూర్చి వాళ్లకు విరుద్ధంగా ప్రవచించు.
3
అమ్మోనీయులతో ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా పవిత్రస్థలం అపవిత్రం అయినప్పుడు, ఇశ్రాయేలు దేశం నిర్జన ప్రదేశం అయినప్పుడు, యూదా ఇంటివాళ్ళు బందీలుగా వెళ్ళిపోయినప్పుడు మీరు <ఆహాహా> అన్నారు.
4
కాబట్టి చూడండి! నేను మిమ్మల్ని తూర్పున ఉండే మనుషులకు ఆస్తిగా అప్పగిస్తాను. వాళ్ళు తమ డేరాలను మీ దేశంలో వేసి, మీ మధ్య కాపురం ఉంటారు. వాళ్ళు మీ పంటలు తింటారు, మీ పాలు తాగుతారు.
5
నేను రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా చేస్తాను, అమ్మోనీయుల దేశాన్ని గొర్రెల దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
6
ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయుల బాధ చూసి మీరు చప్పట్లు కొట్టి, కాళ్లతో కదం తొక్కి, మీ మనస్సులోని తిరస్కారమంతటితో ఆనందించారు గనుక నేను యెహోవానని మీరు తెలుసుకునేలా,
7
నేను మీకు విరోధిగా ఉండి, మిమ్మల్ని దేశాలకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. అన్యప్రజల్లో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాను. దేశంలో మిమ్మల్ని నాశనం చేస్తాను. అప్పుడు మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు.
మోయాబీయులు గూర్చి ప్రవచనం
8
ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, చూడు! ఇతర దేశాలకూ, యూదా వాళ్ళకూ తేడా ఏంటి, అని మోయాబీయులు, శేయీరు పట్టణం వాళ్ళు అంటారు గనుక,
9
తూర్పున ఉన్నవాళ్ళను రప్పించి, దేశానికి శోభగా ఉన్న పొలిమేర పట్టాణాలైన బెత్యేషీమోతు, బయల్మెయోను, కిర్యతాయిము, మోయాబీయుల సరిహద్దులుగా ఉన్న పట్టాణాలన్నిటినీ, అమ్మోనీయులనందరినీ వాళ్లకు ఆస్తిగా అప్పగిస్తాను.
10
దేశాల్లో అమ్మోనీయులు ఇక జ్ఞాపకానికి రారు.
11
నేను యెహోవానని మోయాబీయులు తెలుసుకునేలా నేను ఈ విధంగా వాళ్లకు శిక్ష వేస్తాను.>>
12
ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు. <<ఎదోమీయులు యూదావాళ్ళ మీద పగ తీర్చుకున్నారు, అలా చేసి వాళ్ళు తప్పు చేశారు.>> ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,
13
<<ఎదోము మీద నా చెయ్యి చాపి, ప్రతి మనిషినీ, ప్రతి పశువునూ దానిలో ఉండకుండాా సమూల నాశనం చేస్తాను. తేమాను పట్టణం మొదలుకుని దాన్ని పాడుచేస్తాను. దదాను వరకూ ప్రజలంతా కత్తివాత కూలుతారు.
14
నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటాను. ఎదోమీయుల విషయంలో నా కోపాన్ని బట్టి నా రౌద్రాన్ని బట్టి, ఇశ్రాయేలీయులు నా ఆలోచన నెరవేరుస్తారు! ఎదోమీయులు నా ప్రతీకారం చవి చూస్తారు.>> ఇదే యెహోవా వాక్కు.
ఫిలిష్తీయులు గూర్చి ప్రవచనం
15
ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు. <<ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద పగ తీర్చుకుని, ఏహ్య భావంతో, పాత కక్షలతో యూదాను నాశనం చేశారు.>>
16
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే <<చూడు! ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి, కెరేతీయులను తెంచేస్తాను. సముద్ర తీరంలో నివాసం ఉన్న మిగిలిన వాళ్ళను నాశనం చేస్తాను.
17
ఆగ్రహంతో వాళ్ళను శిక్షించి, వాళ్ళ మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. నేను నా పగ తీర్చుకున్నప్పుడు, నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.>>
26
తూరూ గూర్చి ప్రవచనం
1
బబులోను చెరలో ఉన్న కాలంలో, పదకొండో సంవత్సరం నెలలో మొదటి రోజు యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
2
<<నరపుత్రుడా, తూరు యెరూషలేము గురించి <ఆహా> అంటూ <ప్రజల ప్రాకారాలు పడిపోయాయి, ఆమె నావైపు తిరిగింది. ఆమె పాడైపోయినందువలన మేము వర్దిల్లుతాం> అని చెప్పాడు.>>
3
కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే <<తూరూ, నేను నీకు విరోధిని. సముద్రం దాని అలలను పైకి తెచ్చే విధంగా నేను అనేక ప్రజలను నీ మీదికి రప్పిస్తాను.
4
వారు వచ్చి తూరు ప్రాకారాలను కూల్చి దాని కోటలను పడగొడతారు. నేను దాని శిథిలాలను తుడిచివేస్తాను. వట్టి బండ మాత్రమే మిగులుతుంది.
5
ఆమె సముద్రం ఒడ్డున వలలు ఆరబెట్టుకునే చోటవుతుంది. ఈ విషయం చెప్పింది నేనే.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం. <<ఆమె ఇతర రాజ్యాలకు దోపిడీ అవుతుంది.
6
బయటి పొలాల్లో ఉన్న దాని కూతుళ్ళు కత్తి పాలవుతారు. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.>>
7
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే <<అత్యంత శక్తివంతుడైన బబులోనురాజు నెబుకద్నెజరును నేను తూరు పట్టణం మీదికి రప్పిస్తున్నాను. అతడు గుర్రాలతో రథాలతో రౌతులతో మహా సైన్యంతో వస్తున్నాడు.
8
అతడు బయటి పొలాల్లోని నీ కూతుళ్ళను కత్తి పాలు చేస్తాడు. నీ కెదురుగా బురుజులు కట్టించి మట్టి దిబ్బలు వేయించి నీ కెదురుగా డాళ్ళను ఎత్తుతాడు.
9
అతడు నీ ప్రాకారాలను పడగొట్టడానికి యంత్రాలు వాడతాడు. అతని ఆయుధాలు నీ కోటలను కూలుస్తాయి.
10
అతనికి ఉన్న అనేక గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కప్పేస్తుంది! కూలిపోయిన పట్టణ గోడల గుండా ద్వారాల గుండా అతడు వచ్చినప్పుడు గుర్రాలు, రథ చక్రాల శబ్దాలకు నీ ప్రాకారాలు కంపిస్తాయి.
11
అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నీ అణగదొక్కేస్తాడు. నీ ప్రజలను కత్తితో నరికేస్తాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలుతాయి.
12
ఈ విధంగా వాళ్ళు నీ ఐశ్వర్యాన్ని దోచుకుంటారు. నీ వ్యాపార సరుకులను కొల్లగొట్టుకుపోతారు. నీ గోడలు కూలుస్తారు. నీ విలాస భవనాలను పాడు చేస్తారు. నీ రాళ్లనూ నీ కలపనూ మట్టినీ నీళ్లలో ముంచివేస్తారు.
13
నేను నీ సంగీతాలను మాన్పిస్తాను. నీ సితారా నాదం ఇక వినబడదు.
14
నిన్ను వట్టి బండగా చేస్తాను. నీవు వలలు ఆరబెట్టే చోటు అవుతావు. నిన్ను మళ్ళీ కట్టడం ఎన్నటికీ జరగదు. ఈ విషయం చెప్పింది నేనే.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం!
15
తూరు గురించి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే <<నువ్వు పతనమయ్యేటప్పుడు, నీ మధ్య జరిగే భయంకరమైన హత్యల్లో గాయపడ్డ వాళ్ళ కేకల శబ్దానికి ద్వీపాలు వణికిపోవా?
16
సముద్రపు అధిపతులంతా తమ సింహాసనాల మీద నుంచి దిగి, తమ రాజ వస్త్రాలనూ రంగురంగుల బట్టలనూ తీసి వేస్తారు. వాళ్ళు భయాన్ని కప్పుకుంటారు. వాళ్ళు నేల మీద కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి భయాందోళన చెందుతారు.
17
వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు.
నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు!
పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం - ఇప్పుడు సముద్రం పాలయింది.
నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు.
నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం.
18
ఇప్పుడు నువ్వు కూలిన ఈ దినాన తీరప్రాంతాలు వణుకుతున్నాయి.
నువ్వు మునిగిపోవడం బట్టి తీర ప్రాంతాలు భయంతో కంపించిపోయాయి.
19
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నేను నిన్ను పాడుచేసి నిర్జనమైన పట్టణంగా చేసేటప్పుడు మహా సముద్రం నిన్ను ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాన్ని రప్పిస్తాను.
20
పురాతన దినాల్లో మృత్యులోకంలోకి దిగిపోయినవారి దగ్గర నువ్వుండేలా చేస్తాను. పూర్వకాలంలో పాడైన స్థలాల్లో భూమి కిందున్న భాగాల్లో, అగాధంలోకి దిగిపోయిన వారితో పాటు నువ్వుండేలా చేస్తాను. దీనంతటి బట్టి సజీవులు నివసించే చోటికి నువ్వు తిరిగి రావు.
21
నీ మీదికి విపత్తు తెస్తాను. నువ్వు లేకుండా పోతావు. ఎంత వెతికినా నీవెన్నటికీ కనిపించవు.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
27
తూరూ గూరించి విలాపం
1
యెహోవా నాకు ఈ విషయం మళ్ళీ తెలియజేశాడు.
2
నరపుత్రుడా, తూరు పట్టణం గురించి శోకగీతం మొదలు పెట్టి దానికిలా చెప్పు.
3
సముద్రపు రేవుల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అనేక తీరప్రాంతాల ప్రజలతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే,
తూరూ <<నేను అతిలోక సుందరిని>> అని నువ్వనుకుంటున్నావు.
4
నీ సరిహద్దులు సముద్రంలో ఉన్నాయి. నీ భవన నిర్మాతలు నీ అందాన్ని లోపరహితంగా చేశారు.
5
నీ ఓడలను హెర్మోను పర్వత సరళ వృక్షం కలపతో కట్టారు.
లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ దూలం చేశారు.
6
బాషాను సింధూర చెక్కతో నీ తెడ్లు చేశారు.
కుప్ర ద్వీపం నుంచి వచ్చిన కలపతో దంతపు పని పొదిగిన నీ ఓడ పైభాగం చేశారు.
7
నీకు జెండాలుగా ఉండడానికి నీ తెరచాపలు ఐగుప్తులో తయారై బుట్టా వేసిన శ్రేష్ఠమైన నారతో చేశారు!
8
సీదోను నివాసులు, అర్వదు నివాసులు నీ తెడ్లు వేసేవాళ్ళు.
నీ పౌరుల్లో ఆరితేరినవాళ్ళు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.
9
బిబ్లోసుకు చెందిన నిపుణులు నీ ఓడలను బాగుచేసేవాళ్ళు.
సముద్రంలో నీ సరకులు కొనడానికి సముద్ర ప్రయాణం చేసే నావికుల ఓడలన్నీ నీ రేవుల్లో ఉన్నాయి.
10
పారసీక దేశస్థులు, లూదు వాళ్ళు, పూతు వాళ్ళు నీ సైన్యంలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు.
వాళ్ళు నీ డాళ్లనూ శిరస్త్రాణాలనూ నీలో వేలాడదీశారు. వాళ్ళు నీకు శోభ తెచ్చారు.
11
అర్వదు వాళ్ళు, హెలెక్ వాళ్ళు, నీ సైన్యంలో చేరి అన్ని వైపులా నీ గోడల మీద ఉన్నారు. గమ్మాదు వాళ్ళు నీ ప్రాకారాల్లో ఉన్నారు. వీరంతా తమ డాళ్లు నీ గోడల మీద, చుట్టూ తగిలించారు. నీ సౌందర్యాన్ని లోపం లేనిదిగా చేశారు.
12
రకరకాల సరకులు నీ దగ్గర చాలా ఎక్కువగా ఉండడం వలన తర్షీషు వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ సరకులు కొన్నారు.
13
యావాను, తుబాలు, మెషెకు ప్రాంతాలవాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ ఇత్తడి వస్తువులనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
14
బేత్ తోగర్మా వాళ్ళు గుర్రాలను యుద్ధాశ్వాలనూ కంచరగాడిదలనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
15
దదాను వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. అనేక సముద్ర తీరాల ప్రజలు నీ సరుకులు కొన్నారు. వాళ్ళు దంతం, నల్లచేవ మాను తెచ్చి ఇచ్చారు.
16
నువ్వు చేసిన వివిధ వస్తువులను కొనుక్కోడానికి సిరియనులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు పచ్చలు, ఊదా రంగు, అద్దకం వేసిన బట్ట, నునుపైన బట్ట, ముత్యాలు, రత్నాలు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
17
యూదావారూ ఇశ్రాయేలు వారూ నీతో వ్యాపారం చేశారు. మిన్నీతు నుంచి గోదుమలు, చిరు ధాన్యాలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి నీ సరుకులు కొన్నారు.
18
దమస్కు వాళ్ళు హెల్బోను ద్రాక్షారసం, జహారు ప్రాంతం ఉన్ని తెచ్చి నీతో వ్యాపారం చేశారు.
19
ఉజ్జాలు నుంచి దాను, యావాను వాళ్ళు ఇనప పనిముట్లు, దాల్చిన చెక్క, వాము తెచ్చి నీ సరుకులు కొన్నారు.
20
దెదాను వాళ్ళు గుర్రపు జీనుల కోసం వాడే బట్టలు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
21
అరేబియా వాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను తెచ్చి నీ సరుకులు కొన్నారు.
22
షేబ వ్యాపారులు రమా వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు అతి ప్రశస్తమైన గంధవర్గాలనూ విలువగల నానా విధమైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు.
23
హారాను వాళ్ళు, కన్నే వాళ్ళు, ఏదెను వాళ్ళు, షేబ వ్యాపారులు, అష్షూరు వ్యాపారులు, కిల్మదు వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు.
24
వీళ్ళు నీ బజారుల్లో అందమైన దుస్తులూ ఊదారంగు కుట్టుపనితో చేసిన బట్టలూ రంగు రంగుల తివాచీలు, గట్టిగా పేనిన తాళ్ళు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
25
తర్షీషు ఓడలు నీ సరుకులను వేర్వేరు స్థలాలకు తీసుకుపోయేవి.
నువ్వు విస్తారమైన నీ సరుకులతో సముద్రం మధ్యలో కూర్చున్నావు.
26
తెడ్లతో ఓడ నడిపేవాళ్ళు నిన్ను మహాసముద్రం లోకి తీసుకుపోయారు. అయితే తూర్పు గాలి సముద్ర మధ్యలో నీ మీద విరుచుకు పడింది.
27
నువ్వు పతనమయ్యే రోజున నీ సంపద, నీ సరుకులు, నువ్వు మార్పిడి చేసుకునే వస్తువులు,
నీ నావికులు, నీ ఓడ నాయకులు, నీ ఓడలు బాగు చేసే వాళ్ళు, నీతో వ్యాపారం చేసే వాళ్ళు,
నీ సిపాయిలంతా, నీలో ఉన్న వాళ్ళంతా సముద్రం మధ్యలో మునిగిపోతారు.
28
నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన సముద్ర తీర పట్టణాలు కంపిస్తాయి.
29
తెడ్లు పట్టుకునే వాళ్ళంతా తమ ఓడలనుంచి దిగిపోతారు. నావికులూ ఓడనాయకులూ ఒడ్డున నిలబడతారు.
30
తమ స్వరం మీరు వినేలా చేసి, వెక్కి వెక్కి ఏడుస్తారు. తమ తలల మీద దుమ్ము పోసుకుని బూడిదలో పొర్లుతారు.
31
నీకోసం తమ తలలు బోడి చేసుకుని మొలకు గోనె పట్టా కట్టుకుని
మనో వేదనతో నీ కోసం ఎంతో దుఖిస్తారు.
32
వాళ్ళు నీ గురించి శోకగీతం మొదలుపెట్టి నీమీద మృత్యు గీతాలు ఇలా ఆలపిస్తారు,
తూరు లాంటి పట్టణం ఎక్కడుంది? ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి మౌనంగా ఉండిపోయింది.
33
సముద్రం మీద నీ సరుకులు తీసుకు పోతూ అది అనేకమందికి తృప్తినిచ్చింది.
నీ గొప్ప సంపద, వ్యాపారంతో భూరాజులు ధనికులయ్యారు.
34
అయితే నువ్వు అగాధజలాల్లో మునిగి సముద్ర బలంతో బద్దలయ్యావు.
నీ వ్యాపారం, నీ బలగమంతా మునిగిపోయింది.
35
నిన్ను బట్టి సముద్ర తీరప్రాంత ప్రజలంతా నిర్ఘాంతపోయారు. వాళ్ళ రాజులు భయాందోళనతో వణికారు.
వాళ్ళ ముఖాలు చిన్నబోయాయి.
36
ప్రజల్లోని వ్యాపారులు నిన్నుహేళన చేస్తారు.
నువ్వు భయభ్రాంతులు చెందావు. నీవిక ఎంత మాత్రం ఉనికిలో ఉండవు.
28
తూరూ రాజ్యం పాలించే వారికి సందేశం
1
అప్పుడు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.
2
నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. <<యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, <నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను> అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.
3
నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు!
4
నీ తెలివి తేటలతో నేర్పుతో ధనవంతుడివై, నీ ఖజానాల్లో వెండి బంగారాలను పోగుచేసుకున్నావు.
5
నీ గొప్ప తెలివితేటలతో నీ వ్యాపారంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు. నీ సంపద బట్టి నీ హృదయం గర్వించింది.
6
కాబట్టి యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు, నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.
7
నేను విదేశీయులను, ఇతర రాజ్యాలనుంచి క్రూరులను, నీ మీదికి రప్పిస్తాను. తెలివితో నువ్వు నిర్మించుకున్న నీ అందమైన పట్టణాల మీద వాళ్ళు తమ కత్తులు ఝళిపించి నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు.
8
వాళ్ళు నిన్ను నీ సమాధిలో పడేస్తారు. సముద్రాల్లో మునిగి చచ్చేవాళ్ళలాగా నువ్వు చస్తావు.
9
నిన్ను చంపేవాళ్ళ ఎదుట, <నేను దేవుణ్ణి> అంటావా? నువ్వు మనిషివే గానీ దేవుడివి కాదు గదా! నిన్ను పొడిచేవాళ్ళ చేతుల్లో నువ్వు ఉంటావు.
10
నువ్వు విదేశీయుల చేతుల్లో సున్నతిలేని వాళ్ళ చావు చస్తావు. ఈ విషయం చెప్పింది నేనే. ఇదే యెహోవా ప్రభువు సందేశం.>>
11
యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
12
<<నరపుత్రుడా, తూరు రాజును గురించి శోకగీతం ఎత్తి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నువ్వు పరిపూర్ణంగా గొప్ప తెలివితేటలతో అందాల రాశిలా ఉండే వాడివి.
13
దేవుని తోట, ఏదెనులో నువ్వున్నావు! అన్ని రకాల ప్రశస్త రత్నాలు నీకు అలంకాంరంగా ఉండేవి. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం, బంగారంలో పొదిగిన ఆభరణాలు నువ్వు అలంకరించుకున్నావు. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి.
14
అభిషేకం పొందిన కెరూబులా నేను నిన్ను నియమించాను. దేవుని పర్వతం మీద నువ్వున్నావు. నిప్పుకణికల వంటి రాళ్ల మధ్య నువ్వు నడిచేవాడివి.
15
నిన్ను సృష్టించిన రోజునుంచి నీలో పాపం కనిపించే వరకూ నీ ప్రవర్తన లోపం లేకుండా ఉంది.
16
అయితే నీ వ్యాపారం ఎక్కువ కావడం వలన నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేశావు. కాబట్టి కావలిగా ఉన్న కెరూబూ, దేవుని పర్వతం మీద నిప్పుకణికల్లాంటి రాళ్లమధ్య నువ్వుండకుండా నేను నిన్ను తోలివేసి, నిర్మూలం చేశాను.
17
నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడు చేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను.
18
నీ విస్తార పాపాలను బట్టి, నీ అన్యాయ వ్యాపారాన్ని బట్టి, నీ పవిత్ర స్థలాలను నువ్వు అపవిత్రం చేశావు. కాబట్టి నీలోనుంచి అగ్ని వచ్చేలా చేశాను. అది నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుట నిన్ను బూడిదగా చేస్తాను.
19
ప్రజల్లో నిన్ను ఎరిగిన వారంతా నిన్ను బట్టి వణికిపోతారు. నిర్ఘాంతపోతారు. నువ్విక ఉండవు.>>
సీదోను వ్యతిరేకంగా ప్రవచనం
20
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
21
<<నరపుత్రుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు తిప్పి దాన్ని గురించి ప్రవచించు.
22
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, సీదోను, నేను నీకు విరోధిని. నీ మధ్య నాకు ఘనత వస్తుంది. నేను నీ మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నపుడు నేను యెహోవానని నీ ప్రజలు తెలుసుకుంటారు. నన్ను నేను పవిత్రునిగా మీ మధ్య కనుపరచుకుంటాను.
23
నేను ఘోరమైన అంటురోగాన్ని మీ మధ్య పంపిస్తాను. మీ వీధుల్లో రక్తపాతం జరుగుతుంది. అన్ని వైపుల నుంచి నీ మీద కత్తి దూస్తారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
24
ఇశ్రాయేలీయుల చుట్టూ గుచ్చుకునే ముళ్ళ కంపల్లాగా నొప్పి కలిగించే గచ్చతీగల్లాగా వారిని తృణీకరించిన ప్రజలు ఇంక ఎవరూ ఉండరు. అప్పుడు నేనే యెహోవా ప్రభువునని వాళ్ళు తెలుసుకుంటారు.>>
25
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే <<ప్రజల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను దగ్గర చేర్చి, ప్రజల ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను. అప్పుడు నా సేవకుడు యాకోబుకు నేనిచ్చిన తమ దేశంలో వాళ్ళు నివసిస్తారు.
26
వాళ్ళు అందులో భయం లేకుండా నివసించి ఇళ్ళు కట్టుకుని ద్రాక్షతోటలు నాటుకుంటారు. వారి చుట్టూ ఉండి వాళ్ళను తృణీకరించే వారందరికీ నేను శిక్ష విధించిన తరువాత వాళ్ళు భయం లేకుండా నివసించేటప్పుడు నేను తమ యెహోవా దేవుడినని వాళ్ళు తెలుసుకుంటారు.>>
29
ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం
1
బబులోను చెరలో ఉన్న కాలంలో, పదో సంవత్సరం పదో నెల పన్నెండో రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2
<<నరపుత్రుడా, నీ ముఖాన్ని ఐగుప్తురాజు ఫరో వైపు తిప్పి అతని గురించి, ఐగుప్తు దేశమంతటిని గురించి ప్రవచించు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే
3
ఐగుప్తు రాజు ఫరో, నైలునదిలో పడుకున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని.
నైలునది నాది, నేనే దాన్ని కలగచేశాను, అని నువ్వు చెప్పుకుంటున్నావు.
4
నేను నీ దవడకు గాలాలు తగిలిస్తాను. నీ నైలు నదిలోని చేపలను నీ పొలుసులకు అంటుకునేలా చేస్తాను. నీ నది మధ్యలో నుంచి నిన్నూ నీ పొలుసులకు అంటిన చేపలన్నిటినీ బయటికి లాగేస్తాను.
5
నిన్నూ నైలు నది చేపలన్నిటినీ ఎడారిలో పారబోస్తాను.
నువ్వు నేల మీద పడతావు. నిన్నెవరూ ఎత్తలేరు, లేపరు.
నిన్ను అడవి జంతువులకు ఆకాశపక్షులకు ఆహారంగా ఇస్తాను!
6
అప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులంతా తెలుసుకుంటారు.
ఐగుప్తు, ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లలాగా ఉంది.
7
వాళ్ళు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నువ్వు విరిగిపోయి వారి పక్కలో గుచ్చుకున్నావు.
వాళ్ళు నీ మీద ఆనుకుంటే నువ్వు వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి వారి నడుములు బెణికేలా చేశావు.>>
8
కాబట్టి యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. నేను నీ మీదికి కత్తి దూస్తాను. నీ మనుషులనూ పశువులనూ చంపుతాను.
9
ఐగుప్తుదేశం పాడైపోయి నిర్మానుష్యమై పోతుంది. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే <<నైలు నది నాది, నేనే దాన్ని కలగచేశాను>> అని భయంకర సముద్ర జంతువు అనుకుంటున్నాడు.
10
కాబట్టి నేను నీకూ నీ నదికీ విరోధిని. ఐగుప్తు దేశాన్ని మిగ్దోలు నుంచి సెవేనే వరకూ కూషు సరిహద్దు వరకూ పూర్తిగా పాడు చేసి ఎడారిగా చేస్తాను.
11
దాని మీదుగా ఏ కాలూ కదలదు. ఏ జంతువూ అటుగుండా వెళ్ళదు. నలభై ఏళ్ళు దానిలో ఎవరూ ఉండరు.
12
నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల మధ్య ఐగుప్తుదేశాన్ని పాడైన దానిగా చేస్తాను. పాడైపోయిన పట్టణాల్లో దాని పట్టణాలు నలభై ఏళ్ళు పాడై ఉంటాయి. ఐగుప్తీయులను ఇతర ప్రజల మధ్యకు చెదరగొడతాను. ఇతర దేశాలకు వారిని వెళ్ళగొడతాను.
13
యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. నలభై ఏళ్ళు గడిచిన తరువాత నానాప్రజల్లో చెదరిపోయిన ఐగుప్తీయులను నేను సమకూరుస్తాను.
14
ఐగుప్తు కోల్పోయిన దాన్ని మళ్ళీ ఇచ్చి, పత్రోసు అనే తమ సొంత ప్రాంతానికి చేరుస్తాను. అక్కడ వాళ్ళు అల్పమైన రాజ్యంగా ఉంటారు.
15
రాజ్యాల్లో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. ఇక ఇతర రాజ్యాల మీద అతిశయపడదు. వాళ్ళిక ఇతర రాజ్యాలపై పెత్తనం చేయకుండా నేను వారిని తగ్గిస్తాను.
16
ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషాన్ని మనసుకు తెచ్చుకుని ఐగుప్తు వైపు తిరిగితే అప్పటినుంచి వారికి నమ్మకం కుదరదు. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
17
బబులోను చెరలో ఉన్న కాలంలో, ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
18
నరపుత్రుడా, తూరు మీద బబులోనురాజు నెబుకద్నెజరు తన సైన్యంతో చాలా కష్టమైన పని చేయించాడు. వారందరి జుట్టు ఊడిపోయింది. వారి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరుకు విరోధంగా అతడు పడిన కష్టానికి అతనికి గానీ అతని సైన్యానికి గానీ కూలి కూడా రాలేదు.
19
కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, ఐగుప్తు దేశాన్ని బబులోను రాజు నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుంటాడు. అది అతని సైన్యానికి జీతమవుతుంది.
20
తూరు పట్టణం మీద అతడు చేసింది నా కోసమే కాబట్టి అందుకు బహుమానంగా దాన్ని అప్పగిస్తున్నాను. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
21
ఆ రోజు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము పైకి వచ్చేలా చేస్తాను. వారితో మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
30
ఐగుప్తు గూర్చి విలాపం
1
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2
<<నరపుత్రుడా, ప్రవచిస్తూ ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, <అయ్యో! రాబోతున్న ఆ రోజు ఎంత భయంకరం.>
3
ఆ రోజు వచ్చేసింది! యెహోవా కోసం ఆ రోజు వచ్చింది! అది మబ్బులు కమ్మే రోజు. రాజ్యాలు పతనమయ్యే రోజు!
4
అప్పుడు ఐగుప్తు దేశం మీద కత్తి పడుతుంది. ఐగుప్తులో చనిపోయిన వాళ్ళు కూలిపోతుంటే కూషు దేశస్థులు వేదన పడతారు.
శత్రువులు ఐగుప్తీయుల ఆస్తి
ని పట్టుకుని దేశపు పునాదులను పడగొడతారు!
5
కూషీయులు, పూతీయులు, లూదీయులు, విదేశీయులు నిబంధన ప్రజలంతా కత్తితో కూలుతారు!
6
యెహోవా తెలియజేసేది ఏమిటంటే,
ఐగుప్తుకు అండగా ఉండే వాళ్ళు కూలుతారు. గర్వంతో కూడిన దాని బలం అణగిపోతుంది.
మిగ్దోలు నుండి సెవేనే వరకూ ప్రజలు కత్తితో కూలుతారు.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
7
పాడైపోయిన దేశాల మధ్య వాళ్ళు దిక్కులేని వాళ్ళుగా ఉంటారు. శిథిలాల పట్టణాల మధ్య వారి పట్టణాలుంటాయి.
8
ఐగుప్తు దేశంలో అగ్ని రగిలించి నేను దానికి సహాయకులు లేకుండా చేస్తే అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
9
ఆ రోజు వార్తాహరులు నా దగ్గర నుంచి ఓడల్లో బయలుదేరి సురక్షితంగా ఉన్న కూషును భయపెడతారు. ఐగుప్తు పతనమయ్యే రోజున వారికి భయభ్రాంతులు పుడతాయి. అదిగో! అది వస్తూ ఉంది.
10
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే<<బబులోను రాజు నెబుకద్నెజరు వలన ఐగుప్తులో ఇక ఏ మాత్రం జనాభా ఉండరు.
11
ఆ దేశాన్ని నాశనం చేయడానికి, అతడు తన సైన్యాన్ని తోడుకుని వస్తాడు. అతనికి రాజ్యాలన్నీ భయపడిపోతాయి. ఐగుప్తీయులను చంపడానికి వారు తమ కత్తులు దూసి చచ్చిన వాళ్ళతో దేశాన్ని నింపుతారు.
12
నదులను ఎండగొట్టి ఆ నేను ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మి వేస్తాను. విదేశీయులతో నేను ఆ దేశాన్ని, దానిలో ఉన్నదంతా పాడు చేయిస్తాను. ఇదే యెహోవా ప్రభువు సందేశం.>>
13
యెహోవా ఇలా చెబుతున్నాడు. <<విగ్రహాలను నేను నాశనం చేస్తాను. మెంఫిస్ పట్టణపు పనికిరాని విగ్రహాలను లేకుండా చేస్తాను. ఇక ఐగుప్తు దేశంలో రాజు ఉండడు. దేశమంతటా నేను భయం పుట్టిస్తాను.
14
పత్రోసును పాడు చేస్తాను. సోయనులో నిప్పు పెడతాను. తేబేస్ మీదికి శిక్ష పంపిస్తాను.
15
ఐగుప్తుకు కోటగా ఉన్న పెలుసియం మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను. తేబేస్ లోని అనేకమందిని నిర్మూలం చేస్తాను.
16
ఆ తరువాత ఐగుప్తును కాల్చివేస్తాను. పెలుసియం వాళ్ళు వేదనతో అల్లాడిపోతారు. తేబిస్ చిన్నాభిన్నమవుతుంది. ప్రతిరోజూ మెంఫిస్ పై శత్రువులు దాడి చేస్తారు.
17
హీలియోపోలిస్, బుబాస్తిస్ పట్టణాల్లోని యువకులు కత్తితో కూలుతారు. ఆ పట్టణ ప్రజలు బందీలుగా పోతారు.
18
ఐగుప్తు మోపిన కాడిని నేను తహపనేసులో విరిచే రోజున చీకటి కమ్ముకుంటుంది. గర్వంతో కూడిన ఐగుప్తీయుల బలం అక్కడ అంతమవుతుంది. దాన్ని మబ్బు కమ్ముకుంటుంది. దాని కూతుర్లు బందీలుగా పోతారు.
19
నేను ఐగుప్తీయులకు శిక్ష విధిస్తే నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
20
పదకొండవ ఏడు మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
21
నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజు ఫరో చేతిని విరగ గొట్టాను. అది బాగుపడేలా ఎవరూ దానికి కట్టు కట్టరు. కత్తి పట్టుకునే బలం దానికి లేదు.>>
22
కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే<<నేను ఐగుప్తురాజు ఫరో చేతులను విరిచేస్తాను. అతని బలమైన చేతినీ, విరిగిన చేతినీ విరగ గొట్టి, అతని చేతిలోనుంచి కత్తి జారిపోయేలా చేస్తాను.
23
అప్పుడు ఐగుప్తీయులను ఇతర రాజ్యాల్లోకి చెదరగొడతాను. వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను.
24
ఫరో చేతులను నేను విరగ గొట్టడానికి, బబులోను రాజు చేతులను బలపరచి నా కత్తి అతని చేతికిస్తాను. బబులోను రాజు చూస్తూ ఉండగా ఫరో చావు దెబ్బతిన్న వాడి లాగా మూలుగుతాడు.
25
బబులోను రాజు చేతులను నేను బలపరుస్తాను. ఫరో చేతులు పడిపోతాయి. ఐగుప్తు దేశం మీద చాపడానికి నేను నా కత్తిని బబులోను రాజు చేతికిస్తే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.
26
నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా నేను ఐగుప్తును రాజ్యాల్లో చెదర గొట్టి వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను.>>
31
లెబానోను దేవదారు వృక్షల ఉపమానం
1
బబులోను చెరలో ఉన్న కాలంలో, పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2
<<నరపుత్రుడా, ఐగుప్తు రాజు ఫరోతో, అతని చుట్టూ ఉన్న సేవకులతో ఇలా చెప్పు.
ఘనత విషయంలో నువ్వు ఎవరిలాగా ఉన్నావు?
3
అష్షూరు లెబానోను దేవదారు వృక్షం లాంటిది. అందమైన కొమ్మలతో,
విశాలమైన గుబురుతో, ఎంతో ఎత్తుగా ఉంది.
దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కంటే ఎత్తుగా ఉంది.
4
నీళ్లు సమృద్ధిగా ఉండడం వలన అది ఎత్తుగా ఎదిగింది. లోతైన నదిని బట్టి మహావృక్షం అయింది. దాని చుట్టూ కాలువలు పారుతున్నాయి.
వాటి పిల్ల కాలువలు ఆ ప్రాంతంలోని చెట్లన్నిటికీ నీళ్ళు అందించాయి.
5
ఆ ప్రాంతంలోని చెట్లన్నిటి కంటే అది ఎంతో ఎత్తుగా ఎదిగింది.
దానికి చాలా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి.
నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దాని కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.
6
పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. భూజంతువులన్నీ దాని గుబురులో పిల్లలు పెట్టాయి.
దాని నీడలో అన్ని రకాల జాతులు నివసించాయి.
7
నీళ్ళు సమృద్ధిగా ఉన్న దగ్గర దాని వేళ్ళు పాకాయి. కాబట్టి అది పొడవాటి కొమ్మలతో అది అందంగా, గొప్పగా ఉంది.
8
దేవుని తోటలోని దేవదారు వృక్షాలు దానికి సాటి కావు.
సరళ వృక్షాలకు అలాంటి కొమ్మలు లేవు. మేడి చెట్ల కొమ్మలు దీని కొమ్మలకు సాటిరావు.
దానికున్నంత అందం దేవుని తోటలోని వృక్షాల్లో దేనికీ లేదు!
9
అనేక కొమ్మలతో నేను దాన్ని అందంగా చేశాను.
అందుకు దేవుని తోట, ఏదెనులోని వృక్షాలన్నీ దాని మీద అసూయపడ్డాయి.>>
10
అందుచేత యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. <<అది ఎంతో ఎత్తుగా ఉంది కాబట్టి, దాని కొన మిగతా వృక్షాలన్నిటిలో కంటే ఎత్తుగా ఉంది కాబట్టి, గర్వించింది.
11
కాబట్టి నేను అతణ్ణి ఒడిసి పట్టుకుని రాజుల్లో అతి బలిష్ఠమైన వాడి చేతుల్లో పెట్టాను. ఈ అధికారి అతని చెడుతనానికి తగిన విధంగా అతని పట్ల జరిగించి తరిమివేశాడు.
12
రాజ్యాలన్నిటిలో అతి క్రూరమైన విదేశీయులు అతన్ని నరికి పారవేశారు. అతని కొమ్మలు కొండల మీద, లోయల్లో పడ్డాయి. అతని శాఖలు భూమి మీదున్న అన్ని వాగుల్లో విరిగి పడ్డాయి. అప్పుడు భూరాజ్యాలన్నీ దాని నీడనుంచి వెళ్లి అతణ్ణి వదిలేశాయి.
13
అతని మోడు మీద ఆకాశపక్షులన్నీ వాలాయి.
అతని కొమ్మల్లో భూజంతువులన్నీ ఉన్నాయి.
14
నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అతిశయంతో అంత ఎత్తుకు ఎదగకుండా ఇది జరిగింది. దాని కొనలు మిగతా వృక్షాలకంటే ఎత్తుగా ఉండకుండాా, నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అంత ఎత్తుకు ఎదగకుండా ఉంటుంది. సాధారణ మనుషులు చనిపోయినట్టుగా అవన్నీ చస్తాయి.>>
15
యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. <<అతడు పాతాళం లోకి పోయిన రోజు నేను భూమికి దుఃఖం కలిగించాను. అగాధజలాలు అతన్ని ముంచేలా చేశాను. సముద్రపు నీటిని ఆపాను. అతన్ని బట్టి నేను వాటి ప్రవాహాలను బంధించాను. అతని కోసం నేను లెబానోనుకు దుఃఖం కలిగించాను. కాబట్టి ఆ ప్రాంతంలోని చెట్లన్నీ అతని కోసం దుఃఖించాయి.
16
అతని పతనం వల్ల కలిగే చప్పుడు విని ప్రజలు వణికిపోయేలా చేశాను. చచ్చిన వాళ్ళుండే గుంటలో అతన్ని విసిరేశాను. పల్లం ప్రాంతాల్లో ఉన్న ఏదెను చెట్లన్నిటినీ నేను ఓదార్చాను. ఇవన్నీ లెబానోనులో నీళ్ళ సమృద్ధి దొరికిన మంచి వృక్షాలు.
17
వాళ్ళు కూడా కత్తితో చచ్చిన వారి దగ్గరికి అతనితో కూడా పాతాళానికి దిగిపోయారు. వీరంతా అతని నీడలో నివసించిన వాళ్ళు, అతనికి సహాయం చేసిన వాళ్ళు.
18
ఘనత, ఆధిక్యం విషయంలో నీకు ఏదెను తోటలోని వృక్షాల్లో సాటి ఏది? అయినా నువ్వు ఏదెను వృక్షాలతో పాటు భూమి కిందికి, సున్నతిలేని వారి దగ్గరికి దిగిపోవలసి వస్తుంది. కత్తితో చచ్చిన వారితో నువ్వు నివసిస్తావు! ఫరో, అతని సేవకులందరికీ జరిగేది ఇదే>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
32
ఫరో గురించి విలాపం
1
బబులోను చెరలో ఉన్న కాలంలో, పన్నెండవ నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2
నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి ఈ మాట చెప్పు.
<<రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి.
నదిలో మొసలివంటి వాడివి.
నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.>>
3
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే,
<<నేను, నా వల నీ మీద వేస్తే వాళ్ళు నిన్ను నా వలలో నుంచి అనేక ప్రజల మధ్య బయటికి లాగుతారు.
4
నేను నిన్ను నేల మీద పడేస్తాను. బయటి పొలంలో పారేస్తాను.
గాలిలో ఎగిరే అన్ని రకాల పిట్టలు నీ మీద వాలేలా చేస్తాను. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు నీ మాంసాన్ని కడుపారా తింటాయి.
5
నీ మాంసాన్ని పర్వతాల మీద వేస్తాను. పురుగులు పట్టిన నీ కళేబరంతో లోయలను నింపుతాను.
6
నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను.
వాగులు రక్తంతో నిండుతాయి.
7
నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను.
సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు.
8
నిన్నుబట్టి ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటి చేస్తాను.
నీ దేశం మీద చీకటి కమ్ముతుంది.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
9
<<నువ్వు ఎరగని దేశాల్లోకి నేను నిన్ను వెళ్లగొట్టి, నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక మందికి కోపం పుట్టిస్తాను.
10
నా కత్తి రాజుల ఎదుట ఆడించేటప్పుడు నీ కారణంగా చాలామంది దిగ్భ్రాంతి చెందుతారు. నువ్వు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా ప్రాణభయంతో వణకుతారు.>>
11
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే<<బబులోను రాజు కత్తి నీ మీదికి వస్తుంది!
12
శూరుల కత్తితో నేను నీ సేనను కూలుస్తాను. వాళ్ళలో ప్రతి శూరుడూ రాజ్యాలను వణికిస్తాడు.
వాళ్ళు ఐగుప్తీయుల గర్వం అణచివేస్తారు. దాని సైన్యాన్నంతా నాశనం చేస్తారు.
13
సమృద్ధిగా ఉన్న నీళ్ల దగ్గరున్న పశువులన్నిటినీ నేను నాశనం చేస్తాను.
ప్రజల కాళ్ళు గానీ పశువుల కాళ్ళు గానీ ఆ నీటిని కదిలించలేవు.
14
అప్పుడు నేను వాటి నీళ్లు ఆపి, నూనె పారేలా వాళ్ళ నదులు పారేలా చేస్తాను.>>
ఇదే యెహోవా ప్రభువు సందేశం.
15
<<నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి
దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే
నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
16
ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు.
వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు.
ఇదే యెహోవా ప్రభువు సందేశం.
17
పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు.
18
నరపుత్రుడా, ఐగుప్తీయుల సమూహం గురించి విలపించు.
భూమి కిందికి పాతాళానికి దిగిపోయిన వాళ్ళ దగ్గరికి, ఆమెనూ గొప్ప రాజ్యాల కూతుళ్ళనూ తోసి వెయ్యి.
19
వాళ్ళతో ఇలా అను, <మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో>
20
కత్తితో చచ్చిన వాళ్ళతోబాటు వాళ్ళు కూలుతారు. అది కత్తిపాలవుతుంది. ఆమె విరోధులు ఆమెనూ ఆమె సేవకులనూ ఈడ్చుకుపోతారు.
21
పాతాళంలోని గొప్ప యోధులు ఐగుప్తు గురించీ దాని మిత్రుల గురించీ ఇలా చెబుతారు,
<వీళ్లిక్కడికి దిగి వచ్చేశారు! కత్తితో చచ్చిన సున్నతిలేని వాళ్ళ దగ్గర వీరు పడుకుంటారు>
22
అష్షూరు, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి.
వాళ్ళంతా కత్తితో చచ్చారు.
23
దాని సమాధులు పాతాళాగాధంలో ఉన్నాయి.
దాని గుంపులు దాని సమాధి చుట్టూ ఉన్నాయి.
వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కత్తితో చచ్చిన వాళ్ళు.
24
ఏలాము, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు.
వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళు సున్నతి లేకుండా పాతాళంలోకి దిగిపోయారు.
వాళ్ళు సిగ్గు పాలవుతారు.
25
చచ్చిన వాళ్ళ మధ్య దానికీ దాని సమూహానికీ ఒక పరుపు సిద్ధం చేశారు. దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి.
వాళ్ళంతా సున్నతి లేకుండా చచ్చారు.
వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. పాతాళం లోకి దిగిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సిగ్గు పాలవుతారు. చచ్చిన వాళ్ళ మధ్య ఏలాము ఉంది.
26
అక్కడ మెషెకు తుబాలు దాని గుంపంతా ఉన్నాయి.
దాని సమాధులు దాని చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కత్తిపాలయ్యారు.
27
వీళ్ళు సున్నతి లేని వాళ్ళలో పడిపోయిన శూరుల దగ్గర పడుకోరు.
వాళ్ళు తమ యుద్ధాయుధాలన్నిటితో పాతాళంలోకి దిగిపోయి, తమ కత్తులను తమ తలల కింద ఉంచుకుని పడుకుంటారు.
తమ డాళ్ళను తమతో ఉంచుకుంటారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు.
28
కాబట్టి, ఐగుప్తు, నువ్వు సున్నతి లేని వాళ్ళ మధ్య నాశనమై, కత్తి పాలైన వాళ్ళ దగ్గర పడుకుంటావు.
29
అక్కడ ఎదోము, దాని రాజులు దాని అధిపతులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులైనా కత్తి పాలైన వాళ్ళ దగ్గర ఉన్నారు. సున్నతి లేని వాళ్ళ దగ్గర పాతాళంలోకి దిగిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా పడుకున్నారు.
30
అక్కడ ఉత్తర దేశపు అధిపతులంతా, చచ్చిన వాళ్ళతో దిగిపోయిన సీదోనీయులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులై భయం పుట్టించినా సిగ్గు పాలయ్యారు. సున్నతి లేకుండా కత్తి పాలైన వాళ్ళ మధ్య పడుకున్నారు. గోతిలోకి దిగిపోయిన వాళ్ళతో పాటు సిగ్గుపాలయ్యారు.
31
కత్తి పాలైన ఫరో, అతని వాళ్ళంతా వాళ్ళను చూచి తమ సమూహమంతటిని గురించి ఓదార్పు తెచ్చుకుంటారు.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
32
<<సజీవుల లోకంలో వాళ్ళతో నేను ఉగ్రత తెప్పించాను. అయితే సున్నతి లేనివాళ్ళతో కత్తి పాలైనవాళ్ళతో పడుకుంటారు.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
33
యెహెజ్కేలను కావలివానిగా
1
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2
<<నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ విషయం చెప్పు, నేను ఒకానొక దేశం మీదికి కత్తి రప్పిస్తే ఆ ప్రజలు తమలో ఒకణ్ణి ఎన్నుకుని కావలివానిగా ఏర్పరచుకున్నారనుకో.
3
అతడు దేశం మీదికి కత్తి రావడం చూసి, బూర ఊది ప్రజలను హెచ్చరిక చేస్తాడనుకో.
4
అప్పుడు ఎవడైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్తపడక పోతే, కత్తి వచ్చి వాడి ప్రాణం తీసేస్తే వాడు తన చావుకు తానే బాధ్యుడు.
5
బూర శబ్దం విని కూడా వాడు జాగ్రత్త పడలేదు కాబట్టి తన చావుకు తానే బాధ్యుడు. వాడు జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడే.
6
అయితే కావలివాడు కత్తి రావడం చూసినా కూడా, బూర ఊదకుండా ప్రజలను హెచ్చరించకుండా ఉన్నాడనుకో. కత్తి వచ్చి వాళ్ళలో ఒకడి ప్రాణం తీస్తే, వాడు తన దోషాన్ని బట్టి చస్తాడు. కానీ, అతని చావుకు నేను కావలి వాడినే బాధ్యుని చేస్తాను.
7
నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా నియమించాను. కాబట్టి నువ్వు నా నోటి మాట విని నా పక్షంగా వారిని హెచ్చరించాలి.
8
<దుర్మార్గుడా, నువ్వు తప్పకుండా చస్తావు> అని దుర్మార్గుడికి నేను చెబితే, నువ్వు అతణ్ణి హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి చస్తాడు. అయితే అతని చావుకు నిన్నే బాధ్యుని చేస్తాను.
9
అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని నువ్వు అతన్ని హెచ్చరించావనుకో. అతడు తన దుర్మార్గం విడిచి పెట్టకపోతే అతడు తన దోషాన్ని బట్టి చస్తాడు గానీ నువ్వు అతని చావుకు బాధ్యుడివి కాదు.
10
నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ విషయం తెలియచెయ్యి. <మా అపరాధాలూ పాపాలూ మా మీద భారంగా ఉన్నాయి. వాటి వలన మేము నీరసించిపోతున్నాము. మేమెలా బతుకుతాం?> అని మీరంటున్నారు.
11
వారితో ఇలా చెప్పు, నా జీవం మీద ఆనబెట్టి చెబుతున్నాను, దుర్మార్గుడు చస్తే నాకేమీ సంతోషం లేదు. దుర్మార్గుడు తన పద్ధతిని బట్టి పశ్చాత్తాపపడి బతకాలి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు మార్చుకోండి. మీ దుర్మార్గతనుంచి పశ్చాత్తాప పడండి. మీరెందుకు చావాలి? ఇదే యెహోవా ప్రభువు సందేశం.
12
నరపుత్రుడా, నువ్వు నీ ప్రజలకు ఈ మాట చెప్పు. నీతిమంతుడు పాపం చేస్తే అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపించదు! దుష్టుడు చెడుతనం విడిచి మనస్సు మార్చుకుంటే తాను చేసిన దుర్మార్గాన్ని బట్టి వాడు నాశనం కాడు. అలాగే నీతిమంతుడు పాపం చేస్తే తన నీతిని బట్టి అతడు బతకడు.
13
నీతిమంతుడు తప్పక బతుకుతాడు, అని నేను చెప్పినందువలన అతడు తన నీతిని నమ్ముకుని పాపం చేస్తే మునుపు అతడు చేసిన నీతి పనులన్నిటిలో ఏదీ జ్ఞాపకానికి రాదు. తాను చేసిన పాపాన్ని బట్టి అతడు చస్తాడు.
14
<తప్పకుండా చస్తావు> అని దుర్మార్గునికి నేను చెప్పిన తరువాత అతడు తన పాపం విడిచి, నీతి న్యాయాలను అనుసరిస్తూ
15
తన దగ్గర అప్పు తీసుకున్నవాడికి తాకట్టు మళ్ళీ అప్పగించి, తాను దొంగిలించినదాన్ని మళ్ళీ ఇచ్చి వేసి పాపం చేయకుండా, జీవాధారమైన చట్టాలను అనుసరిస్తే అతడు చావడు. తప్పకుండా బతుకుతాడు.
16
అతడు చేసిన పాపాల్లో ఏదీ అతని విషయం జ్ఞాపకానికి రాదు. అతడు నీతిన్యాయాలను అనుసరిస్తున్నాడు కాబట్టి తప్పకుండా అతడు బతుకుతాడు.
17
అయినా నీ ప్రజలు <యెహోవా పద్ధతి న్యాయం కాదు> అంటారు. అయితే వారి పద్ధతే అన్యాయమైనది.
18
నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు చస్తాడు.
19
దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచి నీతిన్యాయాలను అనుసరిస్తే వాటిని బట్టి అతడు బతుకుతాడు.
20
అయితే మీరు <యెహోవా పద్ధతి న్యాయం కాదు> అంటారు. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవడి ప్రవర్తననుబట్టి వాడికి శిక్ష విధిస్తాను.>>
యెరూషలేము పతనం
21
మనం చెరలోకి వచ్చిన పన్నెండవ సంవత్సరం పదో నెల అయిదో రోజు ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా దగ్గరికి వచ్చి <<పట్టణాన్ని పట్టుకున్నారు>> అని చెప్పాడు.
22
అతడు రాకముందు సాయంత్రం యెహోవా చెయ్యి నా మీద ఉంది. ఉదయాన అతడు నా దగ్గరికి వచ్చేముందే యెహోవా నా నోరు తెరచాడు. నేను మాట్లాడగలుగుతున్నాను. అప్పటినుంచి నేను మౌనంగా లేను.
23
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
24
<<నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, <అబ్రాహాము ఒక్కడుగానే ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు. మనం అనేకులం. ఈ దేశం మనకు స్వాస్థ్యంగా వచ్చింది> అని చెప్పుకుంటున్నారు.
25
కాబట్టి వారికీ మాట చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, మీరు రక్తం తింటున్నారు. మీ విగ్రహాలను చూస్తూ ఉంటారు. మీరింకా హత్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?
26
మీరు మీ కత్తిని నమ్ముకుంటారు. నీచమైన పనులు చేస్తారు. పక్కింటివాడి భార్యను పాడు చేస్తారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?
27
వారికి నువ్విలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, కత్తి పాలవుతారు. బయట పొలాల్లో ఉండే వాళ్ళను నేను అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను. కోటల్లో గుహల్లో ఉండేవాళ్ళు రోగాలతో చస్తారు.
28
ఆ దేశాన్ని నిర్జనంగా పాడుచేస్తాను. దాని బలాతిశయం అంతం అవుతుంది. ఇశ్రాయేలు కొండలు నిర్జనంగా ఉంటాయి. ఎవరూ వాటి గుండా వెళ్ళరు.
29
వారు చేసిన నీచమైన పనుల వలన వారి దేశాన్ని పాడుగా నిర్జనంగా నేను చేస్తే నేను యెహోవానని వారు తెలుసు కుంటారు.
30
నరపుత్రుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇంటి గుమ్మాల్లో నిలబడి ఒకరినొకరు నీ గురించి మాట్లాడుతూ, <యెహోవా దగ్గర నుంచి వచ్చే ప్రవక్త మాట విందాం పదండి> అని చెప్పుకుంటున్నారు.
31
నా ప్రజలు ఎప్పుడూ వచ్చేలాగే నీ దగ్గరికి వస్తారు. నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు గాని వాటిని పాటించరు. సరైన మాటలు వాళ్ళు చెబుతారు గానీ వాళ్ళ మనసులు అక్రమ లాభం కోసం ఆరాటపడుతున్నాయి.
32
నువ్వు వాళ్లకు, తీగ వాయిద్యంతో చక్కటి సంగీత కచేరీ చేస్తూ కమ్మగా పాడే వాడిలా ఉన్నావు. వాళ్ళు నీ మాటలు వింటారు గానీ ఎవ్వరూ వాటిని పాటించరు.
33
తప్పక జరుగుతాయి అని నేను చెప్పినవన్నీ జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు.>>
34
గొర్రెల, కాపరులు
1
యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
2
<<నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ విషయం చెప్పు. ఆ కాపరులతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తమ కడుపు నింపుకునే ఇశ్రాయేలీయుల కాపరులకు శిక్ష తప్పదు. కాపరులు గొర్రెలను మేపాలి గదా!
3
మీరు కొవ్విన గొర్రెలను వధించి, కొవ్వు తిని, బొచ్చును కప్పుకుంటారు. కానీ గొర్రెలను మేపరు.
4
జబ్బు చేసిన వాటిని మీరు ఆదుకోలేదు. రోగంతో ఉన్న వాటిని మీరు బాగుచేయలేదు. గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. తోలివేసిన వాటిని మళ్ళీ తోలుకు రాలేదు. తప్పిపోయిన వాటిని వెదకలేదు. అంతేకాక మీరు కఠినంగా క్రూరంగా వాటి మీద పెత్తనం చేశారు.
5
కాబట్టి, కాపరి లేక అవి చెదరిపోయాయి. చెదరిపోయి అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి.
6
నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా ఎత్తయిన ప్రతి కొండ మీదా తిరిగాయి. నా గొర్రెలు ప్రపంచమంతా చెదరిపోయాయి. అయితే వాటిని ఎవరూ వెతకడం లేదు.>>
7
కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి.
8
<<కాపరులు లేకుండా నా గొర్రెలు దోపిడీకి గురై అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి. కాపరులు నా గొర్రెలను వెదకలేదు. వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటారు. గొర్రెలను మేపరు.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
9
కాబట్టి కాపరులారా యెహోవా మాట వినండి.
10
<<యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. నేను ఆ కాపరులకు విరోధినయ్యాను. నా గొర్రెలను గురించి వారి దగ్గర లెక్క అడుగుతాను. వారిక గొర్రెలు మేపడం మాన్పిస్తాను. కాపరులు తమ కడుపు నింపుకోకుండేలా చేస్తాను. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట్లో నుంచి వాటిని తప్పిస్తాను.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
ప్రభువువైన దేవుడు గొర్రెల కాపరి
11
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే <<నేనే స్వయంగా నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను.
12
తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెలను వెతికి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి,
13
ఇతర ప్రజల మధ్యనుంచి వాటిని తోడుకు వచ్చి, వాటి స్వదేశంలోకి తీసుకొస్తాను. ఇశ్రాయేలు కొండల మీద, వాగుల దగ్గర, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను.
14
నేను మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇశ్రాయేలు ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకుంటాయి. ఇశ్రాయేలు కొండల మీద మంచి పచ్చిక మైదానాల్లో అవి మేస్తాయి.
15
నేనే నా గొర్రెలను మేపి పడుకోబెడతాను.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
16
<<తప్పిపోయిన వాటిని నేను వెదకుతాను. తోలివేసిన వాటిని మళ్ళీ తీసుకొస్తాను. గాయపడిన వాటికి కట్టుకడతాను. బలంలేని వాటికి బలం కలిగిస్తాను. అయితే కొవ్విన వాటినీ బలంగా ఉన్న వాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.
17
నా మందా, మీ విషయం యెహోవా ప్రభువును, నేను, ఇలా చెబుతున్నాను. గొర్రెలకూ పొట్టేళ్లకూ మేకలకూ మధ్య నేను న్యాయాధికారిగా ఉంటాను.
18
పచ్చిక మైదానాల్లో మంచి మేత మేయడం మీకు చాలదా? మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కాలా?
19
మీరు స్వచ్ఛమైన నీళ్ళు తాగి, మిగతా నీళ్ళు కాళ్ళతో కెలికి మురికిచేయాలా? మీరు కాళ్లతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేస్తున్నాయి. మీరు మీ కాళ్ళతో కలకలు చేసిన నీళ్ళు అవి తాగుతున్నాయి.
20
కాబట్టి యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు, నేనే స్వయంగా కొవ్విన గొర్రెలకూ చిక్కిపోయిన గొర్రెలకూ మధ్య భేదం చూసి తీర్పు తీరుస్తాను.
21
మీరు భుజాలతో పక్కతో తోస్తూ ఉంటే, నీరసించిపోయిన వాటన్నిటినీ కొమ్ములతో పొడుస్తూ చెదరగొట్టేస్తున్నారు.
22
కాబట్టి ఇకనుంచి నా మంద దోపిడీ కాకుండా వాటిని రక్షిస్తాను. గొర్రె గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను.
23
వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
24
నేను, యెహోవాను, వారికి దేవుడుగా ఉంటాను. నా సేవకుడు దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
25
అవి అరణ్యంలో నిర్భయంగా నివసించేలా, అడవిలో క్షేమంగా పడుకునేలా నేను వాటితో శాంతి ఒడంబడిక చేస్తాను. దేశంలో క్రూర జంతువులు లేకుండా చేస్తాను.
26
నేను వాళ్ళను దీవిస్తాను. నా పర్వతం చుట్టూ ఉన్న స్థలాలను దీవిస్తాను. సరైన కాలాల్లో వానలు కురిపిస్తాను. దీవెన జల్లులివే.
27
పళ్ళ చెట్లు కాయలు కాస్తాయి. భూమి పంట ఇస్తుంది. నా గొర్రెలు వాటి ప్రాంతాల్లో క్షేమంగా ఉంటాయి. నేను వారి కాడికట్లను తెంపి వారిని బందీలుగా చేసినవారి చేతిలో నుంచి వారిని విడిపించేటప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.
28
ఇకపై వారు ఇతర రాజ్యాలకు దోపిడీగా ఉండరు. క్రూర జంతువులు వారిని మింగివేయవు! వాళ్ళు ఎవరికీ భయపడకుండా క్షేమంగా నివసిస్తారు.
29
వాళ్ళ పైరుకు ప్రశాంతంగా పెరిగే వాతావరణం కలిగిస్తాను. వాళ్ళు ఇక ఏమాత్రం దేశంలో కరువుకు గురి కారు. ఇతర రాజ్యాలు వారిని చిన్నచూపు చూడరు.
30
అప్పుడు నేను వారి దేవుడు యెహోవాననీ నేను వారికి తోడుగా ఉన్నాననీ తెలుసుకుంటారు. వాళ్ళు నా ప్రజలు. ఇశ్రాయేలీయులు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
31
మీరు నా గొర్రెలు. నేను మేపే గొర్రెలు. నా ప్రజలు! నేను మీ దేవుణ్ణి. ఇదే యెహోవా ప్రభువు సందేశం.>>
35
ఎదోం గురించి ప్రవచనం
1
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2
నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం తిప్పుకుని దాని గురించి ఈ విషయం చెప్పు,
3
<<యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, శేయీరు పర్వతమా! నేను నీకు వ్యతిరేకిని. నా చెయ్యి నీ మీద చాపి నిన్ను పాడుగా నిర్జనంగా చేస్తాను.
4
నీ పట్టణాలను నాశనం చేస్తాను. నువ్వు నిర్జనంగా ఉంటావు.>> అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.
5
ఇశ్రాయేలీయుల పట్ల నువ్వు ఎప్పుడూ పగతో ఉన్నావు. వారి విపత్తు సమయంలో, వారి దోష శిక్ష ముగింపు కాలంలో నువ్వు వారిని కత్తి పాలు చేశావు.
6
కాబట్టి నా జీవం తోడు. నేను నిన్ను రక్తపాతానికి గురి చేస్తాను. రక్తపాతం నిన్ను వెంటాడుతుంది. రక్తపాతాన్ని నువ్వు అసహ్యించుకోలేదు కాబట్టి రక్తపాతం నిన్ను వెంటాడుతుంది. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
7
వచ్చే పోయే వాళ్ళు అక్కడ లేకుండా చేసి, నేను శేయీరు పర్వతాన్ని పాడుగా నిర్జనంగా చేస్తాను.
8
అక్కడి పర్వతాలను చచ్చిన వాళ్ళతో నింపుతాను. నీ కొండల్లో లోయల్లో నీ వాగులన్నిటిలో వారు కత్తి పాలవుతారు.
9
నీ పట్టణాలను మళ్ళీ కట్టడం జరగదు. నువ్వు ఎప్పుడూ పాడుగా ఉంటావు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
10
యెహోవా అక్కడ ఉన్నా, ఆ రెండు రాజ్యాలూ ఆ రెండు ప్రాంతాలూ మనవే. మనం వాటిని స్వాధీనం చేసుకుందాం రండి. అని నీవు అన్నావు.
11
నా జీవం తోడు నువ్వు పగ పట్టి వారి పట్ల చూపిన అసూయకూ కోపానికీ నేను తగిన విధంగా నీ పట్ల వ్యవహరిస్తాను. నిన్ను శిక్షించేటప్పుడు వారికి నన్ను నేనే తెలియపరచుకుంటాను. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
12
అవి పాడైపోయాయి, మనం వాటిని దిగమింగేలా మన వశమయ్యాయి, అని నువ్వు ఇశ్రాయేలు పర్వతాలను గురించి పలికిన దూషణ మాటలన్నీ నేను, యెహోవాను విన్నాను.
13
నోరు పెద్దగా చేసుకుని నువ్వు నాకు విరోధంగా ఎన్నో సంగతులు చెప్పావు. నేను వాటిని విన్నాను.
14
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, లోకమంతా సంతోషించేటప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను.
15
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం పాడైపోవడం చూసి నువ్వు సంతోషించావు కాబట్టి నీకూ అలాగే చేస్తాను. శేయీరు పర్వతమా! నువ్వు పాడైపోతావు. ఎదోం దేశమంతా పాడైపోతుంది. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!
36
ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచనం
1
నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాలకు ఈ విషయం చెప్పు, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.
2
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే <<మీ గురించి శత్రువులు ఇలా చెప్పారు, <ఆహా! ప్రాచీన ఉన్నత స్థలాలు మా సొంతం అయ్యాయి.>
3
అందుచేత ప్రవచించి ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకోవాలని చూస్తూ మిమ్మల్ని పాడుచేశారు. మీరు ఇతర రాజ్యాల వశమయ్యారు. మిమ్మల్ని ఎగతాళి చేసేవారికి చులకన అయ్యారు.
4
కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా ప్రభువు మాట వినండి. యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. పర్వతాలతో కొండలతో వాగులతో లోయలతో పాడైన స్థలాలతో నిర్జనమైన పట్టణాలతో
5
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, చుట్టూ ఉన్న రాజ్యాలూ ఎదోం వారూ ద్వేష భావంతో ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నందుకు నేను తీవ్ర రోషంతో కచ్చితంగా చెప్పాను.
6
కాబట్టి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచనం చెప్పు. పర్వతాలతో కొండలతో వాగులతో లోయలతో ఈ మాట చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇతర రాజ్యాలు మిమ్మల్ని అవమానించారు. కాబట్టి రోషంతో కోపంతో దీన్ని వెల్లడిస్తున్నాను.
7
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాలు అవమానానికి గురి అవుతారు అని నేను మాట ఇస్తున్నాను.
8
ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలోనే ఇశ్రాయేలీయులైన నా ప్రజలు మీ దగ్గరికి వస్తారు. మీరు చిగురుపెట్టి వారి కోసం పళ్ళు కాస్తారు.
9
నేను మీ కోసం ఉన్నాను. నేను మిమ్మల్ని దయతో చూస్తాను. మిమ్మల్ని దున్ని, మీ మీద విత్తనాలు నాటుతారు.
10
మీ మీద ఎంతోమందిని, అంటే ఇశ్రాయేలీయులను విస్తరింప చేస్తాను. పట్టణాల్లో ప్రజలు నివసిస్తారు. శిథిలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది.
11
మీ పర్వతాల మీద మనుషులూ పశువులూ విస్తారంగా ఉండేలా చేస్తాను. అవి వర్ధిల్లుతూ ఫలిస్తాయి. పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలంగా చేసి, మునుపటికంటే ఎక్కువ అభివృద్ది కలిగిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
12
నా ఇశ్రాయేలీయులు మీ మీద నడుస్తారు. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు. మీరు వారికి వారసత్వంగా ఉంటారు. వాళ్ళ పిల్లలను ఇక ఎంత మాత్రం మీరు చంపరు.
13
ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, <దేశమా, నువ్వు మనుషులను తినేస్తున్నావు. నీ రాజ్యాల్లోని పిల్లలు చచ్చిపోయారు> అని ప్రజలు నీ గురించి చెప్పుకుంటున్నారు.
14
కాబట్టి నువ్విక మనుషులను తినవు. వారి చావుకు నీ దేశం ఏడవదు.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
15
<<నీ గురించి రాజ్యాలు ఇక ఎగతాళి చేయరు. వారి తిరస్కారం ఇక ఎన్నటికీ మీరు సహించనవసరం లేదు. మీ వలన ప్రజలు మరెన్నడూ పతనం కాబోరు.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
16
యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
17
<<నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించినప్పుడు వారి పద్ధతులతో పనులతో దాన్ని అపవిత్రపరచారు. వారి ప్రవర్తన, నా దృష్టిలో రుతుస్రావంలో ఉన్న స్త్రీ అపవిత్రతలాగా ఉంది.
18
కాబట్టి దేశంలో వారు చేసిన హత్యలకూ వారి విగ్రహాలతో దేశాన్ని అపవిత్రపరచినందుకు నేను నా క్రోధాన్ని వారి మీద కుమ్మరించాను.
19
వారి పద్ధతులను బట్టి వారి పనులను బట్టి వారిని శిక్షించి, నేను వేరే రాజ్యాల్లోకి వారిని వెళ్లగొట్టాను.
20
వారు తాము వెళ్లిన ప్రదేశాల్లో ప్రతి చోటా వారి మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళు నిజంగా యెహోవా ప్రజలేనా? ఆయన తన దేశంలో నుంచి ఆయన వాళ్ళను తోసేశాడు అని వారి గురించి చెప్పారు.
21
అయితే ఇశ్రాయేలీయులు వెళ్ళిన ప్రాంతాల్లో నా పవిత్ర నామం దూషణకు గురి అవుతూ ఉంటే నా పేరు గురించి నేను చింతించాను.>>
22
కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ విషయం చెప్పు. <<యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులారా, నేను మీకోసం దీన్ని చేయడం లేదు. మీరు వెళ్ళిన ప్రజల మధ్య మీ మూలంగా దూషణకు గురి అయిన నా పవిత్రమైన పేరు కోసమే చేస్తాను.
23
మీ మూలంగా ఇతర రాజ్యాల్లో దూషణకు గురి అయిన నా గొప్ప పేరు ఎంత పవిత్రమో నేను చూపిస్తాను. నేను పరిశుద్దునిగా మీరు నన్ను చూసినప్పుడు నేను యెహోవా ప్రభువునని వారు తెలుసుకుంటారు.>> ఇదే యెహోవా ప్రభువు సందేశం.
24
<<ఇతర రాజ్యాల్లో నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ యా దేశాల్లో నుంచి సమకూర్చి, మీ సొంత దేశంలోకి మిమ్మల్ని రప్పిస్తాను.
25
మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.
26
కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను.
27
నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను.
28
నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
29
మీ అపవిత్రనంతా పోగొట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీకు కరువు రానివ్వకుండా ధాన్యం సమృద్ధిగా పండేలా చేస్తాను.
30
చెట్లు విస్తారంగా కాయలు కాసేలా, పొలాలు బాగా పంట పండేలా చేస్తాను. అప్పటినుంచి కరువు గురించిన నింద ఇతర రాజ్యాల్లో మీకు రాదు.
31
అప్పుడు మీరు మీ చెడ్డ ప్రవర్తననూ మీ చెడ్డ పనులనూ గుర్తుకు తెచ్చుకుని మీ అసహ్య కార్యాలు బట్టి, మీ సొంత పాపాల బట్టి, మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.
32
మీ కోసం నేను ఇలా చేయడం లేదని తెలుసుకోండి. ఇదే యెహోవా ప్రభువు సందేశం. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడండి.
33
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీ ప్రతి పాపం నుంచి మిమ్మల్ని శుద్ధి చేసే రోజు మీ పట్టణాల్లో మిమ్మల్ని నివసించేలా చేస్తాను. పాడైపోయిన స్థలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది.
34
ఆ వైపుగా వెళ్ళే వారి దృష్టికి పాడుగా నిర్జనంగా కనిపించే భూమిని సేద్యం చేయడం జరుగుతుంది.
35
పాడైన భూమి ఏదెను తోటలా అయింది. పాడుగా నిర్జనంగా ఉన్న ఈ పట్టణాలకు గోడలున్నాయి. అవి ప్రజలతో నిండి ఉన్నాయి, అనుకుంటారు.
36
అప్పుడు నేను, యెహోవాను, పాడైపోయిన స్థలాలను మళ్ళీ కట్టించి, నాశనమైన స్థలాల్లో చెట్లు నాటించాననీ మీ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు. నేను యెహోవాను. నేనే ఈ విషయాన్ని వెల్లడించాను. నేను దాన్ని నెరవేరుస్తాను.>>
37
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే <<తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలీయులు నన్ను అడిగేలా చేస్తాను. గొర్రెల మందల్లాగా నేను వారిని విస్తరింపజేస్తాను.
38
నేను యెహోవానని వారు తెలుసుకునేలా అర్పణగా ఉన్న గొర్రెలంత విస్తారంగా, నియామక దినాల్లో యెరూషలేముకు వచ్చే గొర్రెలంత విస్తారంగా వారి పట్టణాల్లో మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించేలా నేను చేస్తాను.>>
37
ఎండిన ఎముకల లోయ
1
యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు.
2
ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి.
3
ఆయన <<నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?>> అని నన్నడిగితే <<ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు>> అన్నాను.
4
అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. <<ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి.
5
ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను.
6
మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.>>
7
ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి.
8
నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు.
9
అప్పడు యెహోవా నాతో <<నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి ఊపిరీ రా>>
10
ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచిస్తే, వాళ్ళకి ప్రాణం వచ్చింది. వాళ్ళు సజీవులై గొప్ప సేనగా నిలబడ్డారు.
11
అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు.
12
కాబట్టి ప్రవచనాత్మకంగా వాళ్ళతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా, మీ సమాధులను నేను తెరుస్తాను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకు వస్తాను.
13
నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తే
14
నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు బతికేలా నా ఆత్మను
మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
రెండు కర్రల ఉపమానం
15
యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
16
నరపుత్రుడా, నువ్వు ఒక కర్ర తీసుకుని దాని మీద, యూదావాళ్ళదీ, వాళ్ళ తోటివాళ్ళు ఇశ్రాయేలీయులదీ అని పేర్లు రాయి. మరో కర్ర తీసుకుని దాని మీద, ఎఫ్రాయిము కొమ్మ, అంటే యోసేపు వంశస్థులదీ, వాళ్ళ తోటి వాళ్ళు ఇశ్రాయేలీయులందరిదీ, అని రాయి.
17
అప్పుడు ఆ రెండూ నీ చేతిలో ఒక్కటయ్యేలా ఒక దానితో ఒకటి జోడించు.
18
వీటి అర్థం ఏంటి? అని నీ ప్రజలు నిన్నడిగితే, వాళ్ళకిలా చెప్పు.
19
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఎఫ్రాయిము చేతిలో ఉన్న కొమ్మ, అంటే ఏ కొమ్మ మీద ఇశ్రాయేలువారందరి పేర్లు, వాళ్ళ తోటివాళ్ళ పేర్లు, నేను ఉంచానో, ఆ యోసేపు అనే ఆ కొమ్మను యూదావాళ్ళ కొమ్మను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన కొమ్మగా చేస్తాను.
20
ఆ రెండు కొమ్మలను వాళ్ళ ఎదుట నువ్వు చేతిలో పట్టుకో.
21
వాళ్ళతో ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులు చెదరిపోయిన రాజ్యాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. వాళ్ళ సొంత దేశంలోకి నేను వాళ్ళను తెస్తాను.
22
వాళ్ళిక మీదట ఎన్నటికీ రెండు రాజ్యాలుగా రెండు జనాలుగా ఉండకుండాా చేస్తాను. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వాళ్ళను ఒకే రాజ్యంగా చేసి, వాళ్ళందరికీ ఒక్క రాజునే నియమిస్తాను.
23
తమ విగ్రహాల వలన గానీ తాము చేసిన నీచకార్యాల వలన గానీ ఎలాంటి పాపాల వలన గానీ తమను అపవిత్రం చేసుకోరు. వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చిన ప్రతి చోటు నుంచి నేను వాళ్ళను విడిపించి శుద్ధి చేస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను.
24
నా సేవకుడు, దావీదు వాళ్ళకి రాజుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వాళ్ళు నా విధుల ప్రకారం నడుస్తారు. నా కట్టడలను పాటించి ఆచరిస్తారు.
25
నేను నా సేవకుడు, యాకోబుకు ఇచ్చిన దేశంలో మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ పిల్లలూ వాళ్ళ పిల్లల పిల్లలూ అక్కడ ఎప్పుడూ నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎప్పటికీ వాళ్ళకి అధిపతిగా ఉంటాడు.
26
నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను. అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తాను. వాళ్ళ మధ్య నా పవిత్ర స్థలాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను.
27
నా నివాసం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను.
28
వాళ్ళ మధ్య నా పరిశుద్ధస్థలం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడినని ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు.
38
గోగు గురించి ప్రవచనం
1
యెహోవా నాతో ఇలా చెప్పాడు.
2
నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగు, అంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుని వైపు తిరిగి అతని గూర్చి ప్రవచించు.
3
<<ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుడవైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
4
నేను నిన్ను వెనక్కి తిప్పి నీ దవడలకు గాలాలు తగిలించి, నిన్నూ నీ సైన్యాన్నీ గుర్రాలనూ ఆయుధ సామగ్రి అంతటితో నీ రౌతులందరినీ కవచాలు, డాళ్లు ధరించి ఖడ్గాలు చేతపట్టుకున్న వారందనీ మహా సైన్యంగా పంపిస్తాను.
5
నీతో కూడ పర్షియా, కూషు, పూతు దేశాల వారినీ డాళ్ళు, శిరస్త్రాణాలు ధరించే వారినీ బయలుదేరదీస్తాను.
6
గోమెరు, అతని సైన్యం, ఉత్తరాన ఉండే తోగర్మా, అతని సైన్యం, ఇంకా అనేకమంది జనం నీతో వస్తారు.>>
7
<<నీవు సిద్ధంగా ఉండడమే కాక, నీతో కలిసిన ఈ సమూహమంతటిని సిద్ధపరచి వారికి నాయకత్వం వహించు.
8
చాల రోజుల తరువాత నీకు పిలుపు వస్తుంది. వివిధ జనాల్లో చెదరిపోయి, కొన్ని సంవత్సరాల తరవాత ఖడ్గం నుండి తప్పించుకుని, ఎప్పుడూ పాడై ఉండే ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించడానికి మళ్ళీ సమకూడిన ప్రజల దగ్గరికి, అంటే వివిధ జనాల్లోనుండి తిరిగి వచ్చి నిర్భయంగా నివసించే వారి దగ్గరికి నీవు వెళ్తావు.
9
గాలివాన వచ్చినట్టు, మేఘం కమ్మినట్టు నీవు ఆ దేశం మీదికి వస్తావు. నీవు, నీ సైన్యం, నీతో కలిసిన విస్తారమైన జనాలు ఆ దేశం మీద కమ్ముకుంటారు.>>
10
ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, ఆ కాలంలో నీ మనస్సులో చెడు తలంపులు కలుగుతాయి.
11
నువ్వు దురాలోచనతో ఇలా అనుకుంటావు, నేను ప్రాకారాలు, అడ్డగడియలు, ద్వారాలు లేని దేశం పైకి వెళ్తాను. విశ్రాంతిగా, నిర్భయంగా నివసించే వారి మీదికి వెళ్తాను.
12
గతంలో పాడై మళ్ళీ నివాసయోగ్యమైన స్థలాల మీదికి వెళ్ళి, వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకుంటాను. వివిధ జనాల్లోనుండి తిరిగివచ్చి, పశువులు, ఆస్తులు సంపాదించి, భూమి నట్టనడుమ నివసించే ప్రజల మీదికి వెళ్తాను.
13
సెబావారు, దదానువారు, తర్షీషు వర్తకులు, వారి యోధులందరు నిన్ను చూసి <<సొమ్ము దోచుకోడానికి వచ్చావా? కొల్లగొట్టడానికీ వెండి బంగారాలు, పశువులు, సరుకులు పట్టుకుపోడానికీ సైన్యం సమకూర్చుకుని వచ్చావా?>> అని అడుగుతారు.
14
<<కాబట్టి నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా జీవించే సమయం కనిపెట్టావు కదా?
15
దూరంగా ఉత్తర దిక్కునుండి నీవు, నీతోకూడ అనేకమంది ప్రజలు గుర్రాలెక్కి బహు విస్తారమైన సైన్యంతో వచ్చి
16
మేఘం భూమిని కమ్మినట్లు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పడతారు. చివరి రోజుల్లో అది జరుగుతుంది. గోగూ, అన్యజనాలు నన్ను తెలుసుకొనేలా నేను నా దేశం మీదికి నిన్ను రప్పించి నిన్నుబట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను.>>
17
ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే <<గతంలో ప్రతి సంవత్సరం నిన్ను వారిమీదికి రప్పిస్తానని నా సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చింది నేనే గదా?
18
ఆ రోజున, అంటే గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబోయే రోజున, నా కోపం విపరీతంగా మండుతుంది.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
19
<<కాబట్టి నేను రోషంతో, మహా రౌద్రంతో ఈ విధంగా ప్రకటించాను, ఇశ్రాయేలీయుల దేశంలో గొప్ప భూకంపం కలుగుతుంది.
20
సముద్రపు చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమిమీద పాకే పురుగులన్నీ, భూప్రజలంతా నాకు భయపడి వణుకుతారు. పర్వతాలు నాశనమౌతాయి, కొండ శిఖరాలు కూలిపోతాయి, గోడలన్నీ నేలకూలుతాయి.
21
నా పర్వతాలన్నిటిలో అతని మీదికి ఖడ్గం వచ్చేలా చేస్తాను. ప్రతి ఒక్కరి ఖడ్గం అతని సోదరుని మీద పడుతుంది.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
22
తెగులు, మరణం పంపి అతని మీదా అతని సైన్యం మీదా అతనితో ఉన్న జనాల మీదా భీకరమైన వర్షాన్నీ పెద్ద వడగండ్లనూ అగ్నిగంధకాలనూ కురిపించి అతనితో వాదిస్తాను.
23
అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.
39
1
నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు. <<ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాలకు అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
2
నిన్ను వెనక్కి తిప్పి నడిపించి దూరంగా ఉత్తరాన ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతాలకు రప్పిస్తాను.
3
నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని, కుడిచేతిలో ఉన్న బాణాలను కింద పడేలా చేస్తాను.
4
నువ్వూ నీ సైన్యమూ నీతో ఉన్న ప్రజలంతా ఇశ్రాయేలు పర్వతాల మీద కూలిపోతారు. నువ్వు నానా విధాలైన పక్షులకు, క్రూర జంతువులకు ఆహారమవుతావు.
5
నువ్వు నేల మీద పడి చనిపోతావు. ఈ మాట నేనే చెబుతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
6
ఇక నేను మాగోగు మీదికీ ద్వీపాల్లో నిర్భయంగా నివసించే వారి మీదికీ అగ్ని పంపుతాను, అప్పుడు నేను యెహోవానని వారు గ్రహిస్తారు.
7
నేను యెహోవానని అన్యజనాలు తెలుసుకొనేలా ఇక నా పవిత్రమైన పేరుకు నింద రాకుండా, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వెల్లడిస్తాను.
8
ఇదిగో అది రాబోతుంది. నేను చెప్పిన సమయంలో అది తప్పక జరుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
9
ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి.
10
ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
11
<<ఆ రోజుల్లో గోగువారిని పాతిపెట్టడం కోసం ఇశ్రాయేలు దేశంలో సముద్రానికి తూర్పుగా ప్రజలు ప్రయాణించే లోయలో నేనొక స్థలం ఏర్పాటు చేస్తాను. గోగును, అతని సైన్యాన్ని పాతిపెట్టినప్పుడు ఇక ప్రజలు ప్రయాణించడానికి వీలు ఉండదు. ఆ లోయకు హమోన్గోగు అనే పేరు పెడతారు.
12
దేశాన్ని శుద్ధీకరిస్తూ వారిని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులకు ఏడు నెలలు పడుతుంది.
13
ఆ దేశ ప్రజలంతా వారిని పాతిపెట్టగా నేను ఘనత పొందినపుడు ఆ ప్రజలు కూడా పేరు పొందుతారు. ఇదే యెహోవా వాక్కు.
14
దేశాన్ని శుద్ధీకరించడానికీ ఆ కళేబరాలను పాతిపెట్టడానికీ సంచారం చేస్తూ వెళ్ళి అక్కడక్కడా పడి ఉన్న శవాలను పాతిపెట్టడానికీ పనివారిని నియమిస్తారు. వారు ఆ పని ఏడు నెలల తరువాత చేస్తారు.
15
దేశంలో తిరుగుతూ చూసేవారు ఒక్క మనిషి శవం కనబడితే హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకూ అక్కడ ఏదైన ఒక ఆనవాలు పెడతారు.
16
హమోనా అనే పేరుతో ఒక పట్టణం ఉంటుంది. ఈవిధంగా వారు దేశాన్ని శుద్ధీకరిస్తారు.>>
17
<<నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, అన్ని జాతుల పక్షులకు, జంతువులకు ఈ కబురు పంపించు, ఇశ్రాయేలు పర్వతాల మీద నేను మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప బలికి నలుదిక్కుల నుండి బయలుదేరి రండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు.
18
బలిష్టుల మాంసం తింటారు. రాజుల రక్తమూ బాషానులో బలిసిన పొట్లేళ్ళ, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తమూ తాగుతారు.
19
మీరు సంతృప్తిగా కొవ్వు తింటారు, మత్తులో మునిగిపోయేటంతగా రక్తం తాగుతారు. ఇది నేను మీ కోసం వధించే బలి.
20
నేను ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని గుర్రాలను, రౌతులను, బలిష్టులను, సైనికులను మీరు కడుపు నిండుగా తింటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
21
నా గొప్పతనాన్ని అన్యజనాల్లో వెల్లడి చేస్తాను. నేను జరిగించిన శిక్షను, వారిపై నా హస్తాన్ని అన్యజనాలంతా చూస్తారు.
22
ఆ రోజునుండి నేనే తమ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలీయులు గ్రహిస్తారు.
23
ఇశ్రాయేలీయులు వారి దోషాన్ని బట్టే చెరలోకి వెళ్ళారనీ నా పట్ల వారు చేసిన ద్రోహాన్ని బట్టే నేను వారికి విరోధినై వారు కత్తిపాలయ్యేలా, బందీలుగా మారేలా చేశాననీ అన్యజనాలు తెలుసుకుంటారు.
24
వారి అపవిత్రత, అకృత్యాల వల్లనే నేను వారికి విరోధినై వారిపై ప్రతికారం చేశాను.
25
కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా పవిత్రమైన పేరును బట్టి రోషంతో యాకోబు సంతానాన్ని చెరలో నుండి తిరిగి రప్పిస్తాను. ఇశ్రాయేలీయుల మీద జాలి చూపుతాను.
26
వారు నాపట్ల చూపిన ద్రోహాన్ని బట్టి భరించిన అవమానాన్ని మరచిపోతారు. నేను అన్యజనాల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాల్లో నుండి రప్పించిన తరువాత వారు తమ దేశంలో క్షేమంగా, నిర్భయంగా నివసిస్తారు.
27
అప్పుడు అనేకమంది అన్యజనాల మధ్య వారిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను.
28
వారిని అన్యజనాల్లోకి చెరగా పంపి, వారిని అక్కడే ఉంచకుండా తిరిగి తమ దేశానికి సమకూర్చినదాన్ని బట్టి నేను తమ దేవుడైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
29
అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక ఎన్నటికీ వారికి నా ముఖం చాటు చేయను.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
40
నూతన మందిర నిర్మాణ పనులు
1
మనం బబులోను చెరలోకి వచ్చిన 25 వ సంవత్సరం మొదటి నెల పదో రోజున, అంటే పట్టణం ఆక్రమణకు గురైన 14 వ సంవత్సరం అదే రోజు యెహోవా హస్తం నా మీదకి వచ్చి నన్ను పట్టణానికి తోడుకు పోయాడు.
2
దేవుడు నన్ను తన దర్శనాలతో నింపి ఇశ్రాయేలు దేశంలోకి తెచ్చి, చాలా ఎత్తయిన కొండ మీద ఉంచాడు. దానికి దక్షిణాన పట్టణం లాంటిది ఒకటి నాకు కనబడింది.
3
అక్కడికి ఆయన నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ మెరిసే ఇత్తడిలాగా ఉండి, చేతిలో దారం, కొలిచే కర్ర పట్టుకుని నగర ద్వారంలో నిలబడిన ఒక మనిషి ఉన్నాడు.
4
ఆ మనిషి నాతో ఇలా అన్నాడు. <<నరపుత్రుడా, నేను నీకు చూపేవాటిని కళ్ళారా చూసి, చెవులార విని నీ మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపడానికే నిన్నిక్కడికి తెచ్చాను. నువ్వు చూసిన వాటన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజెయ్యి.>>
తూర్పు గుమ్మపు ద్వారం నుండి బయటి ఆవరణం వరకు
5
నేను చూసినప్పుడు మందిరం చుట్టూ ప్రాకారం ఉంది. ఆ మనిషి చేతిలో 3 మీటర్ల 20 సెంటి మీటర్ల కొలకర్ర ఉంది. ఆయన ఆ గోడ కొలతలు చూసినప్పుడు దాని వెడల్పు 3 మీటర్ల 20 సెంటి మీటర్ల ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
6
అతడు తూర్పు గుమ్మానికి వచ్చి దాని మెట్లెక్కి గుమ్మపు గడపను కొలిస్తే అది 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
7
కావలి గది పొడవు, వెడల్పులు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, కావలి గదులకు మధ్య 2 మీటర్ల 70 సెంటి మీటర్లు దూరం ఉంది. గుమ్మపు ద్వారం ప్రక్కనుండి మందిరానికి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు దూరం.
8
గుమ్మపు ద్వారానికి, మందిరానికి మధ్య 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
9
గుమ్మపు ద్వారం కూడా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. దాని స్తంభాల వెడల్పు ఒక్కొక్కటి ఒక మీటరు. ఆ ద్వారం మందిరం వైపుకు తిరిగి ఉంది.
10
తూర్పు గుమ్మపు ద్వారం లోపల ఇటు మూడు, అటు మూడు కావలి గదులు ఉన్నాయి. ఆ గదులన్నిటికీ ఒక్కటే కొలత. వాటి రెండు పక్కల ఉన్న స్తంభాలకు కూడా ఒక్కటే కొలత.
11
ఆ గుమ్మాల ప్రవేశంలో కొలత చూస్తే వాటి వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు, పొడవు ఏడు మీటర్లు.
12
కావలి గదుల ఎదుట రెండు వైపులా అర మీటరు ఎత్తున్న గోడ ఉంది. గదులు మాత్రం రెండు పక్కలా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఎత్తు ఉన్నాయి.
13
ఒక గది కప్పు నుండి రెండవ గది కప్పువరకూ గుమ్మాల మధ్య కొలిసినప్పుడు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు ఉంది. రెండు వాకిళ్ళ మధ్య కూడా అదే కొలత.
14
32 మీటర్లు ఎడంగా ఒక్కొక్క స్తంభం నిలబెట్టి ఉన్నాయి. గుమ్మం చుట్టూ ఉన్న ఆవరణం స్తంభాల వరకూ వ్యాపించింది.
15
బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారపు ఆవరణ వరకూ 27 మీటర్లు.
16
కావలి గదులకు గుమ్మాలకు, లోపల వాటికి మధ్య చుట్టూ ఉన్న గోడలకు ప్రక్కగదులకు కమ్ములు పెట్టిన కిటికీలున్నాయి. గోడలోని స్తంభాలకు కూడా కిటికీలున్నాయి. ప్రతి స్తంభం మీదా ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
బయటి ఆవరణం
17
అతడు నన్ను బయటి ఆవరణంలోకి తీసికెళ్ళాడు. అక్కడ గదులు, చప్టా ఉన్నాయి. చప్టా మీద 30 చిన్నగదులు ఉన్నాయి.
18
ఈ చప్టా గుమ్మాలదాకా ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది కింది చప్టా.
19
అప్పుడాయన కింది గుమ్మం నుండి లోపలి ఆవరణం వరకూ వెడల్పు కొలిచినప్పుడు అది తూర్పున, ఉత్తరాన 54 మీటర్లు ఉంది.
ఉత్తర గుమ్మం
20
తరవాత బయటి ఆవరణం ఉత్తరాన ఉన్న గుమ్మం పొడవు, వెడల్పులు,
21
దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కావలి గదులు, వాటి స్తంభాలను వాటి మధ్య గోడలను కొలవగా వాటి కొలత మొదటి గుమ్మం కొలతలాగానే, అంటే 27 మీటర్లు పొడవు, 13 మీటర్ల 50 సెంటి మీటర్లు వెడల్పు ఉన్నాయి.
22
ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్న వాటి కిటికీలు, వాటి మధ్యగోడలు తూర్పుద్వారం కొలతకు సమానంగా ఉంది. వాటికి ఏడు మెట్లు ఉన్నాయి. వాటికి ఎదురుగా ఆవరణ ఉంది.
23
ఉత్తర ద్వారానికి, తూర్పు ద్వారానికి, లోపలి ఆవరణకు వెళ్ళే రెండు గుమ్మాలున్నాయి. ఈ రెండు గుమ్మాల మధ్య దూరం అతడు కొలిచినప్పుడు అది 54 మీటర్లు ఉంది.
దక్షిణ గుమ్మం
24
అప్పుడాయన నన్ను దక్షిణం వైపుకు తోడుకుని వెళ్ళాడు. అక్కడ గుమ్మం ఒకటి ఉంది. దాని స్తంభాలను మధ్య గోడలను కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
25
వాటికి ఉన్నట్టుగానే దీని మధ్యగోడలకు కూడా చుట్టూ కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 25 మీటర్లు, వెడల్పు పదమూడున్నర మీటర్లు.
26
ఎక్కడానికి ఏడు మెట్లు, వాటికి ఎదురుగా కనిపించే మధ్య గోడలు ఉన్నాయి. దాని స్తంభాలపై కూడా ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
27
లోపటి ఆవరణకు దక్షిణపు వైపున ఒక గుమ్మం ఉంది. ఈ గుమ్మం నుండి దక్షిణ ద్వారం వరకూ 54 మీటర్లు.
లోపలి ఆవరణ గుమ్మం
28
అతడు దక్షిణ దిశగా లోపలి ఆవరణలోకి నన్ను తీసుకుపోయి దక్షిణపు గుమ్మాన్ని కొలిచాడు. దాని కొలత అదే.
29
దాని కావలి గదుల స్తంభాలు, మధ్య గోడలు పైన చెప్పిన కొలతకు సరిపోయాయి. దానికీ దాని చుట్టూ ఉన్న మధ్యగోడలకూ కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు పదమూడున్నర.
30
చుట్టూ మధ్యగోడల పొడవు పదమూడున్నర, వెడల్పు రెండున్నర మీటర్లు.
31
దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. దాని స్తంభాల మీద ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. వాటికి ఎనిమిది మెట్లున్నాయి.
32
తరవాత ఆయన నన్ను తూర్పు వైపున లోపలి ఆవరణలోకి తీసుకెళ్ళి దాని గుమ్మాన్ని కొలిచాడు. దానికి కూడా పైన చెప్పిన కొలతే.
33
దాని కావలి గదులకు స్తంభాలకు, మధ్యగోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
34
దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపు చూస్తున్నాయి. వాటి స్తంభాల మీద రెండు వైపులా ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
35
అప్పుడతడు ఉత్తరపు గుమ్మానికి నన్ను తీసుకెళ్ళి దాని కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
36
దాని కావలి గదులకు, స్తంభాలకు, దాని మధ్య గోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
37
అటూ ఇటూ ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్న దాని స్తంభాలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
మందిర వాకిలి దాని ఉపకరణాలు
38
ప్రతి గుమ్మం స్తంభాల దగ్గర వాకిలి ఉన్న ఒక గది ఉంది. ఆ గదుల్లో దహనబలి పశువుల మాంసం కడుగుతారు.
39
గుమ్మపు మంటపాల్లో రెండు వైపులా రెండేసి బల్లలున్నాయి. వీటి మీద దహనబలి, పాప పరిహారార్థ బలి, అపరాధపరిహారార్థ బలులకు పశువులను వధిస్తారు.
40
గుమ్మాల వాకిలి దగ్గర ఉత్తరాన మెట్లు ఎక్కే చోట రెండు వైపులా రెండేసి బల్లలున్నాయి. అంటే గుమ్మపు రెండు వైపులా నాలుగేసి బల్లలున్నాయి. వీటి పైన పశువులను వధిస్తారు.
41
దహనబలి పశువులు మొదలైన వాటిని వధించడానికి వాడే ఉపకరణాలు ఉంచే ఎనిమిది బల్లలు ఈ వైపు నాలుగు, ఆ వైపు నాలుగు మెట్ల దగ్గర ఉన్నాయి.
42
వాటి పొడవు సుమారు ఒక మీటరు, వెడల్పు సుమారు ఒక మీటరు, ఎత్తు అర మీటరు. వాటిని రాతితో మలిచారు.
43
ఈ బల్లల మీద బలి అర్పణ మాంసాన్ని ఉంచుతారు. చుట్టూ ఉన్న గోడకు ఒక అడుగు పొడుగున్న మేకులు తగిలించి ఉన్నాయి.
44
లోపటి గుమ్మం బయట, లోపలి ఆవరణంలో రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, మరొకటి దక్షిణం నుండి ఉత్తరం వైపుకు చూస్తున్నాయి.
45
అప్పుడతడు నాతో ఇలా అన్నాడు. <<దక్షిణం వైపు చూసే గది మందిరానికి కావలి కాసే యాజకులది.
46
ఉత్తరం వైపుకు చూసే గది బలిపీఠానికి కావలి కాసే యాజకులది. వీరు లేవీయుల్లో సాదోకు సంతతికి చెంది యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు.>>
47
అతడు ఆ ఆవరణాన్ని కొలిచాడు. అది పొడవు, వెడల్పు సమానంగా 54 మీటర్లతో నలుచదరంగా ఉంది. మందిరానికి ఎదురుగా బలిపీఠం ఉంది.
48
అతడు మందిర మంటపంలోకి నన్ను తీసుకొచ్చి మంటప స్తంభాలను ఒక్కొక్కటీ కొలిచినప్పుడు అది రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు ఉన్నాయి. దాని ప్రవేశ ద్వారం వెడల్పు 7 మీటర్లు ఉంది. దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం 1 మీటర్ 60 సెంటి మీటర్లు.
49
మంటపం పొడవు 11 మీటర్లు. దాని వెడల్పు సుమారు 6 మీటర్లు. దాని పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. దానికి ఇరువైపులా స్తంభాలున్నాయి.
41
మందిరం, దాని గోడలు
1
తరువాత అతడు నన్ను మందిరానికి తీసుకుని వచ్చి దాని పరిశుద్ధ స్థలం ప్రవేశానికి రెండు పక్కల ఉన్న స్తంభాలను కొలిచాడు. అవి ఒక్కొక్కటీ 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
2
ప్రవేశ ద్వారం వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు. తలుపు రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, దాని పొడవు 22 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
3
అతడు లోపలికి పోయి వాకిలి స్తంభాలను కొలిచినప్పుడు అది ఒక్కొక్కటి ఒక మీటరు వెడల్పు ఉన్నాయి. వాకిలి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు 3 మీటర్ల 80 సెంటి మీటర్లు ఉన్నాయి.
4
అతడు <<ఇది అతి పరిశుద్ధస్థలం>> అని చెప్పి దాన్ని కొలిచాడు. దాని పొడవు 11 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
5
తరువాత అతడు మందిరం గోడను కొలిచినప్పుడు అది, 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, మందిరం పక్కన ఉన్న మేడ గదులు ఒక్కొక్కటి సుమారు 2 మీటర్లు వెడల్పు ఉన్నాయి.
6
ఈ మేడగదులు మూడు అంతస్థులు ఉన్నాయి. ఆ విధంగా అవి ఒక్కొక్క అంతస్తుకు 30 గదులు. ఈ గదులు మందిరం గోడ మీద ఆనుకోలేదు. మందిరం చుట్టూ కట్టిన గోడతో కలిసి ఉన్నాయి.
7
ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొద్దీ వాటి వెడల్పు పెరుగుతూ వచ్చింది. అంటే పైకెక్కిన కొద్దీ మందిరం చుట్టూ ఉన్న మేడగదుల అంతస్థుల వెడల్పు పెరుగుతూ వచ్చింది కాబట్టి మందిరపు పైభాగం వెడల్పు కింది భాగం కంటే ఎక్కువగా ఉంది.
8
ఇంకా నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. ఆ పునాది ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
9
మేడగదుల బయట ఉన్న గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు. మందిరపు మేడగదుల పక్కన ఖాళీ స్థలం ఉంది.
10
గదుల మధ్య మందిరం చుట్టూ నాలుగు వైపులా 11 మీటర్లు వెడల్పున స్థలం విడిచిపెట్టారు.
11
మేడగదుల గుమ్మాలు ఖాళీగా ఉన్న స్థలం వైపు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరపు వైపు, మరొకటి దక్షిణం వైపు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ 2 మీటర్ల 70 సెంటి మీటర్లు వెడల్పు ఉంది.
12
ఆవరణం ఎదురుగా పడమటి వైపు ఒక కట్టడం ఉంది. దాని వెడల్పు 38 మీటర్లు, దాని గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, గోడ పొడవు 49 మీటర్లు.
13
మందిరం పొడవును కొలిచినప్పుడు అది 44 మీటర్లు ఉంది. ఆ కట్టడం, దాని గోడల కొలత 54 మీటర్లు.
14
తూర్పు వైపు మందిరం పొడవు 54 మీటర్లు.
15
మందిరం వెనక భాగంలోని ఖాళీ స్థలానికి ఎదురుగా ఒక కట్టడం ఉంది. దాని రెండు వైపులా ఉన్న వసారాల పొడవు 54 మీటర్లు.
16
అప్పుడా వ్యక్తి గర్భాలయం, ఆవరణపు మంటపాలు, గడపలు, కమ్ములు ఉన్న కిటికీలను, మూడు అంతస్థుల చుట్టూ ఉన్న వసారాలను కొలిచాడు. గడపలకెదురుగా నేల నుండి కిటికీలు చెక్కతో కప్పి ఉన్నాయి.
17
గుమ్మాలకు పైన మందిరానికి బయట, లోపల ఉన్న గోడంతా, చుట్టూ గోడ పైనా, కెరూబులు, ఖర్జూరపు చెట్టు చెక్కి ఉన్నాయి.
18
రెండు కెరూబుల మధ్య ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ప్రతి కెరూబుకు రెండేసి ముఖాలున్నాయి.
19
ఇటు ఖర్జూరపు చెట్టు వైపున మనిషి ముఖం, అటు ఖర్జూరపు చెట్టు వైపున సింహం ముఖం ఉన్నాయి. మందిరం అంతా ఆ ప్రకారమే ఉన్నాయి.
20
నేల మొదలుకుని గుమ్మం పైవరకూ మందిరపు గోడకు కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
21
మందిరపు ద్వారబంధాలు నలు చదరంగా ఉన్నాయి. పరిశుద్ధస్థలపు ద్వారబంధాలు కూడా అలాగే ఉన్నాయి.
22
బలిపీఠం చెక్కతో చేశారు. దాని ఎత్తు 1 మీటరు 60 సెంటి మీటర్లు, పొడవు ఒక మీటరు. దాని పీఠం, మూలలు, పక్కలు చెక్కతో చేసినవి. అతడు నాతో <<ఇది యెహోవా సముఖంలో ఉండే బల్ల>> అని చెప్పాడు.
23
మందిరానికి, పరిశుద్ధ స్థలానికి రెండు గుమ్మాలున్నాయి.
24
ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది.
25
అంతే కాక గోడల మీద ఉన్నట్టుగా మందిరపు గుమ్మాల మీద కూడా కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి వసారాకి విచిత్రంగా చేసిన చెక్క చూరు ఉంది.
26
మరియు వసారాకి, రెండు వైపులా గోడలకు, మేడగదులకు రెండు వైపులా కమ్ములు వేసిన కిటికీలు, ఖర్జూరపు చెట్ల ఆకారాలు చెక్కి ఉన్నాయి.
42
యాజకుల గదులు
1
ఆ మనిషి ఉత్తరం వైపుకు నన్ను నడిపించి బయటి ఆవరణలోకి తోడుకుని వచ్చి ఖాళీ స్థలానికీ ఉత్తరాన ఉన్న కట్టడానికీ ఎదురుగా ఉన్న గదుల దగ్గర నిలబెట్టాడు.
2
ఆ కట్టడం గుమ్మం ఉత్తరం వైపుకు తిరిగి 54 మీటర్ల పొడవు, 27 మీటర్ల వెడల్పు ఉంది.
3
ఆ గదులు పరిశుద్ధ స్థలానికి 11 మీటర్లు దూరంలో ఉండి బయటి ఆవరణపు తాపడం చేసిన నేలకు ఎదురుగా మూడో అంతస్థులోని వసారాలు ఒకదాని కొకటి ఎదురుగా ఉన్నాయి.
4
ఆ గదులకు ఎదురుగా 5 మీటర్ల 40 సెంటి మీటర్ల వెడల్పు, 54 మీటర్ల పొడవు గల వసారా ఉంది. ఆ గదుల గుమ్మాలన్నీ ఉత్తరం వైపుకు చూస్తున్నాయి.
5
పైన గదులకు వసారాలుండడం వలన వాటి ఎత్తు తక్కువై మధ్యగదులు ఇరుకుగా ఉన్నాయి.
6
మూడో అంతస్థులో ఉన్న గదులకు ఆవరణకు ఉన్న స్తంభాలు లేవు కాబట్టి అవి కింద గదులకంటే, మధ్య గదులకంటే చిన్నవిగా కట్టి ఉన్నాయి.
7
గదుల వరుసను బట్టి బయటి ఆవరణ వైపు గదులకు ఎదురుగా 27 మీటర్ల పొడవు ఉన్న ఒక గోడ ఉంది.
8
బయటి ఆవరణలోని గదుల పొడవు 27 మీటర్లు ఉంది గాని మందిరం ముందటి ఆవరణ 54 మీటర్ల పొడవు ఉంది.
9
ఈ గదులు గోడకింద నుండి లేచినట్టుగా కనిపిస్తున్నాయి. బయటి ఆవరణలో నుండి వాటిలో ప్రవేశించడానికి తూర్పువైపున మార్గం ఉంది.
10
ఖాళీ స్థలానికి, కట్టడానికి ఎదురుగా ఆవరణపు గోడ వారున తూర్పువైపు కొన్ని గదులున్నాయి.
11
వాటి ఎదుట ఉన్న మార్గం ఉత్తరం వైపు ఉన్న గదుల మార్గం లాగా ఉంది. వాటి కొలతల ప్రకారమే ఇవి కూడా కట్టి ఉన్నాయి. వీటి ద్వారాలు కూడా వాటి లాగానే ఉన్నాయి.
12
దక్షిణం వైపు గదుల తలుపుల్లాగా వీటి తలుపులు కూడా ఉన్నాయి. ఆ మార్గం ఆవరణంలోకి పోయేవారికి తూర్పుగా ఉన్న గోడ ఎదురుగానే ఉంది.
13
అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. <<ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు పవిత్రమైన యాజకులవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధమైన ఆహారాన్ని తింటారు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను, అంటే నైవేద్యాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని, అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని ఉంచుతారు. ఆ స్థలం అతి పరిశుద్ధం.
14
యాజకులు లోపల ప్రవేశించేటప్పుడు పరిశుద్ధ స్థలాన్ని విడిచి బయటి ఆవరణంలోకి పోకుండా అక్కడే తాము పరిచర్యకు ధరించే వస్త్రాలను ఉంచాలి. అవి ప్రతిష్ఠితాలు కాబట్టి ప్రజలకు చెందిన దేనినైనా వారు తాకాలంటే వారు వేరే బట్టలు ధరించుకోవాలి.>>
15
అతడు లోపలి మందిరాన్ని కొలవడం ముగించి నన్ను బయటికి తీసుకొచ్చి తూర్పువైపు తిరిగి ఉన్న గుమ్మానికి వచ్చి చుట్టూ కొలిచాడు.
16
తూర్పు వైపున కొలకర్రతో కొలిచినప్పుడు అది 270 మీటర్లు ఉంది.
17
ఉత్తరం వైపు 270 మీటర్లు,
18
దక్షిణం వైపు 270 మీటర్లు,
19
పడమర వైపు 270 మీటర్లు ఉంది.
20
ఆవిధంగా అతడు నాలుగు వైపులా కొలిచాడు. పవిత్రమైన, పవిత్రం కాని స్థలాలను వేరు చేయడానికి దానిచుట్టూ నాలుగు వైపులా 270 మీటర్లు ఉన్న నలుచదరపు గోడ కట్టి ఉంది.
43
దేవుని మహిమ తిరిగి రావడం
1
తరువాత ఆ మనిషి తూర్పువైపు తిరిగి ఉన్న గుమ్మానికి నన్ను తోడుకుని వచ్చాడు.
2
అప్పుడు నాకు ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడింది. దానినుండి పుట్టిన ధ్వని విస్తారమైన జలాల ధ్వనిలాగా వినబడింది. ఆయన మహిమ వలన భూమి ధగధగా మెరిసిపోయింది.
3
నాకు కనబడిన ఆ దర్శనం, ఆయన పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నేను చూసిన దర్శనం లాగా ఉంది. కెబారు నది దగ్గర నాకు కనబడిన లాంటి దర్శనాలు చూసి నేను సాగిలపడ్డాను.
4
తూర్పు వైపు తిరిగి ఉన్న గుమ్మం లోనుండి యెహోవా మహిమ తేజస్సు మందిరంలోకి ప్రవేశించింది.
5
ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణలోకి తెచ్చినప్పుడు యెహోవా మహిమ తేజస్సుతో మందిరం నిండి ఉంది.
6
మందిరంలో నుండి ఒకరు నాతో మాటలాడినట్టు నాకు వినబడింది. అప్పుడు నాదగ్గర నిలిచి ఉన్న వ్యక్తి నాతో ఇలా అన్నాడు.
7
<<నరపుత్రుడా, ఇది నా సింహాసన స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎల్లప్పుడూ నివసిస్తాను. ఇకమీదట వారు తమ అపనమ్మకత్వం వలనా తమ రాజుల కళేబరాలకు ఉన్నత స్థలాలను కట్టి పూజలు చేయడం వలనా వారు గాని, వారి రాజులు గాని నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయరు.
8
నాకు, వారికి మధ్య ఒక్క గోడ మాత్రం ఉంచి నా గుమ్మాల పక్కనే వారి గుమ్మాలు, నా ద్వారబంధాల పక్కనే వారి ద్వారబంధాలు నిలబెట్టి, నా పవిత్రమైన పేరుకు ఇక ముందు అవమానం కలిగించరు. వారు చేసిన అకృత్యాల చేత నా పవిత్రమైన పేరును దూషణపాలు చేశారు కాబట్టి నేను ఆగ్రహంతో వారిని నాశనం చేశాను.
9
ఇకనుండి వారు అపనమ్మకత్వం మాని, తమ రాజుల విగ్రహాలను నా ఎదుట నుండి దూరంగా తొలగిస్తే వారి మధ్యలో నేను ఎల్లకాలం నివసిస్తాను.
10
కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషాలను బట్టి సిగ్గుపడేలా ఈ మందిరం గురించి వారికి వివరించు. వారు దాని నిర్మాణాన్ని జాగ్రత్తగా గమనించాలి.
11
తాము చేసినవాటిని బట్టి వారు పశ్చాత్తాపపడితే, మందిర నిర్మాణాన్ని, దాని వివరాలను, ప్రవేశ, నిర్గమ మార్గాలను, వాటి మర్యాదలను, విధులను, దాని ఆచారాలను, పద్ధతులను వారికి వివరించి, వారు ఆ ఆచారవిధులన్నిటికి లోబడి ఆచరించేలా వారు చూస్తూ ఉండగా వాటిని రాయించు.>>
12
ఆ మందిరం గూర్చిన పద్ధతి ఏమంటే, పర్వతం మీద దానితో చేరి ఉన్న స్థలమంతా అతి పవిత్రం. ఇదే మందిరం గూర్చిన విధి.
బలిపీఠం
13
మందిర ఆవరణం కొలతల ప్రకారం బలిపీఠం కొలతలు ఇవి. దాని అడుగుభాగం ఎత్తు అర మీటరు. దాని డొలుపు అర మీటరు ఎత్తు, అర మీటరు వెడల్పు. దాని చుట్టూ దాని అంచు ఎనిమిది సెంటిమీటర్ల వెడల్పుతో విచిత్రమైన పనితో ఉండాలి.
14
నేల మీద బలిపీఠం అడుగుభాగం నుండి కింది చూరుదాకా దాని ఎత్తు ఒక మీటరు. వెడల్పు అర మీటరు. ఈ చిన్న చూరు నుండి పెద్ద చూరు వరకూ 2 మీటర్ల 10 సెంటి మీటర్లు. దాని వెడల్పు అర మీటరు.
15
బలిపీఠం పొయ్యి ఎత్తు 2 మీటర్ల 10 సెంటి మీటర్లు. ఆ అగ్నిగుండం నుండి పైకి నాలుగు కొమ్ములున్నాయి.
16
అది నలు చదరంగాఆరు మీటర్ల 50 సెంటి మీటర్లు కొలత కలిగి ఉంది.
17
పై చూరు పొడవు, వెడల్పు అన్ని వైపులా ఏడు మీటర్ల 60 సెంటి మీటర్లు. దాని చుట్టూ ఉన్న అంచు ఎనిమిది సెంటిమీటర్లు. దాని చుట్టూ కొలత అర మీటరు. దానికి తూర్పు వైపున మెట్లు ఉన్నాయి.
18
అతడు నాతో ఇంకా ఇలా అన్నాడు<<నరపుత్రుడా, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ బలిపీఠం కట్టిన తరవాత దాని మీద రక్తం చల్లి, దహనబలులు అర్పించడానికి జరిగించ వలసిన పద్ధతులు ఇవి.
19
ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, పరిచర్య చేయడానికి నా సన్నిధికి వచ్చే సాదోకు సంతానమైన యాజకులకు పాప పరిహారార్థబలి అర్పించడానికి ఒక కోడెను ఇవ్వాలి.
20
వారు దాన్ని పాప పరిహారార్థబలిగా అర్పించి, బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దాని రక్తంలో కొంచెం తీసి దాని నాలుగు కొమ్ముల మీదా దాని చూరు నాలుగు మూలల మీదా చుట్టూ ఉన్న అంచు మీదా పూయాలి.
21
తరవాత పాప పరిహారార్థ బలి అయిన ఎద్దును తీసి పరిశుద్ధ స్థలం అవతల మందిరంలోని నియమిత స్థలంలో దాన్ని దహించాలి.
22
రెండో రోజు పాప పరిహారార్థబలిగా ఏ లోపం లేని ఒక మేకపిల్లను అర్పించాలి. కోడెను అర్పించినప్పుడు చేసినట్టే మేకపిల్ల రక్తంతో కూడా బలిపీఠానికి పాపపరిహారం చేయాలి.
23
ఆ విధంగా పాప పరిహారం చేసిన తరవాత ఏ లోపం లేని కోడెను, ఏ లోపం లేని పొట్టేలును అర్పించాలి.
24
వాటిని యెహోవా సన్నిధికి తెచ్చి యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పించాలి.
25
వారు వరసగా ఏడు రోజులు పాప పరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను, ఏ లోపం లేని ఒక కోడెను, ఏ లోపం లేని ఒక పొట్టేలును సిద్ధపరచాలి.
26
ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ, దాన్ని శుద్ధి చేస్తూ ప్రతిష్ఠించాలి.
27
ఆ రోజులు అయిన తరవాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు, సమాధానబలులు అర్పించినప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
44
పాలకుడు, లేవీవారు, యాజులు
1
ఆ మనిషి నన్ను తూర్పువైపు తిరిగి ఉన్న పరిశుద్ధ స్థలం బయటి ప్రవేశద్వారానికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం మూసి ఉంది.
2
అప్పుడు యెహోవా నాతో ఈ మాట చెప్పాడు. <<ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మంలో నుండి లోపలికి ప్రవేశించాడు కాబట్టి ఏ మనిషీ ప్రవేశింపకుండేలా అది గట్టిగా మూసి ఉంది. ఇక అది ఎన్నటికీ తీయకూడదు.
3
ఇశ్రాయేలు పాలకుడు ఆహారం భుజించేటప్పుడు యెహోవా సన్నిధిలో అక్కడ కూర్చుంటాడు. అయితే అతడు ఈ ద్వారం వసారాగుండా ప్రవేశించి వసారా గుండా బయటికి వెళ్ళాలి.>>
4
తరవాత అతడు నన్ను ఉత్తర ప్రవేశద్వారం గుండా మందిరం ముందు భాగానికి తీసుకు వచ్చాడు. అంతలో మందిరం యెహోవా మహిమ తేజస్సుతో నిండి ఉండడం చూసి నేను సాగిలపడ్డాను.
5
యెహోవా నాతో ఇలా చెప్పాడు. <<నరపుత్రుడా, యెహోవా మందిరం గురించిన కట్టడలు, విధులు అన్నిటిని నేను నీకు తెలియజేస్తున్నాను, నీవు శ్రద్ధగా గమనించు. ఈ సంగతులన్నిటిని నీ కళ్ళతో చూసి చెవులతో ఆలకించు. మందిరం బయటికి పోయే, లోపలి వచ్చే మార్గాలను గూర్చి ఆలోచించు.
6
తిరుగుబాటు చేసే ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, <ఇశ్రాయేలీయులారా, ఇంతవరకూ మీరు చేసిన అకృత్యాలు చాలు.
7
మీరు నాకు ఆహారం, కొవ్వు, రక్తం, అర్పించే సమయాల్లో హృదయంలో శరీరంలో సున్నతి లేని అన్యులను నా పరిశుద్ధ స్థలంలోకి తీసుకువచ్చారు. వారు మీ అకృత్యాలను ఆధారం చేసుకుని దాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగపరిచారు.
8
నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన ఆవరణను మీరు కాపాడకపోగా, ఆ బాధ్యతను అన్యులకు అప్పగించారు.>
9
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తూ ఉండి హృదయంలో, శరీరంలో సున్నతి లేని అన్యుల్లో ఎవరూ నా పరిశుద్ధస్థలాల్లో ప్రవేశింపకూడదు.
10
ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహాలను అనుసరించినప్పుడు, వారితోబాటు నాకు దూరమైన లేవీయులు తమ దోషాన్ని భరించాలి.
11
వారు నా పరిశుద్ధ స్థలాల్లో పరిచర్య చేసేవారు, నా మందిరానికి ద్వారపాలకులుగా మందిర పరిచర్య జరిగించేవారు, ప్రజల పక్షంగా వారే దహనబలి పశువులను వధించి, బలులు అర్పించేవారు. పరిచర్య చేయడానికి ప్రజల సమక్షంలో నిలిచేవారు వారే.
12
అయితే విగ్రహాల ఎదుట ప్రజలకు పరిచారకులై ఇశ్రాయేలీయులు పడిపోయి పాపం చేయడానికి వారు కారకులయ్యారు కాబట్టి నేను వారికి విరోధినయ్యాను. కాబట్టి వారు తమ దోషాన్ని భరిస్తారు.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
13
<<వారు యాజకత్వం జరిగించడానికి నా సన్నిధికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. దానికి బదులు వారు చేసిన అకృత్యాలకు కలిగే అవమానాన్ని, శిక్షను వారనుభవిస్తారు.
14
అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని, దానిలో జరుగు పనులన్నిటిని పర్యవేక్షిస్తూ దాన్ని కాపాడేవారిగా నేను వారిని నియమిస్తున్నాను.
15
ఇశ్రాయేలీయులు నన్ను తోసిపుచ్చినపుడు నా పరిశుద్ధ స్థలాన్ని కాపాడి కనిపెట్టే లేవీయులైన సాదోకు సంతతి యాజకులు పరిచర్య చేయడానికి నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో నిలబడి, కొవ్వును, రక్తాన్ని నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
16
వారే నా పరిశుద్ధస్థలంలో ప్రవేశిస్తారు. వారే నా బల్ల దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తారు. వారే నేనప్పగించిన దాన్ని కాపాడతారు.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
17
<<వారు లోపలి ఆవరణ గుమ్మాల్లోకి వచ్చేటప్పుడు జనపనార బట్టలు ధరించుకోవాలి. వారు ఆ గుమ్మాల గుండా మందిరంలో ప్రవేశించి పరిచర్య చేసేటప్పుడు బొచ్చుతో చేసిన బట్టలు ధరింపకూడదు.
18
అవిసెనార పాగాలు ధరించుకుని నడుములకు జనప నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేది దేనినీ వారు ధరింపకూడదు.
19
బయటి ఆవరణంలోని ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు తమ ప్రతిష్ఠిత వస్త్రాలు తీసివేసి, వాటిని ప్రతిష్టితమైన గదుల్లో ఉంచి వేరే వస్త్రాలు ధరించాలి. ఆ విధంగా వారి ప్రతిష్టిత వస్త్రాలను తాకిన ప్రజలు కూడా ప్రతిష్ఠితం కాకుండా ఉంటారు.
20
వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు. తలవెండ్రుకలు పొడవుగా పెరగనియ్యకుండా వాటిని కత్తిరించాలి.
21
లోపలి ఆవరణంలో ప్రవేశించేటపుడు ఏ యాజకుడూ ద్రాక్షారసం తాగకూడదు.
22
వారు విధవరాళ్ళనైనా భర్త విడిచిపెట్టినవారినైనా పెళ్ళి చేసుకోకూడదు. ఇశ్రాయేలీయుల వంశాల్లోని కన్యలనైనా, యాజకులకు భార్యలై విధవరాళ్ళుగా ఉన్నవారినైనా చేసుకోవచ్చు.
23
ప్రతిష్ఠితమైన దానికి, ప్రతిష్టితం కానిదానికి మధ్య, పవిత్రమైనదానికి, అపవిత్రమైనదానికి మధ్య తేడా ఏమిటో వారు నా ప్రజలకు నేర్పాలి.
24
ప్రజల వ్యాజ్యాల్లో వారు నా విధులను బట్టి వారికి తీర్పు తీరుస్తారు. నేను నియమించిన విధులను బట్టి, కట్టడలను బట్టి, నా పండగలను జరుపుతారు. నా విశ్రాంతి దినాలను ఆచరిస్తారు.
25
తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, సోదరుడు, పెళ్ళి కాని సోదరి, వీరి శవాలు తప్ప మరే ఇతర శవాలను ముట్టినా వారు అపవిత్రులవుతారు.
26
ఒక యాజకుడు ఆ విధంగా మైల పడితే ప్రజలు ఏడు రోజులు లెక్కించాలి.
27
అతడు పరిచర్య చేయడానికి లోపలి ఆవరణంలోని పరిశుద్ధస్థలానికి రావడానికి ముందు అతడు తనకోసం పాప పరిహారార్థబలి అర్పించాలి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
28
వారికి స్వాస్థ్యం ఇదే. నేనే వారికి స్వాస్థ్యం. ఇశ్రాయేలీయుల్లో వారికెంత మాత్రం స్వాస్థ్యం ఇవ్వకూడదు. నేనే వారికి స్వాస్థ్యం.
29
నైవేద్యాలు, పాప పరిహారార్థ బలిమాంసం, అపరాధ పరిహారార్థ బలిమాంసం వారికి ఆహారమవుతాయి. ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్టించే వస్తువులన్నీ వారివే.>>
30
<<మీ ప్రతిష్ఠితార్పణల్లో, తొలిచూలు వాటిలో, ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైనవి యాజకులవి అవుతాయి. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగేలా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలి.
31
పక్షుల్లో, పశువుల్లో దానికదే చచ్చినది గాని, మృగాలు చీల్చి చంపినవి గానీ యాజకులు తినకూడదు.>>
45
భూమి విభజన
1
<<మీరు చీట్లు వేసి దేశాన్ని పంచుకునేటప్పుడు భూమిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల 800 మీటర్ల వెడల్పు ఉండాలి. ఈ సరిహద్దుల్లో ఉన్న భూమి ప్రతిష్ఠితమౌతుంది.
2
దానిలో పరిశుద్ధ స్థలానికి 270 మీటర్ల నలుచదరమైన స్థలం ఏర్పాటు చేయాలి. దానికి నాలుగు వైపులా 27 మీటర్ల ఖాళీ స్థలం విడిచిపెట్టాలి.
3
ఈ స్థలం నుండి 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు గల భూమి కొలవాలి. అందులో పవిత్రమైన అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది.
4
యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలం అవుతుంది. అది వారి ఇళ్ళకోసం ఏర్పాటై, పరిశుద్ధ స్థలానికి ప్రతిష్ఠితంగా ఉంటుంది. మందిరంలో పరిచర్య చేసే లేవీయులు ఇళ్ళు కట్టుకుని నివసించేలా
5
వారికి స్వాస్థ్యంగా 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు 5 కిలో మీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతంలో వారి నివాస స్థలాలు ఉంటాయి.
6
పట్టణం కోసం 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతం ఏర్పాటు చేయాలి. అది ప్రతిష్ఠిత స్థలానికి ఆనుకుని ఉండాలి. ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనా అది చెందుతుంది.
7
ప్రతిష్ఠిత భాగానికి పట్టణానికి ఏర్పాటైన భాగానికి పశ్చిమంగా, తూర్పుగా, రెండు వైపులా రాజు కోసం భూమిని కేటాయించాలి. పశ్చిమం నుండి తూర్పు వరకూ దాన్ని కొలిచినప్పుడు అది ఒక గోత్రస్థానానికి సరిపడిన పొడవు కలిగి ఉండాలి. రాజు నా ప్రజలను బాధింపక వారి గోత్రాల ప్రకారం దేశమంతటినీ ఇశ్రాయేలీయులకు పంచి ఇచ్చేందుకు
8
అది ఇశ్రాయేలీయుల్లో అతని స్వాస్త్యమైన భూమిగా ఉంటుంది.>>
9
యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు<<ఇశ్రాయేలీయుల పాలకులారా, ఇంక చాలు! మీరు జరిగించిన బలాత్కారం, దోపిడి చాలించి నా ప్రజల సొమ్మును దోచుకోక నీతి న్యాయాలను అనుసరించండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
10
నిక్కచ్చి త్రాసు, నిక్కచ్చి పడి, నిక్కచ్చి తూమును వాడండి. ఒక్కటే కొలత, ఒక్కటే తూము మీరుంచుకోవాలి.
11
తూము పందుంలో పదో పాలుగా ఉండాలి. మీ కొలతకు పందుం ప్రమాణంగా ఉండాలి.
12
ఒక తులానికి 20 చిన్నాలు, ఒక మీనాకు 20 తులాల ఎత్తు, 25 తులాల ఎత్తు, 15 తులాల ఎత్తు ఉండాలి.
అర్పణలు, పండుగలు, ప్రత్యేక దినాలు
13
ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారంగా చెల్లించాలి. పందుం గోదుమల్లో తూములో ఆరో భాగం, పందుం యవలులో తూములో ఆరో భాగం చెల్లించాలి.
14
తైలం చెల్లించే విధం ఏమిటంటే 180 పళ్ల నూనెలో ఒక పడి, ముప్పాతిక చొప్పున చెల్లించాలి. తూము 180 పళ్లు పడుతుంది.
15
ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి నైవేద్యానికీ దహనబలికీ సమాధానబలికీ బాగా మేపిన గొర్రెల్లో మందకు రెండువందల్లో ఒక గొర్రెను తేవాలి.
16
దేశ ప్రజలందరికీ ఇశ్రాయేలీయుల పాలకునికి చెల్లించాల్సిన ఈ అర్పణ తేవాల్సిన బాధ్యత ఉంది.
17
పండగల్లో, అమావాస్య రోజుల్లో, విశ్రాంతిదినాల్లో, ఇశ్రాయేలీయులు సమావేశమయ్యే నియమిత సమయాల్లో వాడే దహనబలులను, నైవేద్యాలను, పానార్పణలను సరఫరా చేసే బాధ్యత పాలకునిదే. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాప పరిహారార్థ బలిపశువులనూ నైవేద్యాలనూ దహనబలులనూ సమాధాన బలిపశువులనూ సిధ్దపరచాలి.>>
18
ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే <<మొదటి నెల మొదటి రోజున ఏ లోపం లేని కోడెను తెచ్చి పరిశుద్ధ స్థలం కోసం పాప పరిహారార్థబలి అర్పించాలి.
19
ఎలాగంటే యాజకుడు పాప పరిహారార్థబలి పశువు రక్తం కొంచెం తీసి, మందిరపు ద్వారబంధాల మీదా బలిపీఠం చూరు నాలుగు మూలల మీదా లోపటి ఆవరణం వాకిలి ద్వారబంధాల మీదా చల్లాలి.
20
అనుకోకుండా లేక తెలియక పాపం చేసిన ప్రతి ఒక్కరి కోసం మందిరానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతి నెల ఏడో రోజున ఆ విధంగా చేయాలి.
21
మొదటి నెల 14 వ రోజున పస్కాపండగ ఆచరించాలి. ఏడు రోజులు దాన్ని జరుపుకోవాలి. మీరు పులియని ఆహారం తినాలి.
22
ఆ రోజున పాలకుడు తన కోసం, దేశ ప్రజలందరి కోసం పాప పరిహారార్థబలిగా ఒక ఎద్దును అర్పించాలి.
23
ఏడు రోజులు అతడు ఏ లోపం లేని ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను తీసుకుని, రోజుకొకటి చొప్పున ఒక ఎద్దును, ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పించాలి. అలాగే ప్రతి రోజూ ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థబలిగా అర్పించాలి.
24
ఒక్కొక్క ఎద్దుకు, పొట్టేలుకు ఒక తూము పిండితో నైవేద్యం చేయాలి. ఒక్క తూముకి మూడు పళ్ల నూనె ఉండాలి.
25
ఏడో నెల 15 వ రోజున పండగ జరుగుతూ ఉండగా యాజకుడు ఏడు రోజులు పాప పరిహారార్థబలి విషయంలో, దహనబలి విషయంలో, నైవేద్యం విషయంలో, నూనె విషయంలో ఆ ప్రకారమే చేయాలి.>>
46
1
ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే <<తూర్పు వైపు తిరిగి ఉన్న లోపటి ఆవరణద్వారం ఆరు పని దినాలు మూసి ఉంచి, విశ్రాంతి రోజున, అమావాస్య రోజున తెరవాలి.
2
పాలకుడు బయటి వసారా గుమ్మం గుండా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధాల దగ్గర నిలబడినప్పుడు, యాజకులు దహనబలి పశువులను, సమాధానబలి పశువులను అతని కోసం సిద్ధపరచాలి. అతడు గుమ్మం దగ్గర నిలబడి ఆరాధన చేసిన తరవాత బయటికి వెళ్తాడు. అయితే సాయంకాలం కాక ముందే ఆ గుమ్మం మూయకూడదు.
3
విశ్రాంతిదినాల్లో, అమావాస్యల్లో దేశప్రజలు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయాలి.
4
విశ్రాంతి దినాన పాలకుడు యెహోవాకు ఏ లోపం లేని ఆరు గొర్రె పిల్లలు, ఏ లోపం లేని ఒక పొట్టేలును దహనబలిగా అర్పించాలి.
5
పొట్టేలుతో 22 లీటర్ల పిండితో నైవేద్యం చేయాలి. గొర్రెపిల్లలతో తన శక్తికొలది నైవేద్యాన్ని, ప్రతి 22 లీటర్ల పిండికి ఒక లీటర్ నూనె తేవాలి.
6
అమావాస్య రోజున ఏ లోపం లేని చిన్న కోడెను, ఏ లోపం లేని ఆరు గొర్రె పిల్లలనూ, ఏ లోపం లేని ఒక పొట్టేలును అర్పించాలి.
7
నైవేద్యాన్ని సిద్ధపరచాలి, ఎద్దుతో, పొట్టేలుతో, 22 లీటర్లు, గొర్రెపిల్లలతో శక్తికొలదిగా పిండిని అర్పించాలి. ప్రతి 22 లీటర్ల పిండికి ఒక లీటర్ నూనె తేవాలి.
8
పాలకుడు ప్రవేశించేటప్పుడు వసారా మార్గం గుండా ప్రవేశించి అదే మార్గంలో బయటికి వెళ్ళాలి.
9
అయితే నియమిత సమయాల్లో దేశ ప్రజలు యెహోవా సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినప్పుడు ఉత్తర గుమ్మం గుండా వచ్చినవారు దక్షిణ గుమ్మం గుండా వెళ్ళాలి. దక్షిణ గుమ్మం గుండా వచ్చినవారు ఉత్తర గుమ్మం గుండా వెళ్ళాలి. ఎవరూ తాము వచ్చిన గుమ్మం గుండా తిరిగి వెళ్ళకుండా అందరూ తిన్నగా బయటికి వెళ్లిపోవాలి.
10
పాలకుడు వారితో కలిసి ప్రవేశించాలి, వారితో కలిసి బయటికి వెళ్ళాలి.
11
పండగ రోజుల్లో, నియమిత సమయాల్లో ఎద్దుతో, పొట్టేలుతో అయితే 22 లీటర్లు పిండి, గొర్రెపిల్లలతో శక్తి మేరకు పిండిని, ప్రతి 22 లీటర్ల పిండితో ఒక లీటర్ నూనె, నైవేద్యంగా అర్పించాలి.
12
పాలకుడు యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని అర్పించేటప్పుడు తూర్పు వైపు గుమ్మం తెరవాలి. విశ్రాంతి దినాన చేసినట్టే అతడు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తరవాత గుమ్మం మూయాలి.
13
ప్రతి రోజు ఏ లోపం లేని ఒక సంవత్సరం వయసున్న మగ గొర్రెపిల్లను దహనబలిగా అర్పించాలి. ప్రతి రోజు ఉదయాన దాన్ని అర్పించి దానితో నైవేద్యం చేయాలి.
14
అది ఎలాగంటే, 22 లీటర్ల గోదుమ పిండిలో ఆరో వంతు, దాన్ని కలపడానికి ఒక లీటరు నూనె ఉండాలి. ఇవి ఎవరూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు.
15
గొర్రెపిల్లలను, నైవేద్యాన్ని, నూనెను ప్రతి రోజు ఉదయాన్నే నిత్య దహనబలిగా అర్పించాలి.
16
ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, పాలకుడు తన కొడుకుల్లో ఎవరికైనా భూమిని ఇస్తే అది అతని స్వాస్థ్యం అవుతుంది. అది వారసత్వం వలన వచ్చిన స్వాస్థ్యం లాంటిది.
17
అయితే అతడు తన పనివారిలో ఎవరికైనా భూమి ఇస్తే అది విడుదల సంవత్సరం వరకే అది అతనికి హక్కుగా ఉంది తరువాత పాలకునికి తిరిగి వస్తుంది. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యానికి హక్కుదారులవుతారు.
18
ప్రజలు తమ స్వాస్థ్యాలను అనుభవించనీయకుండా పాలకుడు వారి భూమిని ఆక్రమించకూడదు. నా ప్రజలు తమ భూములను విడిచి చెదరిపోకుండేలా అతడు తన స్వంత భూమిలోనుండి తన కొడుకులకు భాగాలు ఇవ్వాలి.>>
19
ఆ తరవాత ఆయన గుమ్మపు మధ్యగోడ మార్గంలో ఉత్తరం వైపుకు తిరిగి ఉన్న యాజకులకు ఏర్పాటు చేసిన పవిత్రమైన గదుల్లోకి నన్ను తీసుకువచ్చాడు. అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు కనిపించింది.
20
యాజకులు అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని వండి, నైవేద్యాలను కాల్చే స్థలం ఇదే. వారు ఆ పవిత్రమైన వస్తువులను బయటి ఆవరణంలోకి తెస్తే ప్రజల్లో ఎవరైనా వాటిని తాకి ప్రతిష్ఠితులవుతారు కాబట్టి వాటిని బయటికి తేకూడదు, అని ఆయన నాతో చెప్పాడు.
21
అతడు బయటి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి ఆవరణపు నాలుగు మూలలను తిప్పాడు. ఆవరణం ప్రతి మూలలో మరొక ఆవరణం ఉన్నట్టు నాకు కనబడింది.
22
ఆవరణం నాలుగు మూలల్లో ఒక్కొక్క ఆవరణం ఉంది. ఒక్కొక్కటి 22 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉండి, నాలుగూ ఒకే పరిమాణంలో ఉన్నాయి.
23
ఆ నాలుగింటిలో చుట్టూ వరుసలో ఉన్న అటకలున్నాయి. ఆ అటకల కింద పొయ్యిలున్నాయి.
24
<<ఇది వంట చేసేవారి స్థలం, ఇక్కడ మందిర పరిచారకులు ప్రజలు తెచ్చే బలిపశుమాంసాన్ని వండుతారు>> అని ఆయన నాతో చెప్పాడు.
47
మందిరం నుండి పారే నది
1
ఆయన నన్ను మందిరపు గుమ్మానికి తోడుకుని వచ్చాడు. మందిరం తూర్పు వైపుకు తిరిగి ఉంది. నేను చూసినపుడు మందిరం గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణ దిశగా మందిరం కుడిపక్కన కింద నుండి పారుతున్నాయి.
2
తరవాత ఆయన ఉత్తరపు గుమ్మం మార్గంలో నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పుకు పోయే దారిలో బయటి గుమ్మానికి తోడుకుని వచ్చాడు. నేను చూసినప్పుడు అక్కడ గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉబికి పారుతున్నాయి.
3
ఆ వ్యక్తి కొలనూలు చేత పట్టుకుని తూర్పు వైపుకు వెళ్లి 540 మీటర్లు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు ఆ నీళ్లు చీలమండ లోతు వచ్చాయి.
4
ఆయన ఇంకో 540 మీటర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మోకాళ్ల లోతు వచ్చాయి. ఇంకా ఆయన 540 మీటర్లు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మొల లోతుకు వచ్చాయి.
5
ఆయన ఇంకా 540 మీటర్లు కొలిచాడు. అప్పుడు ఆ నీళ్లు చాల లోతుగా మారి నేను దాటలేనంత నది కనబడింది. దాటడానికి వీలులేకుండ ఈదాల్సినంత నీటితో ఉన్న నదిగా మారింది.
6
అప్పుడాయన నాతో <<నరపుత్రుడా, నీవు చూశావు గదా>> అని చెప్పి నన్ను మళ్ళీ నది ఇవతలికి తీసుకుని వచ్చాడు.
7
నేను వెనక్కి వస్తుండగా నదీతీరాన రెండు వైపులా చెట్లు విస్తారంగా కనబడ్డాయి.
8
అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. <<ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి ప్రవహించి అరబాలోకి దిగి సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా మారిపోతాయి.
9
ఈ నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావడం వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి.
10
ఏన్గెదీ పట్టణం మొదలుకుని ఏనెగ్లాయీము పట్టణం వరకూ చేపలు పట్టేవారు దాని ఒడ్డున నిలిచి వలలు వేస్తారు. మహా సముద్రంలో ఉన్నట్టు అన్ని రకాల జాతుల చేపలు దానిలో బహు విస్తారంగా ఉంటాయి.
11
అయితే ఆ సముద్రంలోని బురద స్థలాలు, ఊబి తావులు బాగవ్వక ఉప్పును అందిస్తూ ఉంటాయి.
12
నదీతీరాన రెండు వైపులా ఆహారమిచ్చే సకల జాతుల వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి ప్రవహిస్తున్నది కాబట్టి ఆ చెట్లు ప్రతి నెలా కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికీ వాటి ఆకులు ఔషధాలకు పని చేస్తాయి.>>
భూమి సరిహద్దులు
13
ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే <<సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకోవాల్సిన భూమి ఇది. యోసేపు సంతానానికి రెండు భాగాలియ్యాలి.
14
నేను ఈ దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు ఈ దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. ఆ విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది.
15
ఉత్తరాన సెదాదుకు పోయే మార్గంలో మహా సముద్రం మొదలుకుని హెత్లోను వరకూ దేశానికి సరిహద్దు.
16
అది హమాతుకు, బేరోతాయుకు, దమస్కు సరిహద్దుకు, హమాతు సరిహద్దుకు మధ్య ఉన్న సిబ్రయీముకు, హవ్రాను సరిహద్దును ఆనుకుని ఉన్న మధ్యస్థలమైన హాజేరుకు వ్యాపిస్తుంది.
17
పడమటి సరిహద్దు హసరేనాను అనే దమస్కు సరిహద్దు పట్టణం, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
18
తూర్పుదిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు ఇశ్రాయేలీయుల దేశానికి మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకూ దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు.
19
దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటల వరకూ నది దారిలో మహాసముద్రానికి మీ సరిహద్దు ఉంటుంది. ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
20
పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకూ మహాసముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు.
21
ఇశ్రాయేలీయుల గోత్రాల ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి.
22
మీరు చీట్లువేసి మీకూ మీలో నివసించి పిల్లలు కన్న పరదేశులకూ ఆస్తులను విభజించేటప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టిన వారిగానే ఆ పరదేశులను మీరు ఎంచాలి. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తాము కూడా స్వాస్థ్యం పొందేలా మీలాగా వారు కూడా చీట్లు వేయాలి.
23
ఏ గోత్రంలో పరదేశులు కాపురముంటారో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వాలి.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
48
భూ భాగాలు విభజన
1
గోత్రాల పేర్లు ఇవి. దానీయులకు ఒక భాగం. అది ఉత్తరదిక్కు సరిహద్దు నుండి హమాతుకు వెళ్ళే మార్గం వరకూ హెత్లోనుకు వెళ్ళే సరిహద్దు వరకూ హసరేనాను అనే దమస్కు సరిహద్దు వరకూ హమాతు సరిహద్దు దారిలో తూర్పుగా, పడమరగా వ్యాపించి ఉన్న భూమి.
2
దాను సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగం.
3
ఆషేరీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగం.
4
నఫ్తాలి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం.
5
మనష్షేయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగం.
6
ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగం.
7
రూబేనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగం.
8
యూదావారి సరిహద్దును అనుకుని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్టించే పవిత్రమైన స్థలం ఉంటుంది. దాని వెడల్పు 13 కిలోమీటర్ల 500 మీటర్లు దాని పొడవు తూర్పు నుండి పడమర వరకూ మిగిలిన భాగాల్లాగా ఉంటుంది. పరిశుద్ధ స్థలం దాని మధ్యలో ఉండాలి.
9
యెహోవాకు మీరు ప్రతిష్టించే ఈ ప్రదేశం 13 కిలోమీటర్ల, 500 మీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల, 400 మీటర్ల వెడల్పు ఉండాలి.
10
ఈ పవిత్రమైన స్థలం యాజకులది. అది ఉత్తరాన 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, పశ్చిమాన 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, తూర్పున 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, దక్షిణ దిక్కున 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు ఉండాలి. యెహోవా పరిశుద్ధస్థలం దాని మధ్య ఉంటుంది.
11
ఇది సాదోకు సంతతికి చెంది నాకు ప్రతిష్టితులై నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడే యాజకులది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోయినప్పుడు మిగిలిన లేవీయులు వారితో పోయినట్టు వారు నన్ను విడిచిపోలేదు.
12
పవిత్రమైన భూమిలో లేవీయుల సరిహద్దు దగ్గర వారికొక స్థలం ఉంటుంది. దాన్ని అతి పరిశుద్ధంగా ఎంచుతారు.
13
యాజకుల సరిహద్దును ఆనుకుని లేవీయులకు ఒక స్థలం ఏర్పాటు చేయాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ రెండు స్థలాల మొత్తం పొడవు 13 కిలోమీటర్ల 500 మీటర్లు. వెడల్పు పది కిలో మీటర్ల 800 మీటర్లు ఉంటుంది.
14
అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కాబట్టి దానిలో ఏ కొంచెం భాగమైనా వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి ప్రథమ ఫలాలను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.
15
13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న మిగిలిన స్థలం సమిష్టి భూమిగా ఎంచి, పట్టణంలో నివాసాలకు, మైదానాలకు వాడాలి. దాని మధ్య నగర నిర్మాణం జరుగుతుంది.
16
నగర పరిమాణ వివరాలు, ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, దక్షిణాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, తూర్పున రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, పశ్చిమాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల,
17
నగరానికి చేరిన ఖాళీ స్థలం ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు పడమటి వైపు, నాలుగు దిక్కుల్లో సమానంగా 135 మీటర్లు ఉండాలి.
18
పవిత్రమైన భూమిని ఆనుకుని ఉన్న మిగిలిన భూమి ఫలం పట్టణంలో పనిచేసి జీవించే వారికి ఆధారంగా ఉంటుంది. అది పవిత్రమైన భూమిని ఆనుకుని తూర్పున ఐదు కిలోమీటర్ల 400 మీటర్లు, పడమటి వైపున ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల, ఉంటుంది.
19
ఏ గోత్రపు వారైనా పట్టణంలో కష్టపడి జీవించేవారు దాన్ని సాగుబడి చేస్తారు.
20
పవిత్రమైన భూమి అంతా 13 కిలోమీటర్ల 500 మీటర్ల నలు చదరంగా ఉంటుంది.
21
పవిత్రమైన భూమికి, నగరానికి ఏర్పాటైన భూమికి రెండు వైపులా ఉన్న భూమి పాలకునిది. తూర్పున 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది తూర్పు సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది. పడమర 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది పడమర సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది.
22
యూదా వారి సరిహద్దుకు, బెన్యామీనీయుల సరిహద్దుకు మధ్యగా ఉన్న భాగం పాలకునిది. ఆ భాగం లోనే లేవీయుల స్వాస్థ్యం, నగరానికి ఏర్పాటైన భూమి ఉంటాయి.
23
తూర్పు నుండి పడమటి వరకూ కొలవగా మిగిలిన గోత్రాలకు భాగాలు ఏర్పాటవుతాయి.
24
బెన్యామీనీయులకు ఒక భాగం, వారి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగం.
25
షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగం.
26
ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగం.
27
జెబూలూనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగం.
28
దక్షిణదిక్కున తామారునుండి కాదేషులో ఉన్న మెరీబా ఊటలవరకూ నది వెంబడి మహా సముద్రం వరకూ గాదీయులకు సరిహద్దుగా ఉంటుంది.
29
మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రాలకు పంచిపెట్టాల్సిన దేశం ఇదే. వారి వారి భాగాలు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ.
నగర ద్వారాలు, దేవుని సన్నిధి
30
నగర వైశాల్యం ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్లు.
31
ఇశ్రాయేలీయుల గోత్రాల పేర్ల ప్రకారం నగర గుమ్మాలకు పేర్లు పెట్టాలి. ఉత్తరాన రూబేనుదనీ, యూదాదనీ, లేవీదనీ మూడు గుమ్మాలు ఉండాలి.
32
తూర్పు వైపు 2 కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు ఉంది. ఆ వైపున యోసేపుదనీ, బెన్యామీనుదనీ, దానుదనీ, మూడు గుమ్మాలుండాలి.
33
దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున షిమ్యోనుదనీ, ఇశ్శాఖారుదనీ, జెబూలూనుదనీ, మూడు గుమ్మాలుండాలి.
34
పడమటి వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున గాదుదనీ, ఆషేరుదనీ, నఫ్తాలిదనీ మూడు గుమ్మాలుండాలి.
35
ఆ నగరం చుట్టు కొలత తొమ్మిది కిలోమీటర్ల, 700 మీటర్ల పొడవు. <<యెహోవా ఉండే స్థలం
>> అని ఆనాటి నుండి ఆ పట్టణానికి పేరు.